ప్రేమ కథా చిత్రం సాదాసీదాగా సాగితే ఏం మజా ఉంటుంది? చేజింగ్లు, ఫైటింగ్లు, కిడ్నాపింగ్లు ఇలా ఊహించని మలుపులు ఉంటేనే లవ్స్టోరీ సూపర్ హిట్గా నిలుస్తుంది. ఇలాంటి కథలో విదేశీ అమ్మాయి, స్వదేశీ అబ్బాయి ప్రేమికులు అయితే, ఇంకో లెవల్లో ఉంటుంది. రష్యాకు చెందిన రిమ్మా గ్రిన్యుక్దీ ఇదే తరహా ప్రేమ కథ. ఎల్లలు చెరిపేసిన ప్రేమ కథ ఆమెది. యుద్ధాన్ని గెలిచిన ఇష్క్ ఆమెది. పెద్దలను ఎదిరించిన కాదల్ ఆమెది. ఆ కథేంటో చదివేయండి..
చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్. చుట్టూ మహిళా కానిస్టేబుళ్లు. ఉబికి వస్తున్న కన్నీళ్లను పంటి బిగువున అదిమిపట్టి ఎఫ్ఐఆర్ కాపీపై సంతకం పెట్టింది రష్యాకు చెందిన రిమ్మా గ్రిన్యుక్. ఒకవైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం. అక్కడ రష్యాలో తన అమ్మమ్మ కుటుంబం.. ఉక్రెయిన్లో తల్లి కుటుంబం ఎలా ఉందో తెలియని దుస్థితి. మరోవైపు పెండ్లి చేసుకుందామని ఎన్నో ఊసులాడిన ప్రేమికుడు కనిపించకుండా పోయాడు. అసలేం జరిగిందంటే..
భారతదేశ సంస్కృతి, ఆచారాలపై చిన్ననాటి నుంచే మనసు పారేసుకున్నది రిమ్మా గ్రిన్యుక్. న్యాయశాస్త్రంలో పట్టా అందుకొని, భారతీయ సంస్కృతిని తెలుసుకునే ప్రయత్నం చేసింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో యోగా, శాస్త్రీయ నృత్యాలు నేర్చుకుంది. వాటిపై మరింత పట్టు సాధించే లక్ష్యంతో భారతదేశానికి ప్రయాణమైంది. చెన్నై చేరుకుంది.
అక్కడ కూచిపూడి, భరతనాట్యం, కథక్, యోగా నేర్చుకుని, సొంతంగా తానే నేర్పించే స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలోనే చెన్నైకి చెందిన సినిమా నిర్దేశకుడు, కళా దర్శకుడు ఎస్ఎస్ దళపతితో పరిచయం అయింది. అది కాస్తా ప్రేమగా మారింది. పరిణయం తర్వాత జీవనం గురించి ఎన్నో విషయాలు చర్చించుకున్నారు ఇద్దరు. ఇంతలో కరోనా కల్లోలం మొదలైంది. రిమ్మా ఉక్రెయిన్ వెళ్లాల్సి వచ్చింది. దాదాపు రెండేండ్లు ఫోన్లోనే సాగింది వీరి ప్రేమాయణం. కరోనా తగ్గాక 2022 జనవరిలో ఆశల పల్లకిలో చెన్నై చేరుకుంది రిమ్మా. దళపతిని కలుసుకోవడంతో విరహ బాధంతా ఎగిరిపోయింది.
నెల రోజులు ఇద్దరూ హాయిగా ఊసులాడుకున్నారు. ఇంతలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. దేశాల సరిహద్దులు మూసుకుపోయాయి. ఏ వార్త చదివినా యుద్ధమే! ఏ దృశ్యం చూసినా నెత్తుటి గాయాలే!! జర్నలిస్ట్గా పనిచేస్తున్న తమ్ముడికి ఫోన్ చేసేది. అక్కడి భీతావహ దృశ్యాలు చూసి తల్లడిల్లిపోయేది.
మరోవైపు రిమ్మా, దళపతి ప్రేమకథలో విలన్లు ఎంటరయ్యారు. అబ్బాయి తల్లిదండ్రులు ఈ ప్రేమను ఒప్పుకోలేదు. విదేశీయురాలు తమ ఇంట్లో అడుగుపెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రేమను గెలవాలని దళపతి అయినవారితో తలపడ్డాడు.
చివరికి అబ్బాయిని కిడ్నాప్ చేయించారు తల్లిదండ్రులు. అతని ఆచూకీ తెలుసుకోలేక విలవిల్లాడిపోయింది రిమ్మా. ఒకవైపు వీసా గడువు ముగిసిపోతున్నది. మరోవైపు చేతిలో డబ్బు నిండుకుంది. యుద్ధవార్తలు కంటి మీద కునుకు లేకుండా చేయసాగాయి. దళపతితోనే తన జీవితం అనుకున్న రిమ్మా.. పోలీసులను ఆశ్రయించింది. ఆమె కథ విన్న పోలీసులు కేసును సీరియస్గా తీసుకున్నారు.
రోజుల వ్యవధిలో అతని ఆచూకీ కనుగొన్నారు. దళపతి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి.. పెండ్లికి ముహూర్తం పెట్టించారు. రిమ్మా కోరుకున్నట్లే వారి పెండ్లి భారతీయ సంప్రదాయ పద్ధతిలో జరిగింది. వేదమంత్రాల నడుమ దళపతితో ఏడడుగులు వేసి నూరేండ్ల ప్రయాణం మొదలుపెట్టింది. దేశాల సరిహద్దులను చెరిపేసిన రిమ్మా-దళపతి ప్రేమకథ చివరికి సుఖాంతం అయింది.