నవరాత్రుల్లో నాలుగో రోజున అమ్మవారిని ‘కూష్మాండ’గా భావిస్తూ మహాలక్ష్మి రూపంలో కొలుస్తారు. అష్టభుజిగా వివిధ ఆయుధాలు, జపమాల, కమండలం ధరించి సాధకులకు దర్శనం ఇస్తుంది. ఆయుధాలు దుష్టశిక్షణకు, జపమాల జ్ఞానానికి,కమండలం త్యాగానికి చిహ్నాలుగా భావిస్తారు. ప్రళయం తర్వాత జరిగిన బ్రహ్మాండ సృష్టికి ‘కూష్మాండ’ అధిదేవత అని పురాణాలు చెబుతున్నాయి. తన అమేయమైన తేజస్సుతో సూర్యమండలంలో సూర్యునికి ప్రకాశాన్ని, వెలుగునూ అనుగ్రహిస్తూ అలవోకగా జగత్తునంతా ప్రకాశింపజేసింది. సకల జీవుల అంతర్గతమైన తేజస్సు అమ్మ అంశమే.
కూష్మాండం అంటే.. గుమ్మడిపండు. గుమ్మడి ఆకృతిలో ఉండే ఈ బ్రహ్మాండాన్నంతా ఏ మాత్రం ప్రయాస లేకుండా చిరునవ్వుతో సృజించింది కాబట్టి ఈ తల్లిని కూష్మాండ అంటారు. ఉదయాస్తమయాలలో కనిపించే సూర్యుడి అరుణవర్ణం అమ్మవారికి ఇష్టమైనది. అరుణకాంతితో భాసించే చీరలో ప్రసన్న వదనంతో భక్తాభీష్టప్రదాయనిగా సింహవాహనంపై కొలువుదీరి దర్శనమిస్తుంది.
నైవేద్యం: చిల్లులు లేని మినుప గారెలు, మినుప సున్నుండలు.