రక్షాబంధన్.. మనల్ని రక్షించే బలమైన బంధానికి సూచిక. జీవితంలో అనుబంధాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. కానీ మనం ఎవరికి బంధనం అవుతున్నాం? అనేదే అసలైన ప్రశ్న. ఆత్మజ్ఞానంతో, సత్యంతో, గురువుతో, మనలోని మనతో మనకున్న అనుబంధం మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది. పైపైకి వెళ్లడానికి ఓ సాధనంగా ఉపయోగపడే తాడు, కొన్నిసార్లు ఉచ్చు లానూ మారిపోవచ్చు. అలాగే, అల్పమైన విషయాల మీద మనసు పెడితే పరిమితమైన ఫలితమే లభిస్తుంది. అదే విశాల దృక్పథంతో.. ఆత్మజ్ఞానానికి కృషిచేస్తే భవ సాగరం నుంచి ముక్తి దొరుకుతుంది.
సాత్విక, రాజసిక, తామసిక.. మొత్తం మూడు రకాల బంధాలు ఉన్నాయి. సాత్విక బంధాలు మనల్ని ఆత్మజ్ఞానానికి దగ్గర చేస్తాయి. రాజసిక బంధాలు విపరీతమైన వాంఛలతో కూడుకున్నవి. తామసిక బంధాలు ఎలాంటి అనుభూతితో ముడిపడకున్నా బలమైన బంధాలుగానే ఉంటాయి. పొగ తాగేవారికి దానివల్ల కలిగే అనుభూతి క్రమంగా తగ్గుతుంది. అయినా, ఆ అలవాటును మాత్రం మానలేరు. ఇదీ అంతే. మూడింటిలో.. రక్షాబంధన్ సాత్విక బంధానికి ప్రతీక.
రక్షాబంధన్కు సంబంధించి ఎన్నో కథలు ఉన్నాయి. రాక్షసరాజు బలి చక్రవర్తి ఉదంతం వాటిలో ప్రధానమైంది. బలి చక్రవర్తి నగరాన్ని కాపాడతానని ప్రతినబూని ఆ నగర రక్షకుడిగా మారిపోతాడు శ్రీమహావిష్ణువు . దీంతో లక్ష్మీదేవి తన పెనిమిటిని వెతుక్కుంటూ.. సాధారణ మహిళ రూపంలో బలి చక్రవర్తి నగరానికి చేరుతుంది. బలి ఆమెను తన సోదరిలా ఆదరిస్తాడు. శ్రావణ పూర్ణిమ రోజు లక్ష్మీదేవి కట్టిన రాఖీని చూసుకుని పొంగిపోతాడు. ‘నీకేం కావాలి సోదరీ? ఏదైనా వరం అడుగు. తప్పక నెరవేరుస్తాను’ అని మాటిస్తాడు. లక్ష్మీదేవి నిజరూపంలో దర్శనమిచ్చి.. తాను విష్ణువు కోసం వచ్చానని చెబుతుంది. ఆమె పతిభక్తికి చలించిపోయి.. మహావిష్ణువును సాదరంగా వైకుంఠానికి పంపుతాడు బలి. ఈ సందర్భాన్ని దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ‘బలెవా’ పేరు మీద సంబురంగా జరుపుకొంటారు. ఈ పద్ధతే క్రమంగా అక్కాచెల్లెళ్లను శ్రావణ పూర్ణిమ రోజు ఇంటికి పిలిచే వేడుకగా స్థిరపడింది. ఆధునిక కాలంలో రాఖీని తోబుట్టువుల బంధానికి ప్రతీకగా భావిస్తున్నా.. చారిత్రకంగా రాఖీకి ప్రత్యేక స్థానం ఉంది. భార్య, సోదరి, తల్లి.. ఇలా ఎవరైనా కట్టే ఆచారంగా కనిపిస్తుంది. రుషులు తమ శిష్యులకు కట్టిన ఉదంతాలున్నాయి. మహర్షులు రాక్షసుల నుంచి రక్షణగా రాఖీ కట్టుకున్నారు. సర్వకాల సర్వావస్థల్లోనూ నీకు నేనున్నాను.. అనే అభయమే రక్షాబంధన్!
-శ్రీశ్రీ రవిశంకర్
ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్