‘పోరాడితే పోయేదేమీ లేదు.. అవమానాలు తప్ప’ అంటూ రాజకీయాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవాలని ట్రాన్స్ కమ్యూనిటీకి పిలుపునిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ఓటర్ల ఐకాన్ ఓరుగంటి లైలా. రాజకీయ చైతన్యం దిశగా తొలి అడుగు.. ఓటుహక్కు సాధించుకోవడమే అంటారామె. ఎన్నికల సంఘం సహకారంతో.. ఓటర్ల జాబితాలో పేరు నమోదుకు ట్రాన్స్ జెండర్స్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు లైలా. తెలంగాణలోని అన్ని నియోజక వర్గాల్లోనూ పట్టుబట్టి మరీ థర్డ్ జెండర్ ఓటర్లను నమోదు చేయించిన ఆ ట్రాన్స్ నేతపోరాట ప్రస్థానం..
Transgender Laila | ట్రాన్స్ వ్యక్తుల బతుకంతా సవాళ్లే. ఇంట్లో ఇబ్బందులు. బయట అవమానాలు. అందుకే, అందరికీ దూరంగా వెళ్లిపోయి ఇష్టమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. కట్టుబట్టలతో ఇల్లు వదిలి వచ్చేస్తారు. కానీ చేతిలో డబ్బులుండవు. ఉండటానికి అద్దె ఇల్లు దొరకదు. జీవనోపాధి లభించదు. రైళ్లలో భిక్షాటన చేస్తారు. వ్యభిచారం చేస్తారనే కారణంతో సమాజం చిన్నచూపు చూస్తుంది. అధికారుల్లోనూ అదే అభిప్రాయం. అందుకే, ఓటర్ కార్డు ఇవ్వాలంటూ దరఖాస్తు చేస్తే, అడ్రస్ ప్రూఫ్ కావాలని మెలిక పెడతారు. కట్టుబట్టలతో ఇల్లొదిలి వచ్చిన వారి దగ్గర ఏ డాక్యుమెంట్లు ఉంటాయి? మేం ఓ చోట స్థిరంగా ఉండమనే సాకుతో ఓటరు కార్డు ఇవ్వడానికి నిరాకరిస్తారు. కానీ, ఇదంతా గతం. ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి.
మాది మహబూబాబాద్ జిల్లా తాళ్లపూసపల్లి. చిన్నప్పుడు అక్కడే పెరిగా. నాకు పద్దెనిమిదేండ్లు కూడా నిండకుండానే ఇల్లు వదిలి వచ్చేశాను. బయటి ప్రపంచంలో చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఓటరు కార్డు సైతం రాలేదు. ఆ వివక్ష నాలో పట్టుదల పెంచింది. ట్రాన్స్ జెండర్స్ హక్కుల కోసం ఉద్యమించడానికి సరిపడా మనోధైర్యాన్ని ఇచ్చింది. వరంగల్ కేంద్రంగా మోడ్రన్ అవేర్నెస్ సొసైటీ స్థాపించి.. ట్రాన్స్ జెండర్స్లో సామాజిక, ఆరోగ్య చైతన్యానికి కృషి చేస్తున్నాను. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ, బ్యాంక్ అకౌంట్ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాను. ఇరవై నాలుగేండ్ల వయసులో నాకు ఓటు హక్కు వచ్చింది. అందులో, నా జెండర్ మాత్రం మారలేదు. ‘ఫిమేల్’ అని దరఖాస్తు చేస్తేనే ఓటరు కార్డు వచ్చింది. అప్పట్లో థర్డ్ జెండర్ ఆప్షన్ లేదు. కాబట్టి ట్రాన్స్ జెండర్స్ ‘మగ లేకపోతే ఆడ’ అని రాయించుకునేవాళ్లు. ఓటు వచ్చినా.. ఎన్నికల్లో హక్కును వినియోగించుకోడానికి వెళ్లినప్పుడు ఇంకేవో ఇబ్బందులు. పోలింగ్ బూత్లో మాలాంటి ట్రాన్స్ జెండర్స్ పక్కన నిల్చోడానికి మహిళలు ఇబ్బందిపడేవారు. సుప్రీం కోర్టు తీర్పు తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఎన్నికల సంఘం కూడా ఓటరు జాబితాలో ట్రాన్స్ జెండర్స్ పేరు నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆధార్, రేషన్ కార్డు లేకపోయినా సరే, సెల్ఫ్ డిక్లరేషన్తో దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చింది.
తెలంగాణ శాసన సభ ఎన్నికలకు ముందు.. రాష్ట్ర ఎన్నికల సంఘం మాతో ఓ సమావేశం ఏర్పాటు చేసింది. నేనూ వెళ్లాను. నా వివరాలు అడిగారు. బయోడేటా ఇచ్చాను. పోలీసులు నా గతం గురించి ఆరా తీశారు. మా కమ్యూనిటీ కోసం నేను చేస్తున్న మంచి పనుల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాతే, ఎన్నికల సంఘం నన్ను రాష్ట్ర ఎలక్షన్ ఐకాన్గా ఎంపిక చేసింది. ‘మీ కమ్యూనిటీలో ఎంతమంది పేర్లు నమోదు చేయిస్తే అంత మంచిది’ అని చెప్పారు ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్. ఆ బాధ్యతను విజయవంతంగా నిర్వర్తిస్తున్నాను. అన్ని జిల్లాల్లోనూ ఎన్నికల సంఘం మా కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. మా పట్ల చులకన భావం కొంత తగ్గింది. రాష్ట్రంలో రెండున్నర వేలమంది థర్డ్ జెండర్ ఓటర్లు జాబితాలో ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ మా ప్రాతినిధ్యం ఉంది. ట్రాన్స్ జెండర్స్ ఎక్కువమంది ఉన్నప్పుడు, వారి కోసం ప్రత్యేకమైన క్యూ ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ పోలింగ్ ఆఫీసర్లకు చెబుతున్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన క్రతువు అయిన ఎన్నికల్లో మాకంటూ ప్రాతినిధ్యం ఉండటం సంతోషకరం.
సమాజంలో మాకు సమాన అవకాశాలు లేవు. వాటి కోసం పోరాడాలంటే రాజకీయాల్ని ప్రభావితం చేయగలగాలి. అందుకు ఓటరు నమోదు మంచి మార్గం. ఓటు వల్ల మా సంఖ్యాబలం పెరుగుతుంది. అది ప్రభుత్వాలకు తెలుస్తుంది. సంక్షేమ పథకాలలో మా వాటా మాకు దక్కుతుంది. మాకంటూ ప్రత్యేక పథకాలు వస్తాయి. ప్రతి పార్టీ మా ఓటు బ్యాంకు కోసం ఆరాటపడుతుంది. మాకు ప్రశ్నించే అవకాశం ఉంటుంది. రాజకీయాల్లో గుర్తింపును సాధించడమే ట్రాన్స్ జెండర్స్ సమస్యలకు శాశ్వత పరిష్కారం.
-నాగవర్ధన్ రాయల