కేరళకు చెందిన శ్రేయ ఆనంద్ చెన్నైలోని అమృతా కాలేజిలో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్నది. పంతొమ్మిదేండ్ల శ్రేయ తను ఏడో తరగతిలో ఉన్నప్పుడే చెఫ్గా స్థిరపడాలని నిర్ణయించుకుంది. అయితే వంటలక్కగా మారాలనుకున్న తన నిర్ణయానికి కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి ప్రోత్సాహం కరువైంది. అయినప్పటికీ ఆమె ఆ అవరోధాలను దాటుకుంటూ వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జర్మనీలో జరిగిన ‘కలినరీ ఒలింపిక్స్’లో శ్రేయ రెండు బంగారు, రెండు వెండి పతకాలు సాధించి సత్తా చాటింది.
124 ఏండ్ల ఈ వంటకాల ఒలింపిక్స్ చరిత్రలో పతకాలు సాధించిన తొలివ్యక్తిగా మనదేశానికి పేరు తెచ్చిపెట్టింది. అలా తన నిర్ణయం సరైనదేనని నిరూపించింది. “ఈ పోటీల్లో నా ప్రదర్శన గురించి కొంత భయం ఉండేది. కానీ అక్కడ నేనెంతో నేర్చుకున్నాను. నిజానికి ఒక గొప్పకల నెరవేరింది’ అని గర్వంగా చెబుతుంది శ్రేయ. ఈ పోటీలకు సంబంధించి వివిధ విభాగాల్లో ప్రదర్శన కోసం ఆమె రెండేండ్లుగా తన ప్రతిభకు మెరుగులు పెట్టుకుంటూ ఉన్నది. ఇప్పుడు తన దృష్టంతా 2026లో లగ్జెంబర్గ్లో జరగబోయే ‘వంటల వరల్డ్ కప్’ మీదే. పాకశాస్త్రం ప్రావీణ్యంలో శ్రేయ తన సృజనాత్మకతను మరింత గొప్పగా ప్రదర్శిస్తుందని ఆశిద్దాం.