వేసవిలో నమోదయ్యే అధిక ఉష్ణోగ్రతలు.. జీర్ణాశయాన్ని ఇబ్బంది పెడతాయి. ఎసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి సమస్యలు దాడిచేస్తాయి. ఉష్ణోగ్రతలతోపాటు అధిక చెమట వంటి అనేక కారకాలు.. ఈ సమస్యలకు కారణం అవుతాయి. అయితే, వీటినుంచి బయట పడాలంటే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవిలో తగినంత నీళ్లు తీసుకోవడం అనేది.. అత్యంత ప్రజాదరణ పొందిన ఆరోగ్య సలహా. కానీ, ఎప్పుడు పడితే అప్పుడు కడుపు నిండుగా తాగడం కూడా మంచిదికాదు. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీళ్లు తీసుకోవద్దు. ఒకేసారి గటగటా నీళ్లు తాగే బదులు.. తరచుగా చిన్నచిన్న గుటకలు వేస్తూ, రోజంతా తాగుతూ ఉండటం మంచిది.
రోజువారీ ఆహారాన్ని కడుపు నిండుగా కాకుండా.. కాస్త తక్కువగా తీసుకోవాలి. ఒకేసారి కడుపు నిండుగా కాకుండా.. తక్కువ మోతాదులో ఎక్కువసార్లు భోజనం చేయడం మంచి అలవాటు. దీనివల్ల ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. ఇక గంటల తరబడి కడుపును ఖాళీగా ఉంచొద్దు.
ఆహారంలో ఎక్కువ మసాలాలు, నూనెలో వేయించడాలు తగ్గించాలి. స్ట్రీట్ఫుడ్ను పూర్తిగా పక్కన పెట్టేయాలి.
వేసవిలో ఆహారం త్వరగా పాడవుతుంది. కాబట్టి, నిల్వ చేసిన ఆహారం తినేముందు ఒకటికిరెండు సార్లు పరీక్షించాలి. ముందురోజు మిగిలిన ఆహారాన్ని తినకపోవడమే మంచిది. ఒకవేళ ఆహారం మిగిలిపోతే.. వెంటనే ఫ్రిజ్లో పెట్టి, తినేముందు సరిగ్గా వేడి చేసుకోవాలి.
కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీలను తక్కువగా తీసుకోవాలి. అదేవిధంగా, చక్కెరలతో నిండిపోయే శీతల పానీయాల వినియోగాన్నీ పరిమితం చేయాలి.