చిన్న కౌపీనాన్ని సంరక్షించుకుందామన్న తపన ఏకంగా ఓ సన్యాసిని సంసారిని చేసింది. ఓ చిన్న కోరిక మనిషిని ఎలా సమస్యల్లో పడేస్తుందో తెలిపే చక్కని కథ.. రామకృష్ణ పరమహంస ’కథామృతం’లో కనిపించే గాథ.
ఒక సన్యాసి అడవిలో ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. రెండు గోచీలు తప్ప తనకంటూ చెప్పుకోవటానికి అతనికి మరే వస్తువూ లేదు. ఓ రోజు ఆ రెండు గోచీల్లో ఒకదాన్ని ఓ ఎలుక కొంచెం కొరికింది. ఇక రెండోదాన్ని కూడా కొరికితే ఇబ్బంది అని ఆలోచించి, ఎలుకను కట్టడి చేసేందుకు ఆ సన్యాసి ఓ పిల్లిని పెంచుకున్నాడు. పిల్లికి పాలు కావాలి కాబట్టి, కొన్నాళ్లకు ఓ ఆవును తెచ్చి, కుటీరం బయట కట్టేసుకున్నాడు. పాడి ఆవును మేపటానికి, పాలు పితకటానికి ఓ జీతగాడిని సమకూర్చుకున్నాడు. కొన్నేళ్లకు ఆవు కాస్తా, ఆవుల మంద అయింది. ఆ మందను మేపటానికి పచ్చిక బయళ్లు, పొలాలు కొనుగోలు చేశాడు. అలా తపస్వి భూస్వామిగా మారిపోయాడు. సంపదను చూసుకోవటానికి ఓ వ్యక్తి కావలసి వచ్చింది. ఇంతలో దూరగ్రామం నుంచి ఓ భూస్వామి వచ్చి తన కుమార్తెను ఆయనకు చూపించాడు. వివాహం చేసుకుంటే, అన్నీ తానే చూసుకుంటుందని ఒప్పించాడు. అలా సాధువు సంసారి అయ్యాడు. కాలచక్రం తిరిగిపోతున్నది. ఆ సంసారమూ పెరిగిపోయింది.
పూర్వాశ్రమంలో ఇతనితో పాటు సన్యాసం స్వీకరించి, దూరాన అరణ్యంలో తపస్సు చేసుకుంటున్న ఓ సోదర సన్యాసి ఇతని దగ్గరికి వచ్చాడు. గతంలో ఇక్కడినుంచి వెళ్లేటప్పుడు ఒక్కడే ఏకాంతంగా తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు చూస్తే ఇక్కడ ఓ సంసార సంగ్రామమే జరుగుతున్నది ఏంటా? అని ఆశ్చర్యపోయాడు. తన మిత్రుడు ఇక్కడినుంచి వెళ్లిపోయాడేమోనని అనుమానపడ్డాడు. అదే అనుమానం, ఆశ్చర్యంతో ఆ ఇంటి ముందు నిలబడ్డాడు. ఇంతలో సన్యాసి నుంచి సంసారిగా మారిన మిత్రుడు బయటికి వచ్చాడు. చూడగానే స్నేహితుడిని గుర్తించి, పలకరించాడు. అప్పుడు అతిథిగా వచ్చిన సాధువు ‘ఏంటి మిత్రమా! ఇదంతా?’ అన్నాడు. దానికి ఆయన ‘కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః’- గోచిని కాపాడుకునే ప్రయత్నంలో ఈ పటాటోపమంతా వచ్చి పడింది అంటాడు.
ప్రాపంచికతలో ఓ చిన్న కోరిక మనిషిని ఎలా సంసార ఊబిలో పడేస్తుందో తెలియజేయటానికి సరదాగా తమ గృహస్థ భక్తులైన మహేంద్రనాథ్ గుప్తా, నరేంద్రబెనర్జీ తదితరులకు ఈ కథను చెప్పారు రామకృష్ణ పరమహంస.
– మనోజ్ఞ