చేతులు కలిపారు. అనుకున్నది సాధించారు. ఆధ్యాత్మిక కేంద్రమైన యాదాద్రి ప్రాంతంలో సహజ సిద్ధమైన, సుగంధ భరితమైన అగర్బత్తీలను తయారు చేస్తున్నారు. నృసింహుడి క్షేత్రంలోని పూల వ్యర్థాలు, ఆవు పేడ, కొబ్బరి చిప్పలే వారికి ముడిసరుకు. ఆలేరు, యాదగిరిగుట్టకు చెందిన పద్దెనిమిది మంది మహిళలు సంఘంగా ఏర్పడి గుట్టదేవుడి భక్తి పరిమళాలను అగరొత్తుల కట్టలుగా ప్రపంచానికంతా పంచుతున్నారు.
గ్రామీణ మహిళలు సైతం వినూత్నమైన ఆలోచనలతో ముందుకొస్తున్నారు. వ్యర్థాలకు కొత్త అర్థం కల్పిస్తున్నారు. ఆలేరు, యాదగిరిగుట్టకు చెందిన ‘వాగ్మి’ మహిళా సంఘం సభ్యులు స్వయం ఉపాధి కోసం అగరొత్తుల తయారీపై దృష్టి సారించారు. అంతాకలసి, ఆలేరులోని ప్రభుత్వ ఇండోర్ స్టేడియం ఆవరణలో ఓ కుటీర పరిశ్రమను ప్రారంభించారు. కలెక్టర్ పమేలా సత్పతి చొరవతో సుమారు రూ. 6 లక్షల విలువచేసే యంత్రం, ముడి పదార్థాలు సమకూర్చుకున్నారు. తలాకొంత పోగేసి.. అదనపు నిధులు సిద్ధం చేసుకున్నారు. తొలి ప్రయత్నంగా.. ‘వాగ్మి’ పేరిట రెండు రకాల అగర్ బత్తీలను తయారు చేస్తున్నారు. ఒకటి ‘సుమధుర’. అరవై అయిదు స్టిక్స్ ఉండే ప్యాకెట్ విలువ ఎనభై రూపాయలు. మరొకటి ‘కటాక్ష’. దీని ధర వంద రూపాయలు. తయారీలో తులసి, కర్పూరం ప్రధాన ముడిసరుకుగా వాడతారు. మహిళా సంఘాల సహకారంతో గుట్ట మీదే కాకుండా.. ఇతర ఆలయాలు, కలెక్టర్ కార్యాలయం వద్ద స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఆన్లైన్ విక్రయాల కోసం ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ఇ-విక్రయ కేంద్రాలను సంప్రదిస్తున్నారు. పోస్టల్ శాఖతో చేతులు కలిపే ఆలోచన కూడా ఉంది.
గుడి నుంచి ముడి సరుకులు
యాదగిరిగుట్ట దేవుడు పూల రంగడు, అలంకార ప్రియుడు. నిత్యార్చనల్లో స్వామికి వివిధ పుష్పాలను సమర్పిస్తారు. ఆ నిర్మాల్యం ఇప్పటివరకూ వృథాగానే పోతున్నది. వీటితోపాటు గోశాలలోని ఆవు పేడను, చెత్తపాలవుతున్న కొబ్బరి చిప్పలను కూడా సేకరించి.. అగరు బత్తీల తయారీలో వినియోగిస్తున్నారు. రానున్న రోజుల్లో కుంకుమ, పసుపు, పెన్సిళ్లు, కొబ్బరి చిప్పల కళాకృతులను మార్కెట్లో తీసుకొస్తామని సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. అగరొత్తుల తయారీ కోసం ఆలేరు, యాదరిగుట్ట పట్టణాలకు చెందిన పద్దెనిమిది మంది రిసోర్స్ పర్సన్లు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన మహిళా సంఘాల సభ్యులు మాత్రమే ఉంటారని ‘వాగ్మి’ ప్రతినిధులు చెబుతున్నారు.
సహజసిద్ధంగా
తిరుమల తిరుపతి దేవస్థానం అనుసరిస్తున్న విధానం ప్రకారమే. రసాయన రహిత అగర్ బత్తీలను తయారు చేస్తున్నారిక్కడ. యాదాద్రి గోశాల నుంచి ఆవు పేడను, స్వామివారికి అలంకరించిన గులాబీలు, చామంతులు, తులసితోపాటు కొబ్బరి చిప్పలను సేకరిస్తున్నారు. తయారీ ప్రక్రియలో భాగంగా.. మొదట ఆవుపేడ, పూలు, కొబ్బరి చిప్పలను పొడిచేసి ఆరబెడతారు. ఆ తర్వాత వీటన్నిటినీ ముద్దగా చేసి యంత్రంలో వేస్తారు. అగర్ బత్తీల పొగ పీల్చినా ఇబ్బంది రాకుండా సహజ సిద్ధ సుగంధ ద్రవ్యాలైన పచ్చ కర్పూరం, హారతి కర్పూరం, తులసి నూనె విరివిగా వినియోగిస్తారు. ఏ స్థాయిలోనూ రసాయనాల వాడకం ఉండదు. ‘మహిళలు స్వయంశక్తితో ఎదిగేందుకు ఓ మంచి పరిశ్రమను స్థాపించాలని అనుకున్నాం. యాదాద్రి దేవస్థానంలో వృథాగా పోతున్న నిర్మాల్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ..
తక్కువ పెట్టుబడితో అగరొత్తులు తయారు చేయాలని భావించాం. వెంటనే, ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాం. కలెక్టర్ పమేలా సత్పతి సహకారంతో మహిళా సంఘాల సభ్యులకు మూడు నెలల క్రితం అగరొత్తుల తయారీలో శిక్షణ ఇచ్చాం. రానున్న రోజుల్లో మరిన్ని ఉత్పత్తులు పరిచయం చేస్తాం’ అంటారు ఆలేరు తహసీల్దారు రామకృష్ణ. ‘ప్రభుత్వ సబ్సిడీ రుణాల సాయంతో ఆర్థికంగా ఎదగాలన్నది మా ఆకాంక్ష’ అని వివరిస్తారు వాగ్మి మహిళా సంఘం సభ్యురాలు అన్నపూర్ణ. త్వరలోనే ఈ అగర్ బత్తీలు భగవంతుడికి, భక్తుడికి మధ్య అనుసంధానం చేయనున్నాయి. వాటిలో ఆధ్యాత్మిక పరిమళాలే కాదు, శ్రమ సౌరభాలూ గుబాళిస్తాయి. పరమాత్మకు అంతకు మించిన నివేదన ఏం ఉంటుంది!
– తండ జహంగీర్ గౌడ్