Panchangam 2022 | కలి గతాబ్ది- 5123, క్రీస్తుశకం – 2022-23, శాలివాహన శకం-1944, భారత స్వాతంత్య్ర శకం – 75-76
ఈ సంవత్సరానికి రాజు-శని, మంత్రి-గురువు, సేనాధిపతి- బుధుడు, సస్యాధిపతి-శని, ధాన్యాధిపతి- శుక్రుడు, అర్ఘ్యాధిపతి- బుధుడు, మేఘాధిపతి- బుధుడు, రసాధిపతి- చంద్రుడు, నీరసాధిపతి- శని, రాజవాహనం- అశ్వం, పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు (స్థాన సంరక్షకుడు), గోష్ఠాద్బహిష్కర్త- బలరాముడు
నవనాయక వర్గంలో శుభాధిక్యం, ఉపనాయక వర్గంలో శుభాధిక్యం ఉండటం వల్ల దేశంలో అన్ని ప్రాంతాల్లో అనుకూల వర్షాలు ఉంటాయి. ప్రజల్లో చోర, ఈతి బాధలు ప్రబలుతాయి. సుస్థిర ప్రభుత్వం వల్ల సుభిక్షం, క్షేమ, ఆరోగ్యాలు ఉంటాయి. మధ్యమ వృష్టి ఉండటంతో పంటలు సామాన్యంగా పండుతాయి.
రాజు-శని: శని రాజు కావడం వల్ల సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. రోగ భయం, దొంగల భయం, ఆకలి బాధలతో ప్రజలు ఇబ్బంది పడతారు. కొన్ని ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు తలెత్తుతాయి. కారపు దినుసులు, మసాలా వస్తువులు, రసాయన పదార్థాలు, బొగ్గు, తారు, నువ్వుల నూనె, నల్లని ధాన్యాలు, మినుములు, అవిసెలు, చెప్పులు, వగరు వస్తువులు, కంబళ్లు, ఇనుము, సీసం, కట్టెలు, సారాయి, నల్లమందు, పశువులు, గేదెలు, వేరుశనగ, పసుపు ధరలు పెరుగుతాయి. ఆహారధాన్యాలకు కొరత ఏర్పడుతుంది. రాజకీయంగా కొన్ని ప్రాంతాల్లో అస్థిరత నెలకొంటుంది. మతఛాందసవాదుల వల్ల ప్రజల మధ్య కలహాలు ఏర్పడవచ్చు. న్యాయ ప్రవర్తన సక్రమంగా లేకపోవడం వల్ల సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయి.
రాజవాహనం- అశ్వం (గుర్రం): ప్రపంచవ్యాప్తంగా అక్కడక్కడ భూకంపాది ఉపద్రవాలు రావచ్చు. దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. వర్షాభావ పరిస్థితులు ఉంటాయి. వివిధ ధాన్యాల ధరలు పెరుగుతాయి. ప్రజల మధ్య కలహాలు కలుగుతాయి
మంత్రి – గురువు : మంచి వర్షాలు కురుస్తాయి. పంటలు సమృద్ధిగా పండుతాయి. రాజులు న్యాయంగా పరిపాలిస్తారు. ప్రజలకు మేలు కలుగుతుంది. ప్రజావృద్ధి, పశువృద్ధి ఉంటుంది. పాడిపంటలకు కొదవ ఉండదు. ఉత్పత్తి పెరుగుతుంది.
సేనాధిపతి- బుధుడు: ఈ సంవత్సరం గాలి ప్రభావంతో ఒకచోట కురవాల్సిన వర్షాలు మరొక చోట కురుస్తాయి. వాయు పీడిత మేఘాల మూలంగా కొన్ని ప్రాంతాల్లో అతికష్టం మీద వర్షాలు పడతాయి. పంటలకు అనుకూల వర్షాలు ఉంటాయి. ప్రజలు సంతృప్తిగా ఉంటారు. స్వాతంత్య్రప్రియులకు రాజకీయ బాధలు ఉంటాయి.
సస్యాధిపతి- శని: నల్లరేగడి భూములు సిరులు కురిపిస్తాయి. నల్లని ధాన్యాలు విశేషంగా పండుతాయి. నువ్వులు, మినుములు, అవిసెలు, నల్ల ధాన్యములు, ఉలవలు, చింతపండు, పొగాకు, తోళ్ల పరిశ్రమ, ఇనుము, యంత్ర సామగ్రి, కట్టెలు, బొగ్గుల ధరలు సరసంగా ఉంటాయి.
ధాన్యాధిపతి- శుక్రుడు: అనుకూల వర్షాలు కురుస్తాయి. సుభిక్షం నెలకొంటుంది. పంటలు సమృద్ధిగా పండుతాయి. వ్యవసాయ ఉత్పత్తులకు అనుకూల ధరలు లభిస్తాయి. ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖంగా జీవనం కొనసాగిస్తారు.
అర్ఘ్యాధిపతి- బుధుడు: మంచి వర్షాలతో పంటలు సమృద్ధిగా పండుతాయి. మద్దతు ధర లభిస్తుంది. సాంకేతిక నిపుణులు, హ్యాకర్స్ సమస్యాత్మకంగా మారవచ్చు. నెయ్యి, వెన్న, పాలు, పెరుగు, అపర ధాన్యాలు, వెండి, బంగారం, నూనెగింజలు, పత్తి, నూలు, నార, గోనెసంచు లు, పసుపు, కలప, కాగితం, కాఫీ గింజల ధరలు పెరుగుతాయి.
మేఘాధిపతి- బుధుడు: ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి. పిడుగులు, వడగండ్ల వర్షా లు అధికం. మధ్యదేశంలో అధిక వర్షాలు.
రసాధిపతి- చంద్రుడు: నెయ్యి, నూనె గింజలు, కొబ్బరినూనె, పల్లీ నూనె, ఆముదం, అవిసె నూనె, నువ్వుల నూనె, కిరోసిన్, పెట్రోలు తదితర రస వస్తువులు, బెల్లం, చెరకు, తేనె, పాలు, చక్కె ర, చింతపండు, నారింజ, కూరగాయల ధరలు పెరుగుతాయి.
నీరసాధిపతి- శని: బంగారం, వెండి, రత్నాలు, ముత్యాలు, కర్పూరం ఉత్పత్తి తగ్గడంతో వాటి ధరలు పెరుగుతాయి. ఇనుము, ఇత్తడి, నూనెల ఉత్పత్తి పెరిగి ధరలు తగ్గుతాయి.
పశుపాలకుడు, గోష్ఠాగార ప్రాపకుడు, గోష్ఠాద్బహి
ప్రాపకుడు- బలరాముడు: సస్యానుకూల వర్షాలు కురుస్తాయి. పంటలు బాగా పండుతాయి. మధ్యదేశంలో సుభిక్షం. పాడిపంటలు సమృద్ధిగా ఉంటాయి. ప్రజ లు ఆరోగ్యంగా జీవిస్తారు. ధరలు మధ్యమంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో వర్షపాతం నమోదులో హెచ్చుతగ్గులు ఉంటాయి. ధరలలో అస్థిరత ఉంటుంది.
– గుడి ఉమామహేశ్వర శర్మ సిద్ధాంతి
తండ్రి పేరు : కీ.శే. గుడి నృసింహ సిద్ధాంతి, బ్రహ్మపురి, నిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ
ప్రస్తుత నివాసం : ఫ్లాట్ నెం. 103-ఎ, రెండవ అంతస్తు, పి.బి.ఆర్. ఎస్టేట్స్,
కూరగాయల మార్కెట్ దగ్గర, నల్లకుంట, హైదరాబాద్ – 500044.
సెల్: 9885096295, 040-27651530.
సనాతన ధర్మానికి, జ్యోతిష్య విద్య, సంస్కృత, వేద శాస్త్రాలకు ఆలవాలమైన గుడి వంశంలో కాశ్యపస గోత్రంలో గుడి నృసింహ సిద్ధాంతి – గోదావరమ్మ దంపతులకు జన్మించారు. జ్యోతిర్విద్యా విశారదులుగా 45 సం॥లు నిరాటంకంగా పంచాంగ రచన గావించిన పితృదేవులైన గుడి నృసింహ సిద్ధాంతి గారి వద్ద జ్యోతిశ్శాస్త్రం, ముహూర్త, సిద్ధాంత (గణిత), జాతక, వాస్తు భాగాలను క్షుణ్ణంగా, సంపూర్ణంగా అభ్యసించారు. అదే సమయంలో సమాంతరంగా శతావధాని శ్రీమాన్ కృష్ణమాచార్యుల సహోదరులు శ్రీ వేంకటేశ్వర చెంపూ ప్రబంధాది అనేక గ్రంథాలను రచించిన అష్టావధాని శ్రీమాన్ శిరిశినహల్ పెరుమాండ్లాచార్యుల వద్ద సంస్కృతంలో పంచ కావ్యాలు నైషధాంతం శ్రద్ధాభక్తులతో అభ్యసించారు. స్మార్త, ఆగమ పండితులు నిత్య పూజా దురంధరులు పితామహులైన శ్రీ గుడి కృష్ణమూర్తి శాస్త్రి గారి వద్ద పూజాది కార్యక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలను అభ్యసించారు. నిర్మల్ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి. (ఎం.పి.సి) పూర్తి చేసి తదనంతరం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్.సి. (అప్లయిడ్ మేథమేటికల్ స్టాటిస్టిక్స్) పూర్తి చేశారు. 19 సం॥ల వయసులోనే పంచాంగ గణితాన్ని ప్రారంభించి మొదటి 2 సంవత్సరాలు పితృదేవుల పర్యవేక్షణ సహాయ సహకారాలతో పూర్తిచేసి తదనంతరం స్వయంగా 41 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా పంచాంగ రచన చేస్తూ సంప్రదించిన వారందరికీ జాతక, జ్యోతిశ్శాస్త్ర, ప్రశ్న, ముహూర్త, వాస్తు విషయ నిర్ణయం తెలియజేస్తూ అనేక మంది మన్ననలను పొందుతున్నారు.