రామాయణం.. రాముడి ప్రయాణం, సీతమ్మ జీవన యాత్ర. కాబట్టే వాల్మీకి మహర్షి ‘సీతా చరితం మహత్’ అనే పేరునూ ప్రతిపాదించారు. ఆదికవికి సీతామహాలక్ష్మి అంటే అపారమైనగౌరవం. ఆ తల్లి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ‘నారీణాం ఉత్తమా’,‘అమానుషీ’, ‘అప్రతిమా’ అని కొనియాడారు. దశకంఠుడు సైతం ఆమె గుణగణాల్ని పది నాలుకలతో మెచ్చుకున్నాడు. ‘సర్వాంగ గుణసంపన్న’, ‘సువిగ్రహ’.. అని నిజాయతీగా కీర్తించాడు. ఆదికావ్యంలోని అయోధ్య కాండలో సీత తొలిసారి నోరు విప్పుతుంది. ఆ మాటలు సూదంటురాయిలా పదునైనవి. శ్రీరాముడితో సంభాషిస్తున్నప్పుడైనా, రావణుడిని హెచ్చరిస్తున్నప్పుడైనా.. ఆ గొంతులో అంతే స్థిరత్వం. వనవాస క్లేశాలు, అసురుల వేషాలు ఆమెను కదిలించలేక పోయాయి. ఆ సాధ్వి ఏ దశలోనూ కష్టాలకు తలవంచలేదు. విలువలను వదిలిపెట్టలేదు. జనకుడికి మట్టిలో దొరికి.. జనని భూమాత దరికి చేరేవరకూ.. సీతమ్మ సాగించిన ప్రయాణం రామాయణానికే వన్నెతెచ్చింది. వివిధ సందర్భాలలోఆమె వెల్లడించిన అభిప్రాయాలు రామబాణమంత పదునైనవి. వేదవాక్కులంత విలువైనవి.
శ్రీరామచంద్రుడు అయోధ్యకు ప్రభువైనా,కాకపోయినా ఇంతే గాఢంగా ప్రేమిస్తాను. నా కళ్లకు నార వస్ర్తాలు ధరించినప్పుడు ఎంత అందంగా కనిపిస్తాడో, మణిమాణిక్యాలు అలంకరించుకున్నప్పుడూ అంతే గొప్పగా అనిపిస్తాడు. వివాహ సమయంలో నా తండ్రి జనకుడు నన్ను శ్రీరాముడి చేతిలో పెడుతూ.. ‘రామా! ఈమె నా కూతురు సీత, భూజాత. ఇక నుంచి నిన్ను నీడలా వెన్నంటి ఉంటుంది’ అని చెప్పాడు. జీవితాంతం ఆ మాటకే కట్టుబడి ఉంటాను.
నేను ధర్మాన్ని విడిచిపెట్టను. తీగలు లేని వీణపనికి రాదు. చక్రాలు లేని రథం ముందుకు కదలదు. ఆలూమగల అనుబంధమూ అలాంటిదే. భర్త వీణ అయితే భార్య తీగ. భర్త రథం అయితే భార్య చక్రం. పుట్టింటివారు మహా సంపన్నులైనా, సమర్థులైన బిడ్డలు నూరుగురు ఉన్నా.. ఆ బంధాలేవీ ఆలూమగల అనుబంధానికి సాటిరావు. భర్త సమక్షంలోనే ఆమె సంతోషంగా ఉంటుంది. సూర్యకాంతిని, సూర్యుడిని వేరుచేసి చూడలేం. అలాగే, ఆలూమగలను కూడా.
అర్థంలేని కోరికల కారణంగా వ్యసనాలు మొదలవుతాయి. వ్యసనాల వల్ల శత్రువులు పుట్టుకొస్తారు. అబద్ధాలు, పరస్త్రీ వ్యామోహం, హింసాత్మకమైన ఆలోచనలు.. వ్యసనాల ఉప ఉత్పత్తులు.
జరగాల్సింది జరిగి తీరుతుంది. ఎవరూ ఆపలేరు. విధి బలీయమైంది. మనిషిని అదృష్టలోకానికైనా తీసుకెళ్లగలదు. అధఃపాతాళానికైనా తొక్కేయగలదు. ఆ విధే .. నా మనసును బంగారులేడి వైపు మళ్లించింది. అయినా, జరిగిన దానికి చింతిస్తూ కూర్చుంటే లాభం లేదు. భవిష్యత్తు గురించి ఆలోచించాలి.
ఎవరితోనూ అకారణ శత్రుత్వం పనికిరాదు. అలా చేస్తే విరోధాన్ని కొనితెచ్చుకున్నట్టే. మనశ్శాంతిని పోగొట్టుకున్నట్టే. చెడు ఆలోచన, ఆయుధం.. రెండూ ప్రమాదకరమైనవే. మనల్ని హింసవైపు మళ్లిస్తాయి. రక్తపాతానికి ఉసిగొల్పుతాయి. చంపదగిన వ్యక్తిని అయినా క్షమించి వదిలేయాలి. మనిషికి దయాగుణమే వెలలేని ఆభరణం. ఏదో ఓ అపరాధం చేయనివారు ఎవరుంటారు? ఆ తప్పును మనసారా క్షమించాలి.
ధర్మమే అర్థానికి మూలం. ధర్మం అనే పునాదులు లేని గెలుపు ఓ గెలుపే కాదు. కష్టపడితేనే సుఖం. సుఖమైన మార్గంలోనే సుఖాలను సొంతం చేసుకోవాలనుకోవడం దురాశ. దీనివల్ల పతనం ప్పదు.
పరస్త్రీని కాంక్షించడం అంటే.. సూదితో కళ్లు తుడుచుకోవడమే. కత్తితో నాలుక కడుక్కోవడమే. ఆకలితో ఉన్న సింహం కోరలను లాగడమే. మందర పర్వతాన్ని పెకలించాలని చూడటమే. ఇవన్నీ పెను ప్రమాదానికి హేతువులు.
కష్టాలకు పిరికివాళ్లే భయపడతారు. ధర్మమార్గంలో వెళ్తున్నప్పుడు.. వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. సవాళ్లకు తలవంచి జీవిత భాగస్వామిని నాలుగు గోడలకు పరిమితం చేయాలనుకునే భర్త.. పురుషుడి వేషంలోని స్త్రీలాంటి వాడు. అతని గాంభీర్యం ఓ నటన.
మంచిచెడుల మధ్య తేడా.. సింహానికి, నక్కకూ ఉన్నంత. కాలువకూ సముద్రానికీ ఉన్నంత. బంగారానికీ సీసానికీ ఉన్నంత. నీటికాకికీ నెమలికీ ఉన్నంత. అమృతం తాగినా సరే.. చెడ్డవారికి మరణం తప్పదు.
సావిత్రి తన భర్తను మరణం నుంచి రక్షించుకున్నట్టే.. సవాళ్లు, సంక్షోభాల నుంచి గృహిణి తన భర్తను కాపాడుకోవాలి. స్త్రీ సాక్షాత్తు అగ్ని స్వరూపం. అగ్ని పరీక్షలకు భయపడాల్సిన అవసరం ఆమెకు లేనే లేదు.