ఒక సేవా సంస్థవారు వేసవి సెలవుల్లో ఒక మంచి ఆధ్యాత్మిక కార్యక్రమం చేయదలిచారు. సంస్థ సభ్యులందరూ సమావేశమయ్యారు. పిల్లలకు భగవద్గీత పట్ల అవగాహన కల్పిస్తే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నారు. ఆరు గ్రామాలను ఎంపిక చేసి పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఆరుగురు గురువులను ఎంపిక చేశారు. ఆ గురువులు గ్రామాల్లోనే ఉంటూ అయిదు రోజులపాటు పిల్లలకు భగవద్గీత పట్ల అవగాహన కల్పించాలనేది వారి ఆశయం. పిల్లల్ని ఎలా రాబట్టుకోవాలి, ఎలా కూర్చోబెట్టాలి, ఎలాంటి విషయాలు చెప్పాలి అనే వాటి మీద గురువులకు శిక్షణ ఇచ్చారు. తమకిచ్చిన పుస్తకాలను తీసుకుని గురువులు ఆయా పల్లెలకు వెళ్లారు.
రెండు రోజుల తర్వాత ఈ క్రతువు నిర్వాహకుడు కార్యక్రమం ఎలా జరుగుతున్నదో చూద్దామని బయలుదేరాడు. అయిదు పల్లెల్లో తామనుకున్నట్లు కార్యక్రమం సాగుతున్నది. పిల్లలు చక్కగా భగవద్గీత చదవడం, దాని భావం తెలుసుకోవడం చేస్తున్నారు. తాము అనుకున్నది విజయవంతంగా జరగడం అతనికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. చివరి గ్రామానికి వెళ్లాడు. అది కొండను ఆనుకుని ఉంది. అక్కడ పిల్లలు గురువు చెప్పే మాటలు సరిగ్గా పట్టించుకోవడం లేదు. వారికి ఇష్టమైన పనులు వారు చేసుకుంటున్నారు. ఎందుకిలా చేస్తున్నారని గురువును ప్రశ్నించాడు. ‘వారు నేను చెప్పిన మాట వినడం లేదు’ అని బాధగా చెప్పాడు ఆ గురువు. ‘కొంచెం గట్టిగా మాట్లాడి, గదమాయించి వారిని అధీనంలోకి తీసుకోవచ్చుకదా, సామ దాన భేద దండోపాయాల గురించి మీరు వినలేదా?’ అని ప్రశ్నించాడు నిర్వాహకుడు.
‘అయ్యో… పిల్లల్ని అలా గట్టిగా అరిస్తే బాగుండదు కదా’ అని సమాధానమిచ్చాడు గురువు.‘మనం పిల్లల మంచి కోసం చేస్తున్నాం. కాబట్టి వారిని గట్టిగా నియంత్రించి మన దారిలోకి తెచ్చుకోవడం తప్పుకాదు. స్వభావంలో అప్పుడప్పుడూ కొంచెం కటువుగా కూడా ఉండాలి. ఉప్పుగా లేకపోతే సముద్రాన్ని అయినా ఖాళీ చేసేస్తారు’ అని వివరించాడు నిర్వాహకుడు. ప్రేమ ఒక్కటే సరిపోదు, పిల్లలకు క్రమశిక్షణ కూడా అవసరమని గుర్తించాడు గురువు. మిగిలిన రోజుల్లో పిల్లలను బాగా నియంత్రించి భగవద్గీత నేర్పించాడు. చివరి రోజున ఆరు గ్రామాల పిల్లలకూ భగవద్గీతలో పోటీలు పెట్టారు. అందులో కొండను ఆనుకుని ఉన్న గ్రామానికి చెందిన పిల్లలు మూడు బహుమతులు గెలుచుకున్నారు.
-ఆర్సీ కృష్ణస్వామి రాజు ,93936 62821