మనుషులున్న ప్రతి ఇంట్లోనూ చెత్త ఉంటుంది. మొదట్లో అందరిలాగే పద్మిని కూడా తడిచెత్త, పొడిచెత్త వేరుచేసి డబ్బాల్లో పడేసేది. కానీ చెత్తతోనూ కొత్త ప్రయోగాలు చేయవచ్చని గ్రహించి, వాటినే బొమ్మలుగా మలుస్తున్నది. పరోక్షంగా కళనూ బతికిస్తున్నది.
హైదరాబాద్కు చెందిన పప్పెట్ ఆర్టిస్ట్ పద్మిని రంగరాజన్ ఒకటిన్నర దశాబ్దంగా తోలుబొమ్మలను తయారుచేస్తున్నది. మూడునాలుగు తరాల నుంచీ వాళ్లింట్లో తోలుబొమ్మలు రూపుదిద్దుకుంటున్నాయి. కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూనే పద్మిని సరికొత్త పంథాను ఎంచుకున్నది. ఉనికిని కోల్పోయిన తోలుబొమ్మలకు కొత్త వేదికను సృష్టించింది. విద్యాబోధనలో తోలుబొమ్మలను ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు దాదాపు ఎనిమిదివేల మంది ఉపాధ్యాయులకు తోలుబొమ్మలను పరిచయం చేసింది. దీనివల్ల విద్యార్థుల హాజరుశాతం పెరిగింది. ఉత్తీర్ణతా అధికమైంది.
స్ఫూర్తి థియేటర్
తోలుబొమ్మల కళను బతికించాలనే ఉద్దేశంతో ‘స్ఫూర్తి థియేటర్ ఫర్ ఎడ్యుకేషనల్ పప్పెట్రీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్’ను స్థాపించింది పద్మిని. తాజాగా ‘వేస్ట్ టు వెల్త్ మిషన్’ కింద ఆమెకు కేంద్ర ఫెలోషిప్ లభించింది. పర్యావరణాన్ని కాపాడాలనే ఆలోచనతో చెత్త నుంచి బొమ్మల తయారీకి శ్రీకారం చుట్టింది. ఓ రోజు, పర్యావరణ పరిరక్షణ గురించి చెబుతుండగా ఒక విద్యార్థిని
‘పర్యావరణ పరిరక్షణ కోసం మీరేం చేస్తున్నారు?’ అని అడగడంతో ఈ ఆలోచనకు బీజం పడిందని చెబుతారు. ఉల్లి, వెల్లుల్లి, నారింజ, వివిధ కూరగాయల తొక్కలను బాగా ఆరబెట్టి పొడి చేస్తారు. వాటికి రంపపుపొడి, కొబ్బరి పీచు జోడించి తోలుబొమ్మలుగా మలుస్తారు.
గోపు, పోపు
తోలు బొమ్మల తయారీ కళాకారిణిగా, ట్రైనర్గా, సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రంలో స్పీకర్గా, ఇఫ్లూలో గెస్ట్ ఎక్స్పర్ట్గా పద్మిని రకరకాల కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతున్నది. ఆమె తన కళా ప్రదర్శనలో గోపు, పోపు.. అనే రెండు క్యారెక్టర్లను సృష్టించింది. ఆ ఇద్దరి మధ్య సాగే సరదా సంభాషణ పిల్లలను పాఠాల వైపు మళ్లిస్తున్నది.