Millets | నాలుగైదేండ్ల నుంచీ ఆరోగ్యం అంటే చిరుధాన్యాలే అన్నంతగా జనంలో అభిప్రాయం బలపడిపోయింది. మిల్లెట్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఏ ఆరోగ్య సమస్యలకు ఎలాంటి చిరుధాన్యాలు తినాలి?.. తదితర విషయాలు టీవీలు, యూట్యూబ్లలో బాగా ప్రచారం పొందాయి. అయితే వాటిని ఎలా వండాలి? అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది. దానికి సమాధానంగా బెంగళూరుకు చెందిన మమత ఎన్ఎల్ తీసుకువచ్చిందే ‘అర్బన్ మిల్లెట్’ సంస్థ. ఇది ‘రెడీ టు కుక్’ చిరుధాన్యాల అల్పాహారాలను అందిస్తున్నది.
ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అండ్ ఇంజినీరింగ్లో పట్టా పొందిన మమత.. ఆహార పరిశోధన-అభివృద్ధి రంగాల్లో దాదాపు 18 ఏండ్లు పనిచేశారు. ఆ అనుభవం తనకు అర్బన్ మిల్లెట్ సంస్థ స్థాపనకు ఉపయోగపడింది. అచ్చంగా మహిళలే నడుపుతున్న ఈ సంస్థ ట్రూ మిల్లెట్ ( Tru Millet ), ట్రూ మిల్లెట్ ఎక్స్ప్రెస్ బ్రాండ్ల కింద 100 రకాల ఇన్స్టంట్ వంటకాలను అందిస్తున్నది. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రల్లాంటి చిరుధాన్యాలతో పాటు ఓట్స్, క్వినోవా, సోయాలాంటి వాటితో ఇడ్లీ, దోశ, ఉప్మా, పొంగలి, పోహా, బిసిబేళాబాత్ లాంటి వంటకాలను ఇన్స్టంట్గా.. మూడు నుంచి ఎనిమిది నిమిషాల్లోనే తయారు చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇవికాక మిల్లెట్ మురుకులు, చేగోడీలు, నిప్పట్లు, వేయించిన అటుకుల్లాంటి చిరుతిళ్లనూ విక్రయిస్తున్నారు. చిరుధాన్యాల వాడకం మీద అవగాహన కల్పించేందుకు.. బెంగళూరులోని కూడళ్లలో మిల్లెట్ ఎక్స్పీరియెన్స్ ట్రక్ను తిప్పుతున్నారు. ఇందులో మిల్లెట్ వంటకాలను ఉచితంగా రుచి చూడవచ్చు. త్వరలోనే, మరిన్ని ప్రాంతాల్లో ట్రూ మిల్లెట్ కేఫ్లను ఏర్పాటు చేయనున్నట్టు ఈమధ్యే ప్రకటించారు మమత.