శానిటరీ ప్యాడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. రుతుస్రావం గురించి, ఆ సమయంలో పాటించాల్సిన పరిశుభ్రత గురించి జనంలో అవగాహన పెరిగింది. ఇదంతా నగరాల్లోనే. మారుమూల ప్రాంతాల్లో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న మహిళల పరిస్థితి ఏమిటి? ‘ఈ దుస్థితిని మార్చాల్సిందే’ అనుకున్నారు తమిళనాడుకు చెందిన పునీత. తను ఐటీ ఉద్యోగి. స్వచ్ఛంద సేవలో భాగంగా ‘దుల్కల్’ అనే సంస్థ తరఫున తిరువణ్ణామలై జిల్లాలోని జవాదు కొండ ప్రాంతానికి వెళ్లినప్పుడు.. తనకు అనూహ్యమైన దృశ్యాలు కనిపించాయి.
‘ఆ మూడు రోజులూ’ ఆరుబయటే పడుకునే మహిళలు తారసపడ్డారు. వాళ్లంతా ఇంకా పాత వస్ర్తాలనే ప్యాడ్స్లా వాడుతున్నారని అర్థమైంది. ఇక విద్యార్థినుల సంగతి చెప్పనక్కర్లేదు. ప్యాడ్స్ మార్చుకునేందుకు, పాతవాటిని పడేసేందుకు పాఠశాలల్లో ఏ వసతీ లేదు. ఈ పరిస్థితి పట్ల బాలికలకు అవగాహన కలిగిస్తూనే, గిరిజన ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. టాయిలెట్లు, శానిటరీ ప్యాడ్స్ అందుబాటులో ఉంచాలని, నీటి సౌలభ్యం కల్పించి తీరాలని కోరుతున్నారు. ఆ సమస్యల చిట్టాతో ఓ పిటిషన్ తయారు చేసి.. పదివేల సంతకాలు సేకరిస్తున్నారు.