Pradosha Kalam | ప్రదోషకాలం అత్యంత పవిత్రమైంది. ఇది నెలకు రెండుసార్లు వస్తుంది. శుక్ల, కృష్ణ పక్షాలలో వచ్చే త్రయోదశి నాడు సూర్యాస్తమయం తర్వాత 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోషకాలం అని చెబుతారు. సూర్యాస్తమయం తర్వాత మూడు గడియలు (గంటా పన్నెండు నిమిషాలు) ప్రదోషకాలమని కొందరు చెబుతారు. ప్రదోషకాలం అంటే రాత్రికి ఆరంభ సమయంగా పరిగణిస్తారు. దీనిని పాపనిర్మూలన సమయంగా భావిస్తారు. ప్రదోషకాలంలో పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో ఆనందతాండవం చేస్తాడని ప్రతీతి. ఈ సమయంలో ఇష్టదైవానికి సంబంధించిన స్తోత్రాలు పఠించడం గానీ, భజనలు గానీ చేస్తే మంచిదని పెద్దల మాట. ప్రదోషకాలంలో శివలింగాన్ని ఆవుపాలతో అభిషేకిస్తే దీర్ఘాయుష్షు కలుగుతుందనీ, నెయ్యితో అభిషేకిస్తే మోక్షం లభిస్తుందనీ, గంధంతో అభిషేకం చేస్తే లక్ష్మీకటాక్షం ప్రాప్తిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.