భారత్, శ్రీలంక మధ్యన ఉన్న పాక్ జలసంధి వద్ద కోలాహలం. ప్రపంచ రికార్డు ప్రతినిధులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఆ జలసంధిని 13 ఏండ్ల ఆటిజం బాలిక జియారాయ్ చేపపిల్లలా ఈదుతున్నది. 13 గంటల 10 నిమిషాల రికార్డు సమయంలో అలవోకగా జలసంధిని దాటేసింది. కానీ, జియా జీవితంలో మాత్రం అనేక సవాళ్లు. రెండేండ్ల వయసు వచ్చినా.. బిడ్డకు పలుకే బంగారం కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. ఎప్పుడూ పరధ్యానంగా ఉండే ఆ చిన్నారి, నీళ్లను చూస్తే మాత్రం కేరింతలు కొట్టేది. ఆ పరధ్యానానికి కారణం ‘ఆటిజం’ అని ఆ తర్వాత అర్థమైంది. ఆ మానసిక పరిమితి కారణంగా, మిగతా పిల్లల్లా ఏదీ సులభంగా నేర్చుకోలేదు జియా.
తండ్రి మదన్ రాయ్ నావికా దళంలో అధికారి. ఓ రోజు జియాను స్విమ్మింగ్పూల్కు తీసుకెళ్లారు. తను పట్టుబట్టి నీళ్లలో దిగింది. దీంతో తల్లిదండ్రులు కూతురి ఆసక్తిని గమనించి ఈత నేర్పించారు. పోటీలకూ పంపడం ప్రారంభించారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ.. జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించింది జియా. పలు రికార్డులను కొల్లగొట్టింది. ఇప్పటికే 22 బంగారు పతకాలు సాధించింది. జియారాయ్కి ఒలింపిక్స్లో అత్యధిక వ్యక్తిగత బంగారు పతకాల విజేత, అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ఆదర్శం. తనను గురువులా భావిస్తుంది. ఎలాగైనా పారా ఒలింపిక్స్లో భారత్కు పతకం సాధించిపెట్టాలన్న లక్ష్యం నిర్దేశించుకుంది జియా.