కొందరంతే. ఎంత ప్రయత్నించినా నిద్రపట్టదు. నడిరేయి ఏ జామునో కాసేపు కునుకు కరుణిస్తుంది. అంతలోనే భళ్లున తెల్లారిపోతుంది. లేచి తీరాల్సిందే. ఆఫీసుకు వెళ్లాల్సిందే. సీట్లో కూర్చున్నా చెప్పలేనంత చికాకు. పని సాగదు. అది చూసి బాసుకు కోపం వచ్చేస్తుంది. చివాట్లు తప్పవు. ఇలాంటి కేసులు చాలానే చూసింది బెంగళూరు నివాసి సురభి జైన్. నిజానికి తానూ నిద్రలేమి బాధితురాలే. ఈ సమస్యకు పరిష్కారంగా ‘నీంద్’ అనే మొబైల్ అప్లికేషన్ డిజైన్ చేసింది. అందులో పౌరాణిక, జానపద కథలు ఉంటాయి. సంగీతం వినిపిస్తుంది. ‘కథలు మన ఊహాశక్తికి పనిపెడతాయి.
సప్త సముద్రాలకు అవతల ఒంటిస్తంభం మేడ మీద.. గాజు నాళికలో మాంత్రికుడి ప్రాణం ఉంటుంది’ అనగానే ఆ దృశ్యాన్ని ఊహించుకుంటాం. మెదడుకు ఇదో కసరత్తు. ఆ మానసిక శ్రమ విశ్రాంతికి కారణం అవుతుంది. ఇక సంగీత శక్తికి జోలపాటే నిదర్శనం’ అని విశ్లేషిస్తారు సురభి. ప్రస్తుతం రోజూ ముప్పైవేలమందికి సురభి యాప్ జోలపాడుతున్నది. హాయిగా నిద్రపుచ్చుతున్నది. అందులో ఎనభైశాతం పాతికేండ్ల నుంచి నలభై అయిదేండ్ల ఐటీ ఉద్యోగులే. హిందీ, ఇంగ్లిష్లో ఉన్న యాప్ను ప్రాంతీయ భాషలకూ విస్తరించాలన్నది ఆమె ఆలోచన.