నేడు స్కంద పంచమి
ఆషాఢ శుద్ధ పంచమిని స్కంద పంచమిగా చేసుకుంటారు. దీని వెనుక ఆసక్తికరమైన పౌరాణిక కథ ఉంది. పూర్వం సనత్కుమారుడు తపస్సు చేసుకుంటుండగా పార్వతీపరమేశ్వరులు అతణ్ని చూస్తారు. ఆ తపశ్శాలి తమ పుత్రుడైతే బాగుంటుందని ముచ్చటపడతారు. ఆదిదంపతుల మనోగతాన్ని బ్రహ్మదేవుడు తెలుసుకుంటాడు. భవిష్యత్తును దర్శించి శివుడి ఫాలనేత్రాగ్ని నుంచి జారిన దివ్యతేజస్సు ‘స్కంద’ రూపంలో అవతరిస్తుందని గుర్తిస్తాడు. పార్వతీదేవి ప్రోత్సాహంతో పరమేశ్వరుడు సనత్కుమారుణ్ని కలుసుకుంటాడు. శివుడికి పుత్రుడుగా జన్మించడానికి సనత్కుమారుడు అంగీకరిస్తాడు. తర్వాత కొన్నాళ్లకు మార్గశిర మాసంలో స్కందుడు అవతరిస్తాడు. అయితే, పార్వతీపరమేశ్వరులకు సనత్కుమారుణ్ని పుత్రుడిగా పొందాలన్న భావన కలిగింది ఆషాఢ శుద్ధ పంచమి నాడే అని పురాణాలు చెబుతున్నాయి. స్కందమూర్తి అవతరణకు బ్రహ్మదేవుని మనసులో సంకల్పమైనదీ ఈనాడే. అందుకే ఈ పర్వదినం ‘స్కంద పంచమి’గా ప్రసిద్ధి పొందింది.
స్కంద పంచమి సందర్భంగా సుబ్రహ్మణ్యస్వామికి అష్టోత్తర, శత నామావళితో ప్రత్యేక పూజలు
చేస్తారు. పాలు, పానకం, చలిమిడి నివేదన చేస్తారు. కుమార వ్రతం పేరుతో ప్రత్యేక పూజలుచేసే ఆచారమూ ఉంది. రోజంతా ఉపవాసం ఉండి, కుమార వ్రతం ఆచరిస్తారు. మర్నాడు సుబ్రహ్మణ్యస్వామి స్వరూపంగా భావించి బ్రహ్మచారికి భోజనం పెట్టి, నూతన వస్ర్తాలు, దక్షిణ, తాంబూలాలు సమర్పిస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఈ పంచమినాడు నాగదేవతను పూజించే సంప్రదాయమూ కనిపిస్తుంది.
– శ్రీ