కరోనా కారణంగా అందరూ పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇంటి భోజనానికే మొగ్గు చూపుతున్నారు. ఇది మంచి పరిణామమే అయినా, ఆ పని భారమంతా మహిళ మీదే పడుతున్నది. ఓ నలుగురికి వంట చేయడం ఒక ఎత్తయితే, అందుకోసం కూరగాయలు తరుగుకోవడం మరో ఎత్తు! సమయాన్ని మింగేసే వ్యవహారం. సైనిక్పురికి చెందిన బెంగాలీ మహిళ పారమితా సేన్ ఈ సమస్యకు ఓ పరిష్కారం కనిపెట్టింది.
పారమిత భర్త మృణాల్ సేన్గుప్తా సాఫ్ట్వేర్ ఉద్యోగి. నాలుగేండ్ల క్రితం ఈ దంపతులు కోల్కతా నుంచి హైదరాబాద్కు వచ్చారు. సైనిక్పురిలో స్థిరపడ్డారు. 2019లో భర్త సహకారంతో ఇంట్లోనే ఆర్డర్లపై భోజనాలు వండి, డోర్ డెలివరీ చేసేది పారమిత. అంతలోనే కరోనా దాడి చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ మొదలైంది. ఆ సమయంలో ఉద్యోగాలు చేసే గృహిణుల ఇబ్బందులను దగ్గరినుంచి చూసిందామె. ముఖ్యంగా, కూరగాయల కష్టాలకు తనవంతు పరిష్కారం అందించాలని అనుకుంది. కోరినవారికంతా శుభ్రంగా తరిగి పంపితే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన వచ్చిందామెకు.
నాణ్యమైన కూరగాయలు
పారమిత మొబైల్ ద్వారా ఆర్డర్లు తీసుకుంటుంది. ఒకరోజు ముందు.. అంటే, రేపు మనం ఏం వండాలో ఆలోచించుకుని, అందుకు సంబంధించిన కూరగాయల జాబితా, పరిమాణం పంపితే చాలు. పారమిత నేరుగా మార్కెట్కు వెళ్లి నాణ్యమైన కూరగాయలను కొని తెస్తుంది. వాటిని శుభ్రంగా కడిగి ఆరబెడుతుంది. తర్వాత వాటిని వంటకు అనువుగా ముక్కలుగా చేస్తుంది. కూర కోసమా, సాంబారు కోసమా, లేదంటే వేపుడు కోసమా అన్నది ఆమెకు స్పష్టం చేయాలి. వంటను బట్టి ముక్క సైజు మారిపోతుంది. కోరితే, పచ్చి కొబ్బరి కూడా తురిమి పంపుతారు. పళ్లరసాలు కూడా అందుబాటులో ఉంటాయి. కస్టమర్ల లొకేషన్ ఆధారంగా ఆమె భర్త మృణాల్ సేన్ గుప్తా డెలివరీ చేస్తారు. కిలో నుంచి మూడు కిలోల కూరగాయలకు డెలివరీ చార్జీగా రూ.50 తీసుకుంటారు. తరిగినందుకు మూడు నుంచి ఐదు కేజీలకు రూ. 30 చార్జ్ చేస్తారు. మూడు కిలోమీటర్ల లోపు అయితే డెలివరీ ఉచితం. ఈ ఫుడ్ ఆంత్రప్రెన్యూర్ మధుమేహ రోగుల కోసం ‘సాత్విక్ ఫుడ్’ తయారు చేస్తున్నది. బ్రహ్మచారులకు క్యారేజీ సౌకర్యం ఉంది. ‘బెంగాలీ వంటకాలు మా ప్రత్యేకత’ అని సగర్వంగా ప్రకటిస్తున్నది పారమిత. తనను 7337218844 నంబరులో సంప్రదించవచ్చు.