ఆకలితో ఉన్నవారికి నెలరోజులకు సరిపడా నిత్యావసరాలు అందిస్తే.. తక్షణమే ఆకలి తీరుతుంది. కానీ, సరుకులు నిండుకున్న తర్వాత.. సమస్య మళ్లీ మొదటికొస్తుంది. దాతృత్వం.. ఓ దీర్ఘకాలిక సమస్యకు తాత్కాలిక పరిష్కారం మాత్రమే! అదే, ఉపాధి మార్గం చూపగలిగితే.. ఓ కుటుంబం నిలబడుతుంది. ఇటీవలే, ఐదొందల రోజుల సేవా ప్రస్థానాన్ని పూర్తి చేసుకొన్న ‘రైస్ ఏటీఎం’ చేపట్టిన ‘ప్రాజెక్ట్ ప్రిష’ లక్ష్యమూ ఇదే.
రైస్ ఏటీఎం.. అక్షయ పాత్రలా ఐదొందల రోజుల నుంచీ పేదల కడుపు నింపుతున్నది. ఆకలితో ఎవరొచ్చినా.. నెల రోజులకు సరిపడా బియ్యం, నిత్యావసర వస్తువులు అందిస్తున్నది. సమస్య బహురూపి. ఒక్కో సమయంలో ఒక్కో రూపం ధరిస్తుంది. కొవిడ్తో కుదేలైన జీవితాలకు, ఇప్పుడు ఉపాధి ఓ తీవ్ర సమస్యగా మారింది. దీంతో, ఆకలి తీర్చడంతో పాటు ఆర్జనమార్గం చూపించడం మీదా దృష్టిపెట్టారు హైదరాబాద్లోని రైస్ ఏటీఎం వ్యవస్థాపకులు దోసపాటి రాము. ఈ లక్ష్యం కోసం ప్రారంభించిందే ‘ప్రాజెక్ట్ ప్రిష’. దీని నిర్వహణ బాధ్యతను ఓ సాఫ్ట్వేర్ కంపెనీ వ్యవస్థాపకురాలైన యశస్విని జొన్నలగడ్డకు అప్పగించారు. యశస్విని చిన్న కూతురి పేరు కూడా ప్రిష. ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒంటరి మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేందుకు అవసరమైన ధైర్యం అందిస్తారు. పిండి గిర్నీ, ఇస్త్రీ షాపులు, తోపుడు బండ్లు, కిరాణా షాపులు, బట్టల దుకాణాలు.. ఇలా, తమకు ఎంతోకొంత అనుభవం ఉన్న వ్యాపారాలు పెట్టుకొనేవారికి సామగ్రిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తారు. వ్యాపారం ఎలా నడుస్తున్నది, మరింత మెరుగుపరచడానికి ఏం చేయాలి? అన్న కోణంలో నెలనెలా సమీక్షిస్తారు. నిపుణుల సలహాలూ, సూచనలూ అందిస్తారు. అవసరమైతే, ఆర్డర్లను కూడా ప్రాజెక్ట్ ప్రిష బృందం సమకూరుస్తుంది. ప్రాజెక్ట్ ప్రిష సేవల గురించి సోషల్ మీడియా, ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకున్న చాలామంది మేమున్నామంటూ ముందుకు వస్తున్నారు. పిల్లల పుట్టినరోజు, పెండ్లి రోజు తదితర ప్రత్యేక సందర్భాల్లో ఒకరు కుట్టుమిషన్ ఇప్పిస్తే, మరొకరు టిఫిన్ సెంటర్కు సంబంధించిన పరికరాలు ఇస్తున్నారు. మూడో తరగతి చదువుతున్న ఓ చిన్నారి అయితే, తన పాకెట్ మనీని విరాళంగా పంపింది. ఇలా ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు.
మారిన జీవితాలు
మొదటి వేవ్లో ఉద్యోగం కోల్పోయి, నిండు గర్భవతిగా ఉన్న భార్యకు భోజనం పెట్టడానికి కూడా ఇబ్బందిపడ్డాడు సికింద్రాబాద్కు చెందిన రామకృష్ణ. ఆ దంపతులతో ప్రాజెక్ట్ ప్రిషలో భాగంగా ‘అమ్మ చేతి వంట’ పేరుతో హోటల్ పెట్టించారు. ఉప్పల్ పీర్జాదిగూడలోని ఒక మహిళ పిండిగిర్ని ఏర్పాటు చేసుకోవడానికి సాయం అందించారు. భర్త కరోనాతో చనిపోవడంతో, ముగ్గురు బిడ్డలతో వీధిపాలైన ఓ తల్లికి కుట్టుమిషన్ అందించారు. ఇలా, 700 కుటుంబాలు తమ కాళ్లపై తాము నిలబడ్డాయి. ‘ఈ ప్రయాణం ఐదు వందల రోజులతో ఆగిపోదు. వెయ్యి రోజులకూ ముగిసిపోదు. మానవత్వం ఉన్నంతకాలం నడుస్తూనే ఉంటుంది’ అంటారు దోసపాటి రాము.
‘దోసపాటి రాము రైస్ ఏటీఎం ద్వారా పేదలకు సాయం చేస్తున్నారని పత్రికలు, సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నాను. నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం గుర్తించాను. నేను కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పాను. ఆయన సంతోషంగా అంగీకరించారు. నా కూతురు ప్రిష పుట్టిన రోజునాడే, ఈ ఏడాది జనవరిలో ‘ప్రాజెక్ట్ ప్రిష’ మొదలుపెట్టాం. రైస్ ఏటీఎంకు అనుబంధంగా ప్రాజెక్ట్ ప్రిష పనిచేస్తున్నది. సాయంకోసం రైస్ ఏటీఎంకు వచ్చిన వారి నేపథ్యాలను, నైపుణ్యాలను బట్టి ఉపాధి మార్గాన్ని చూపిస్తాం’ అంటూ ప్రాజెక్ట్ లక్ష్యాలను వివరించారు యశస్విని.
… గోవిందు రవికుమార్