టీనేజ్… దీని గురించిమాట్లాడుకోవడం, ఆ వయసులో ఉన్న వాళ్ల క్రేజీ చేష్టలు చూసి ఆనందించడం బాగానే ఉంటుంది. అయితే తెలిసీ తెలియని ఈ ప్రాయంలోనే వ్యక్తిత్వాలు రూపుదిద్దుకుంటాయని నమ్ముతుంది ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ స్వచ్ఛంద సంస్థ. ఎన్నో శారీరక, మానసిక మార్పులు చోటుచేసుకునే ఈ వయసులోనే వాటన్నిటి గురించి వారికి అర్థం చేయిస్తున్నది ఈ సంస్థ. సామాజికాంశాలను ఎలా ఎదుర్కోవాలో నేర్పిస్తూ బలమైన భావితరాలకు బాటలు వేస్తున్న ‘వాయిస్ ఫర్ గర్ల్స్’ ప్రధాన లక్ష్యం.. ఆడపిల్లల సమగ్ర అభివృద్ధే!
కౌమారదశకు రాగానే పిల్లల ప్రపంచం పూర్తిగా మారిపోతుంది. ఆడపిల్లల విషయంలో ఇది మరీ ఎక్కువగా ఉంటుంది. రజస్వల అయిన మర్నాటి నుంచీ ఇల్లూ, సమాజంలోని జనం ఆమెను చూసే కోణం మారిపోతుంది. అప్పటిదాకా ఆడామగా అనే తేడా లేకుండా పిల్లలందరితో కలిసి ఆడుకున్న ఆ ఆడకూతురుకు ఇకపై షరతులు వర్తిస్తాయని అంటారు ఇంట్లోవాళ్లు. వంట పనులు నేర్చుకోవాలంటూ హుకుం జారీ చేస్తారు. అబ్బాయిలతో మాట్లాడకూడదు, చీకటి పడేదాకా బయట తిరగకూడదు, ఫలానా చోటికి వెళ్లకూడదు… ఇలా ఎన్నో కట్టుబాట్లు. అంటే ఉన్నట్టుండి ఒక అమ్మాయి లోకమే మారిపోతుంది. అప్పటిదాకా విశాలంగా ఉన్న ప్రపంచం కుంచించుకుపోయిన భావన కలుగుతుంది. నలుగురిలో ఉన్నా ఒంటరితనాన్ని తెచ్చిపెడుతుంది. దీనికి తోడు ఆమెలో చాలా శారీరక మార్పులు సంభవిస్తాయి. వీటన్నిటినీ అవగాహన చేసుకుంటూ.. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటూ.. తన భవిష్యత్తును ఎలా రూపుదిద్దుకోవాలన్న విషయాన్ని నేర్పేందుకు క్యాంపుల రూపంలో శిక్షణ అందిస్తున్నది వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ. 2011లో ప్రారంభమైన ఈ వేదిక ద్వారా మూడు తడవల్లో ముప్పయ్ రోజులపాటు సాగే ఈ శిక్షణలు చాలామంది ఆడపిల్లల జీవితాల్లో బలమైన మార్పులు తీసుకువచ్చాయి. అనేక కట్టుబాట్ల మధ్య నలుగుతున్న టీనేజ్ ఆడపిల్లలకు మానసికంగా దన్ను అందించడంలో విజయవంతమయ్యాయి.
‘వాయిస్ ఫర్ గర్ల్స్’ ప్రభుత్వ బడులతోపాటు దిగువ మధ్యతరగతి పిల్లలు చదువుకునే ప్రైవేటు పాఠశాలలను క్యాంపుల నిర్వహణకు ఎంచుకుంటుంది. అక్కడి కౌమార దశలోని ఆడపిల్లలకు సమ్మర్-వింటర్ క్యాంపుల పేరిట శిక్షణను అందిస్తుంది. హైదరాబాద్ కేంద్రంగా నడిచే ఈ సంస్థ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తోపాటు ఉత్తర్ ప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, తమిళనాడుల్లోని వివిధ పల్లెలూ, పట్టణాల్లో పనిచేస్తున్నది. ఇక్కడ శిక్షకులు కూడా విద్యార్థులే. తమ వయసుకు దగ్గరలో ఉండే వాళ్లయితే పిల్లలు మనసు విప్పి మాట్లాడుతారన్నది సంస్థ ఉద్దేశం. అందుకే ఎక్కువ క్యాంపులకు హాజరైన, ఆసక్తి కలిగిన విద్యార్థినులతోపాటు, కాలేజీల నుంచి ఎంపిక చేసిన యువతులకు శిక్షణనిచ్చి వారి ద్వారా ఈ క్యాంపుల్ని నిర్వహిస్తారు.
ఎలా సాగుతుందంటే..
ఈ శిక్షణా శిబిరాలు మూడు అంచెల్లో ఉంటాయి. మొదటి విడతగా ‘పరిచయ్’ క్యాంపు నిర్వహిస్తారు. ఇందులో టీనేజ్లో జరిగే శారీరక మార్పుల గురించి చెబుతారు. అంతేకాదు, ప్రాథమిక హక్కులు, హింస నుంచి రక్షణ ఎలా పొందాలి.. లాంటి వాటిని వివరిస్తారు. అందానికీ, శక్తికీ కొలమానాలంటే ఏమిటి? లింగ వివక్ష పర్యవసానాలు ఎలా ఉంటాయి? సవాళ్లను ఎలా ఎదుర్కోవాలి? అనే అంశాలను ఇక్కడ ప్రస్తావిస్తారు. వీటన్నిటినీ పాఠం చెప్పినట్టు కాకుండా ఆటలూ, పాటలూ, స్కిట్ల రూపంలో వివరిస్తారు. ఇక రెండో దశ ‘దిశ’. ఇందులో చదువు, భవిష్యత్ ప్రణాళికలు, బాల్య వివాహాలు, చిన్న వయసులో గర్భధారణల వల్ల నష్టాలు, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, పోషకాహారం, మానసిక ఆరోగ్యం తదితర అంశాల మీద అవగాహన కల్పిస్తారు. అంతేకాదు నలుగురిలో చొరవగా ఎలా మాట్లాడాలో శిక్షణనిస్తారు. దాని తర్వాత అంచె ‘సఖి’. చివరి పదిరోజుల్లో బృంద నాయకులుగా వ్యవహరించడం ఎలా? కొత్త విషయాలు పది మందికీ బోధించడం ఎలా? లాంటి నాయకత్వ లక్షణాలకు సంబంధించిన పాఠాలు చెబుతారు. దీని ద్వారా పిల్లల వ్యక్తిత్వాలు బలమైనవిగా రూపుదిద్దుకుంటాయి. ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరుగుతుంది.
అబ్బాయిలకూ…
సమాజంలో ఆడామగా ఇద్దరూ సమానమే. అయితే ఆడపిల్లల పట్ల వివక్షను ఎదుర్కోవాలంటే మగ పిల్లల్లోనూ మార్పు రావాలి. అంటే, సమాజంలో తమతోపాటు భాగమైన వారి మీద వీళ్లకు సహానుభూతి కలగాలి. వాళ్ల శక్తి సామర్థ్యాలూ, ఇబ్బందులూ అన్నీ తెలిసి ఉండాలి. అప్పుడే వీళ్లు సమాజంలో లింగవివక్షను రూపుమాపే రాయబారులుగా తయారు కాగలుగుతారు. అందుకే ‘బాయ్స్ ఫర్ ఛేంజ్’ పేరిట టీనేజ్ మగపిల్లలకూ క్యాంపులు నిర్వహిస్తున్నది వాయిస్ ఫర్ గర్ల్స్.
అదే లక్ష్యం
‘నేటి బాలికలే రేపటి మహిళలు. ఇంటిని తీర్చిదిద్దడంలో వీళ్లది సింహ భాగం. అలాంటి అమ్మాయిలు వెనుకంజ వేస్తే వ్యవస్థే వెనకబడిపోతుంది. అందుకే జీవితంలో ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేలా ఆడపిల్లల్ని తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. జీవితాశయాలను నిర్దేశించుకోవాలని ప్రోత్సహిస్తున్నాం. తగిన వయసులో పెళ్లి చేసుకోగలిగేలా, తమ జీవితం గురించి తాము నిర్ణయం తీసుకోగలిగేలా వాళ్లను స్వతంత్రులుగా మలచాలని ప్రయత్నిస్తున్నాం. మా క్యాంపులు వివిధ దశల్లో దాదాపు ఏడాది నుంచి ఏడాదిన్నర వ్యవధిలో కొనసాగుతాయి. దానివల్ల మేం ఎక్కువ కాలం పిల్లలతో కలిసి పనిచేయగలుగుతాం. శిక్షణ తర్వాత చాలామంది పిల్లల్లో మేం బలమైన మార్పును గమనించాం. దీనివల్ల ఆడపిల్లలు అవసరమైనప్పుడు తమ గొంతుకను వినిపించగలుగుతారు. అదే వాయిస్ ఫర్ గర్ల్స్ సంస్థ ప్రధాన ఉద్దేశం. స్థాపించిన పదకొండేళ్లలో సంస్థ ద్వారా లక్ష మందికిపైగా పిల్లల్ని ప్రభావితం చేయగలిగాం. మరింత మందికి దీన్ని చేరువ చేసే దిశగా పయనిస్తున్నాం’అంటారు సంస్థ ఎగ్జిక్యూటివ్
– డైరెక్టర్ అనూషా భరద్వాజ్.