మధుమేహ రోగులకు నిజంగానే ఇదో శుభవార్త. పంచదారకు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన స్టీవియా ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది ఓ యువతి. ఇన్నాళ్లూ ఏం తినాలన్నా, ఏం తాగాలన్నా లెక్కలు వేసుకొంటున్నవారికి ఎంతోకొంత ఉపశమనం దొరికినట్లే. మనలో చాలామందికి ఔషధ మొక్కల గురించి తెలిసే ఉంటుంది. వాటిలో బాగా వినిపిస్తున్న మొక్క పేరు స్టీవియా. ఇందులో సహజసిద్ధమైన చక్కెర ఉంటుంది. అందుకే, మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇదో సంజీవనిలా కనిపిస్తున్నది. తులసి జాతికి చెందిన ఈ మొక్కను ‘మధుపత్రి’ అని పిలుస్తారు. దీని ఆకుల్లో పంచదార కంటే 30 రెట్లు ఎక్కువ తీపి ఉంటుంది. అంటే ఒక కప్పు పంచదార.. స్టీవియా ఆకులతో తీసిన ఒక చెంచా రసానికి సమానం. దీని వాడకం వల్ల ఎటువంటి అదనపు క్యాలరీలూ శరీరంలోకి చేరవు.
బరువు తగ్గుతారు కూడా. ఈ ఆకులతో మిఠాయిలు, ఇతర ఆహార పదార్థాలు తయారుచేస్తున్నది లక్నోకు చెందిన ‘అర్బోరియల్ బయో ఇన్నోవేషన్స్’ అనే స్టార్టప్. పలు పరిశోధనల తర్వాత ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తమకు అనుమతి ఇచ్చినట్లు ఆ సంస్థ సహ వ్యవస్థాపకురాలు స్వాతి పాండే చెబుతున్నారు. దాదాపు 250 ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో స్టీవియా మొక్కల పెంపకాన్ని చేపట్టారామె. ‘మా బంధుమిత్రుల్లో చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. ఏ శుభకార్యానికి హాజరైనా స్వీట్స్కు దూరంగా ఉంటారు. అలాంటివారికి ఉపశమనం ఇవ్వడానికి నా వంతుగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడే స్టీవియా మొక్కపై నా దృష్టిపడింది’ అంటారు స్వాతి.