ఇంతకుముందు నగరంలో కాపురం అంటే ఎంత ఇష్టమున్నా మొక్కల పెంపకం గురించి మర్చిపోవల్సిందే అన్నట్టుండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. మిద్దెతోటల పెంపకం నయా ట్రెండయింది. దాన్ని అందిపుచ్చుకుని, మొక్కల్ని ప్రేమించే తన అభిరుచిని నలుగురితో పంచుకుంటూ యూట్యూబ్లో ఫేమస్ అయ్యారు హైదరాబాద్కు చెందిన సాయిలీల.
ఆమె తోటలో రకరకాల పూల మొక్కలు, క్రోటన్లతో పాటు ఎన్నో రకాల పండ్లూ కూరగాయలూ సాగు చేస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తి సొంత ఊరు. పెళ్లయ్యాక హైదరాబాద్ వచ్చారు. నిజానికి తాను చాన్నాళ్ల ముందే మిద్దెతోటల పెంపకం ప్రారంభించినా, తనకు ఏడేండ్లక్రితం థైరాయిడ్ వచ్చాకే ఆరోగ్యకరమైన కూరల సాగు మీద దృష్టి పెట్టానంటారామె. భారత్కు సంబంధించినవే కాదు, అమెరికా, తుర్కియే, ఇటలీ, చైనా, ఇథియోపియా… ఇలా రకరకాల దేశాలకు సంబంధించిన కూరగాయలు, పండ్లను సాగుచేస్తారు. అయితే కొవిడ్ మహమ్మారి కారణంగా సమయం దొరకడం వల్ల పిల్లల ప్రోత్సాహంతో ‘సాయిలీల వ్లాగ్స్’ పేరిట యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. అందులో ఏయే మొక్కల్ని ఎలా పెంచాలి, వాటికి ఎలాంటి రక్షణ అవసరం, ఎక్కువ దిగుబడి రావాలంటే ఏంచేయాలి… ఇలా మొక్కల ప్రేమికులకు ఉపయోగపడే విభిన్న అంశాలను పంచుకుంటారు. అంతేకాదు అక్కడ కాసిన కూరలు, పండ్లను తెంపుతూ బుట్టల్లో ఉంచి వీడియోల్లో చూపిస్తుంటారు. దేశ విదేశాలకు చెందిన యాభై రకాల పండ్లు పండుతాయీ మిద్దెతోటలో. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ తోటను వీక్షకులు ఆసక్తిగా చూడటంలో ఆశ్చర్యమేముంది చెప్పండి?
ఛానెల్ పేరు: సాయిలీల వ్లాగ్స్
ప్రారంభం: 2020
సబ్స్ర్కైబర్ల సంఖ్య : 1.62 లక్షలు
వ్యూస్: సుమారు 2.72 కోట్లు