క్యాన్సర్ రోగులు శారీరకంగా ఎంత నరకం అనుభవిస్తారో, మానసికంగానూ అంతే కుంగిపోతారు. శస్త్రచికిత్సల తర్వాత రోగం తగ్గినా వాటి తాలూకు మచ్చలు, గాట్లు జీవితాంతం మనసును బాధిస్తూనే ఉంటాయి. ఆ చీకటి జీవితాల్లో తనదైన శైలిలో సంతోషాన్ని నింపుతున్నారు చెన్నైకి చెందిన మెడికల్ టాటూ ఆర్టిస్ట్ సుజాతా శ్రీహరి. ‘అప్పటి వరకూ సాధారణ టాటూలు వేస్తూ కాలం గడిపేదాన్ని. ఒకరోజు తెలిసిన డాక్టర్ పిలిస్తే వెళ్లాను. క్యాన్సర్ వల్ల ఒక మహిళకు ఇదివరకే ఒక రొమ్ము తీసేశారు. తర్వాత ఆమె ప్లాస్టిక్ సర్జరీకి వెళ్లినా, ఆ ట్రాన్స్ప్లాంటేషన్ విజయవంతం కాలేదు. దాంతో రొమ్ము తీసేసిన ప్రదేశంలో అలాంటిదే ఓ టాటూ వేయమన్నారు. అలా నేను మొదటిసారి క్యాన్సర్ రోగికి టాటూ వేశాను. అప్పటినుంచి ఎంతోమంది రోగులకు గాట్లు, మచ్చలున్న చోట టాటూలు వేస్తున్నాను. వాటిని చూసుకుని వాళ్లు మురిసిపోతుంటే నాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది’ అంటారు సుజాత.