సినీతారలు కాదు, అంతగా పాపులరూ కాలేదు! అయితేనేం, బ్రాండ్ బేబీలుగా, బాబులుగా లక్షలు ఆర్జిస్తున్నారు సెలెబ్రిటీల వారసులు. సినీతారలు, క్రికెటర్ల పిల్లలు సామాజిక మాధ్యమాల్లో బ్రాండ్ అంబాసిడర్ల అవతారమెత్తి సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు శనాయా తెరంగేట్రానికి ఇంకా సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, అంతలోనే ఓ జువెలరీ కంపెనీ, ఓ సౌందర్య సాధనాల సంస్థ ప్రకటనల్లో ఆమె నటించింది.
శనాయా బాటలోనే క్రికెట్ దిగ్గజం సచిన్ గారాలపట్టి సారా కూడా ప్రకటనల్లో నటిస్తున్నది. సామాజిక మాధ్యమాల్లో వీళ్ల ఫాలోవర్ల సంఖ్యను బట్టి పారితోషికం ఇస్తున్నాయి సంస్థలు. సోషల్ మీడియాలో శనాయాకు 15 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, సారాకు 23 లక్షల మంది ఉన్నారు. స్టార్కిడ్స్ కావడంతోనే వాళ్లకు అంత పాపులారిటీ. దానిని ఉపయోగించుకొని తమ బ్రాండ్ విలువ పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి పలు సంస్థలు. ఈ యంగ్స్టర్స్ కూడా ప్రకటనల్లో నటించడానికి పచ్చజెండా ఊపేస్తున్నారు. మరోవైపు షాహిద్ కపూర్ భార్య మీరా రాజ్పుత్ నాలుగైదు సంస్థలకు చెందిన ప్రకటనల్లో నటించి మెప్పించింది. సినిమాలు, రాజకీయాల్లో ఇప్పటికే వారసులున్నారు. ఇప్పుడు యాడ్ వరల్డ్ వంతు.