ఆ బాలికకు నాట్యమంటే ప్రాణం. తల్లి ప్రోత్సాహంతో తనకు ఇష్టమైన పేరిణి నృత్యకళకు మెరుగులు దిద్దుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకుంది. నిర్మల్లోని ప్రియదర్శినినగర్కు చెందిన పడిగెల నవనీత-శ్రీనివాస్ దంపతుల కూతురు.. ప్రియదర్శిని ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని వాసవి ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నది. ఇటీవల హైదరాబాద్లోని త్యాగరాయ గానసభలో జరిగిన నంది నృత్యోత్సవ జాతీయ స్థాయి పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి, నంది పురస్కారం అందుకుంది.
ఏకధాటిగా గంటసేపు పేరిణి నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. గిన్నిస్ రికార్డునూ సొంతం చేసుకుంది.ఇప్పటికే గోల్డెన్ స్టార్ వరల్డ్ రికార్డ్, భారత్ వరల్డ్ రికార్డ్, వండర్ బుక్ వరల్డ్ రికార్డ్.. వగైరా ఘనతలు సొంతం చేసుకుంది ప్రియదర్శిని. మలేషియాలోని కౌలాలంపూర్లోనూ ప్రదర్శనలిచ్చి.. ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని అందుకుంది. అలా అని, ప్రియదర్శిని చదువులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ‘మా అమ్మాయి తెలంగాణ రాష్ర్టానికి, నిర్మల్ జిల్లాకూ మంచి పేరు తెచ్చినందుకు గర్వంగా ఉంది. పిల్లల్లో ఏదో ఒక కళ దాగి ఉంటుంది. ఆ ప్రతిభను మనం గుర్తించాలి. ఆ దిశగా తర్ఫీదునిస్తే అద్భుతాలు సాధిస్తారు’ అంటారు ప్రియదర్శిని తల్లిదండ్రులు నవనీత, శ్రీనివాస్.
– రాంపెల్లి నరేందర్