Telangana | చెల్లెకు ఆపతొస్తే.. ‘భయపడకు చెల్లే నేనున్నా’ అని అన్న అండగా నిలుస్తడు. అక్కకు తీరని కష్టం వస్తే.. ‘తోడవుట్టిన కదా.. నీ కష్టంల తోడుండనా అక్కా’ అని తమ్ముడు ధైర్యం చెప్తడు. తోడవుట్టిన ఆడబిడ్డ పేదింటిరాలు అయితే.. మేనకోడలు మంచిచెడ్డలకు మేనమామనే ముందుండి నడిపిస్తడు. ఓ కొడుకుంటే.. ఇంట్ల పెద్దమనుషులకు ఆసరా అయితడు. బాలింతలుంటే.. కడప కావలి గాసే ద్వారపాలకుడు అయితడు. అన్న, తమ్ముడు, మేనమామ, పెద్దకొడుకు.. ఈ పాత్రలన్నీ తెలంగాణలో ఒక్కడే పోషిస్తున్నడు. ఆయనే.. ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ స్వరాష్ట్రమై పదేండ్ల సంబురాలు చేసుకుంటున్న తరుణంలో ఆడబిడ్డల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలపై ప్రత్యేక కథనం..
ఆషాఢమొస్తే అమ్మవారికి బోనమెక్కిచ్చి, కల్లు సాకలు పోసి, పొర్లు దండాలు పెట్టి చల్లగ చూడమని వేడుకోవడం తెలంగాణల ఆనవాయితీ. శ్రావణమొస్తే.. పల్లెలన్నీ గ్రామాన్ని కాచే ఊరిదేవతకు పబ్బతి పడ్తయి. ఆడబిడ్డల నవ్వులతో కళకళలాడే బతుకమ్మ సంబురమే తెలంగాణకు పెద్ద పండుగ. అమ్మకు, ఆడబిడ్డకు ఈ రాష్ట్రమిచ్చే గౌరవం అది. ఒకప్పుడు, ఉమ్మడి పాలనలో తెలంగాణ మహిళకే కాదు.. తెలుగు మహిళకు ఒనగూరిన ప్రయోజనమెంత? ఉమ్మడి సర్కార్ తెచ్చిన పథకాలెన్ని? ఏవీ? ఇంటికి పెద్దదిక్కు నాయినమ్మకు ఇచ్చిన పింఛిని పైసలు రూ.200 మాత్రమే. ఒంటరి మహిళలకు భద్రత, భరోసా గురించి ఆలోచించిన నరమానవుడే లేడు. ఆడపిల్ల పెండ్లి గుండెల మీద భారమై పానాలు తీసుకున్న తండ్రుల ఎత పట్టించుకున్నది ఎవరు? మరి ఇప్పుడు.. తెలంగాణ స్వరాష్ట్రమై తొమ్మిదేండ్లు దాటి పదేండ్ల ప్రగతి వైపు పరుగులు తీస్తున్నది. రాష్ట్రం వచ్చినంక ఆడబిడ్డలను కంటికి రెప్పలా.. గుండెలో గువ్వలా కాపాడుకుంటున్నది తెలంగాణ ప్రభుత్వం. ఏ పథకం పెట్టినా.. ఏ కార్యక్రమం చేపట్టినా.. ఆడబిడ్డల అభివృద్ధే తొలి ఎజెండా. ఆ ఫలితమే.. కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, ఆసరా, అమ్మ ఒడి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, ఆరోగ్య లక్ష్మి, చేనేత లక్ష్మి, వితంతు పింఛన్, ఒంటరి మహిళా పింఛన్, షీ టీమ్స్, భరోసా లాంటి మహిళా సంక్షేమ పథకాలు.
ఎవరూ గిన్ని పైసలియ్యలే
‘నోరు తెర్శి అడగలేనోళ్లకు కూడా.. కడుపు నిండా అన్నం పెడుతున్నడయ్యా కేసీఆర్. ఒకప్పుడు మాకు ఎవుసం ఉండె. ఇప్పుడు లేదు. కొడుకు, కోడలు పట్నంల ఉంటరు. బిడ్డ పెండ్లి చేసి అప్పులు తీర్సనీకే పట్నం పోయిండు కొడుకు. కల్యాణలక్ష్మి పైసలు లక్షా నూట పదహారు రూపాయలు వచ్చినయ్. ఆ పైసలు శాన అక్కరొచ్చినయ్. నాకు రెండు వేలు పింఛినొస్తుంది. ఉప్పు, తొక్కుకు సరిపోతున్నయ్. వారానికో పదిరోజులకో కొడుకు, కోడలు వచ్చిపోతనే ఉంటరు. మా అసొంటి ముసలోళ్లకు ఇంతకంటే ఆసరా ఏముంటది బిడ్డా? ఎక్వ ఆశపడొద్దు.. ఆగం కావొద్దు నాయినా. అంతకు మునుపు ఎవ్వరు మాకు గిన్ని పైసలియ్యలే. ఇప్పుడు కేసీఆర్ ఇస్తున్నడు. సల్లగ బత్కనీ కొడుకు’ అంటున్నది మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం కర్కాలకు చెందిన ఇంతల మల్లమ్మ. తెలంగాణ రాక మునుపు ఇల్లు కట్టుకునేందుకు పైసలు లేక.. కరువు వల్ల పంటలు పండక భూమి అమ్మి కట్టుకున్నరు. తెలంగాణ వచ్చినంక కాలం అయింది. కాకపోతే పండించుకోనీకే భూమి లేదు. కల్యాణలక్ష్మి పథకం వస్తదన్న ధైర్యంతో అప్పు చేసి బిడ్డ పెండ్లి చేసిండు మల్లమ్మ కొడుకు మల్లయ్య. ఆసరా పింఛన్ రెండు వేలు తల్లి ఖర్చులకు సరిపోతయన్న నమ్మకంతో తల్లిని ఊర్లోనే వదిలి పనికోసం పట్నం బాటపట్టిండు. ‘కొడుకు పట్నంల ఉన్నా.. ఆకలిదూప సమయానికి పింఛిని పైసల్ అందుతున్నయ్. పెద్ద కొడుకులెక్క ఆసరైతున్న కేసీఆర్ కూడా నా కొడుకే’ అంటున్నది మల్లమ్మ. ఇది ఒక్క మల్లమ్మ మనోగతమే కాదు. ఎంతోమంది తల్లులు, వృద్ధుల మనసులో మాట. అంబటాల్ల కాంగనే.. పెద్ద కోడలు చాయ పోస్తదో.. చిన్న కోడలు బుక్కెడు బువ్వ పెడ్తదో అని ఎదురుచూసే రోజులకు స్వస్తి పలికిన సీఎం కేసీఆర్ ఆలోచనకు అందుతున్న అభినందనలు, ఆశీర్వాదాలు ఇవి.
కోటితో సమానం
‘మా నాన్న సన్నకారు రైతు. ఎంతో కష్టపడి మమ్ముల చదివించిండు. నేను బీటెక్ చేసిన. నాకు, చెల్లెకు ఘనంగ పెండ్లిచేసిండు. మా ఇద్దరి పెండ్లిలకు అప్పులైనయ్. కూలి పనులు చేసుకుని బతికే జీవితాలకు.. ఆడబిడ్డ పెండ్లి, అప్పుల భారం అంటే మోయలేని బరువే. ఆ బరువును కేసీఆర్ సార్ సగం తగ్గించిండు. నాకు, మా చెల్లెకు కల్యాణలక్ష్మి వచ్చింది. నాన్నకు చాలా హెల్ప్ అయినయ్ ఆ పైసలు’ అంటున్నది నెల్లికుదురు మండలం బ్రాహ్మణ కొత్తపల్లికి చెందిన సుమాంజలి. కడుపుల పుట్టినందుకు ఎన్నో కష్టాలు అనుభవించి.. సాది అప్పోసప్పో చేసి పెండ్లి చేసిన తండ్రి కష్టాన్ని ఏ బిడ్డ అయినా తట్టుకోలేదు. నిస్సహాయ స్థితిలో తండ్రి గుండెల మీద పడి ఏడ్వటం తప్ప ఏమీ చేయలేదు. కానీ.. తన పెండ్లికి పెద్దమనిషిలా.. లక్ష రూపాయల కల్యాణలక్ష్మి సాయం చేసిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు ఎంతోమంది ఆడబిడ్డలు చేతులెత్తి దండం పెడుతున్నరు. ‘మా నాన్న కష్టం అర్థం చేసుకున్న దేవుడాయన. పేదోని బిడ్డ పెండ్లికి లక్ష రూపాయల సాయం అంటే.. అది కోటి రూపాయలతో సమానం’ అంటున్నరు ఎంతోమంది ఆడబిడ్డలు.
నెలంతా సరిపోతున్నయ్
‘40 ఏండ్ల కింద నా బిడ్డ పెండ్లి చేసిన. అప్పుడు ఎవ్వరు ఏ సాయం అందియ్యలే. కేసీఆర్ని చూస్తుంటే నలభై ఏండ్ల కిందనే గీన ముఖ్యమంత్రి అయితె బాగుండు అనిపిస్తది అప్పుడప్పుడు. కల్యాణలక్ష్మి పథకం ఎంత గొప్పదో.. పేదోనికి తెల్సు నాయినా. నా ఇద్దరు మన్మరాండ్ల పెండ్లికి కల్యాణలక్ష్మి వచ్చింది. ఇద్దరికీ పిల్లలు పుట్టిర్రు. కేసీఆర్ కిట్లు వచ్చినయ్. నాకు పింఛినొస్తుంది. అంతకుముందు రెండొందలు వచ్చేవి. రెండుసార్లు నొప్పుల గోలీలు తెచ్చుకుంటే.. పైసల్ ఖతం. ఇప్పుడు రెండు వేలొస్తున్నయ్. నెలంతా సరిపోతున్నయ్’ అని ముర్సుకుంట చెప్తున్నది కర్కాల గ్రామానికి చెందిన శెగ్గెం ఉపేంద్ర. ఇయ్యాల ఒక ఉపేంద్రమ్మ, ఒక మల్లమ్మల మనవరాళ్లు, కొడుకులే కాదు.. తెలంగాణల ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఒక పథకాన్ని పొందినవారే. సంక్షేమ పథకాల చల్లదనాన్ని ఆస్వాదించినవారే. కుల, మత తారతమ్యాలకు తావియ్యకుండా అందరినీ తనోళ్లే అనుకొని తల్లిలా చల్లటి పాలన చేస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన ముసలమ్మలు చెప్తుంటే.. సంక్షేమ తెలంగాణకు ఇంతకంటే వేరే నిర్వచనముంటదా అనిపిస్తున్నది.
బేఫికర్ ఉంటా
కేసముద్రం మండలం కల్వల గ్రామానికి చెందిన కృపాకర్ రెడ్డి డిగ్రీ దాకా చదువుకున్నడు. కొలువు కోసం ప్రయత్నం చేసినా రాలేదు. ఆయనకు ఇద్దరు బిడ్డలు. మూడెకరాల భూమి. అక్షరం విలువ తెలిసినవాడు కావడంతో బిడ్డలను బాగా చదివించాలనుకున్నడు. కాలం కలిసిరాక, పంటలు పండకపోతే బిడ్డలను తీసుకొని హైదరాబాద్ వచ్చిండు. ఎంత కష్టమొచ్చినా బిడ్డల చదువు ఆగనియ్యలేదు. చిన్నబిడ్డ దివ్యకు మూడేండ్ల పాటు ఏడాదికి రూ.35 వేలు చొప్పున ఫీజ్ రీయింబర్స్మెంట్ వచ్చింది. ఇద్దరికీ పెండ్లి చేస్తే.. కల్యాణలక్ష్మి వచ్చింది. పెండ్లి చేసి పంపేటప్పుడు తనకున్న మూడెకరాల్లో చెరొక ఎకరం రాసిచ్చిండు. ‘ఇద్దరు బిడ్డల పెండ్లి చేసిన. ఎకరం భూమిల పంట పండించుకుంటున్న. నాకు, నా భార్యకు సరిపోతది. ఒకవేళ చేతగాని రోజులు వస్తే.. తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఇస్తది. బేఫికర్ ఉంటా’ అంటున్నడు కృపాకర్ రెడ్డి. బిడ్డల పెండ్లి చేసి, ఉన్న భూమి వాళ్లకిచ్చినా.. రేపటినాడు తనకు, తన భార్యకు ప్రభుత్వం భరోసా ఇస్తదని చెప్తున్న ఆయన మాటలు ఉద్యమ నాయకుడి మీద, తెలంగాణ ప్రభుత్వం మీద నమ్మకాన్ని సూచిస్తున్నయి. ఇక భర్త లేక, పెండ్లి కాక, చేసుకోక ఏకాకిగా ఉంటున్న మహిళలు భరించే చీదరింపులు, చిన్నచూపు గురించి చెప్పాల్సిన అవసరం లేదు.
అలాంటి ఎంతోమంది ఒంటరి మహిళలకు అన్నగా.. అండగా నిలవా లన్న కేసీఆర్ ఆలోచనకు అద్భుత రూపమే.. ఒంటరి మహిళల పింఛన్. ‘పెండ్లి అయిన మూడేండ్లకు మేమిద్దరం విడిపోయినం. పిల్లలు అయితలేరని నా భర్త నన్ను వదిలేశిండు. తొమ్మిదేండ్ల సంది అమ్మవాళ్ల ఇంటికాడనే ఉంటున్న. ఒంటరి మహిళ పింఛను వస్తున్నది. చిట్టి ఏస్కుంటున్న. ఇంట్ల అమ్మకు పనిల సాయమైతున్న. దొరికిన నాడు కూలి పనికి పోత. లేకపోతే.. ఇంటికాడనే ఉంట. మా అసొంటోళ్ల గురించి ఆలోచన చేసి ఇంత సాయం చేస్తున్న కేసీఆర్ సార్కు ఎప్పటికీ రుణపడే ఉంటం’ అంటున్నది కల్వల గ్రామానికి చెందిన శ్రీలత. ఇలాంటి ఎంతోమంది ఒంటరి మహిళలు.. ఏ అండా లేని తమకు అన్నలా తోడుగా నిలబడి నందుకు ముఖ్యమంత్రికి చేతులెత్తి మొక్కుతున్నరు.
గర్వంగా ఫీలైతున్న..
‘బిడ్డా! కల్యాణలక్ష్మి పైసలొచ్చినయ్. పెండ్లికి ఒక తాన తెచ్చిన. ఆయినెకు ఇచ్చేస్తున్న’ అని నాయిన చెప్పంగనె నాకు కండ్లల్ల నీళ్లు తిర్గినయ్. దేశంల ఏ రాష్ట్రంల లేని పథకం మన రాష్ట్రంల ఉన్నది. తెలంగాణల పుట్టినందుకు.. కేసీఆర్ సార్ లాంటి సీఎం ఉన్నందుకు గర్వంగా ఫీలైతున్న. నా అసొంటి ఎంతోమంది ఆడబిడ్డలకు, ఆడబిడ్డల తల్లిదండ్రులకు పెద్దాయన ఒక అండ. దేవునికి దండం పెట్టినట్టు ఆయనకు చేతులెత్తి దండం పెట్టినా తక్కువనే. ఆయనకు నాలాంటి ఆడబిడ్డల సపోర్ట్ ఎప్పటికీ ఉంటది.
పాలె సుష్మా లెనిన్, లక్షెట్టిపేట, మంచిర్యాల జిల్లా
మా ఇంటిదేవుడు
పెద్ద కొడుకు సచ్చిపోయిండు. మా ముసలాయనకు చేతగాదు. ఇంకో కొడుకు మానసిక వికలాంగుడు. కోడలు, నేను చేస్తేనే ఇంట్లకు ఎల్తది. మగదిక్కు లేని కుటుంబం. మా ముసలాయనకు ఆసరా పింఛిని వస్తది. కోడలికి వితంతు పింఛిని వస్తది. చిన్న కొడుకుకు వికలాంగుల పింఛిని వస్తది. ఏ దిక్కూ లేని మా
అసొంటోళ్లకు కేసీఆర్ పెద్ద దిక్కయిండు. ఆయన రుణం తీర్చలేనిది.
శింగని మల్లమ్మ, కల్వల గ్రామం, మహబూబాబాద్ జిల్లా
మా పెద్దన్న
భర్త లేని మహిళ అంటే ఒక్కొక్కరు ఒక్కోరకంగ మాట్లాడుతరు. ఏ ఆదరువు లేదని అలుసుగ చూస్తరు. నా అసొంటోళ్లకు సీఎం సారే తోబుట్టువు అయిండు. నేనున్న అని భరోసా ఇస్తుండు. మా గోస తీర్చిన పెద్దన్న కేసీఆర్.
శ్రీలత, కల్వల గ్రామం, మహబూబాబాద్ జిల్లా
నా బిడ్డకు మేనమామ
నేను వికలాంగుణ్ని. మేస్త్రీ పని చేస్త. పెద్దబిడ్డ పెండ్లికి మూడు లక్షలు అప్పు చేసిన. అప్పుడు కల్యాణలక్ష్మి పథకం లేదు. మొన్ననే చిన్నబిడ్డ పెండ్లి చేసిన. మళ్ల మూడు లక్షల అప్పయ్యింది. కల్యాణలక్ష్మి కింద లక్ష రూపాయలు వచ్చినయ్. అప్పు కట్టిన. నా బిడ్డకు కేసీఆర్ సార్ మేనమామ లెక్క సాయం అందించిండు. ఆయన రుణం మర్చిపోం.
లింగాల వెంకన్న, కేసముద్రం
అర్జీ పెట్టుకోక ముందే..
ఈ ఫొటోలో కనిపించే స్వప్న (37), మాధవి (35) అక్కా చెల్లెళ్లు. ఇద్దరూ మానసిక వికలాంగులు. తండ్రి పక్షవాతంతో మంచానపడ్డాడు. తెలంగాణ రాకముందు ఎన్నిసార్లు అధికారుల చుట్టు తిరిగినా, నాయకులకు మొర పెట్టుకున్నా పింఛన్ రాలేదు. అసలు వీళ్ల మాటలే ఎవరూ పట్టించుకోలేదు. రెండేండ్ల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సదరన్ క్యాంపులో అధికారులు వాళ్లంతట వాళ్లే ఇద్దరికీ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆ మరుసటి నెల నుంచే ఇద్దరికీ వికలాంగుల పింఛన్ వస్తున్నది. ఇద్దరి వైద్యానికి, మందులకు సరిపోతది. ఇంటి ఖర్చుల కోసం తల్లి హైమావతి పిండిగిర్నీ నడిపిస్తది. ఇద్దరు బిడ్డలకు పింఛన్ రావడం వల్ల వారి ఖర్చులకు చాలా ఆసరా అయితుంది. ‘అంతకుముందున్న ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు. నోరు తెరిచి అడిగినా సాయం చేయలేదు. కేసీఆర్ ప్రభుత్వం మాత్రం అర్జీ పెట్టుకోక ముందే నా బిడ్డలకు పింఛన్ ఇస్తున్నది. రేపటినాడు మేము సచ్చిపోతే నా బిడ్డలను ఎవరు సూస్తరు అన్న దిగులు ఉండేది. ఇప్పుడు ఏదన్న ఆశ్రమంల ఏసినా.. వాళ్ల పింఛన్ డబ్బులే వాళ్ల ఖర్సుల మందం అయితయన్న భరోసా ఉంది’ అంటూ నీళ్లు నిండిన కండ్లతో చెప్తున్నది తల్లి హైమావతి.
కేసీఆర్ సార్ పుణ్యమే..
మా ఊర్ల ఆడబిడ్డ పెండ్లి చేసేటందుకు తండ్రులు పడ్డ కష్టాలు చిన్నప్పటి నుంచి చాలా చూశిన. నా పెండ్లి చేయనీకె మా నాన్న ఎంత ఇబ్బంది పడుతడో అని ఆలోచించేదాన్ని. కానీ.. కల్యాణలక్ష్మి పథకంతో కేసీఆర్ సార్ మాలాంటి ఎంతోమంది పేదోళ్ల పెండ్లికి పెద్దమనిషిలా నిలబడ్డాడు. ఆయన చేసిన సాయం కేవలం ఆడబిడ్డ పెండ్లికి మాత్రమే కాదు.. ఒక కుటుంబం పరువు, ప్రాణాలు నిలబడేందుకు కారణమైనది. బిడ్డ పెండ్లికి పైసలు లేక సచ్చిపోయిన ఎంతోమందిని చూశినం. కేసీఆర్ పుణ్యమా అని కల్యాణ లక్ష్మి పథకం వచ్చినంక బిడ్డ పెండ్లి చేయలేక ఏ తండ్రీ ఆత్మహత్య చేసుకోలేదు. ఇది చాలదా.. కేసీఆర్ తెలంగాణకు చేసిందేందో చెప్పడానికి.
సుమాంజలి, బ్రాహ్మణ కొత్తపల్లి