రహేనా షేక్ భగవాన్ వాణిజ్య రాజధానిలో పోలీస్ కానిస్టేబుల్. ఈ పోలీసమ్మ ‘ముంబై మదర్ థెరిసా’గా పేరు తెచ్చుకున్నారు. బలమైన సంకల్పం ఆమెను సేవా మార్గంలో నడిపింది. మహారాష్ట్రలోని రాయగఢ్కు చెందిన రహేనా వాలీబాల్ క్రీడాకారిణి. ఇరవై ఏండ్ల కిందట స్పోర్ట్స్ కోటాలో పోలీసు ఉద్యోగం సంపాదించారు. గత ఏడాది తన కుమార్తె పుట్టిన రోజును వాజే తాలూకాలోని జ్ఞాని విద్యాలయంలో ఘనంగా జరిపించాలని నిర్ణయించారు. వెళ్లిన తర్వాత, అక్కడి విద్యార్థుల కష్టాలు ఆమెను కదిలించాయి. అన్నీ పేద కుటుంబాలే. చాలామందికి చెప్పులు కూడా లేవు. కుమార్తె పుట్టిన రోజుకు ఖర్చు చేయాలనుకున్న డబ్బుతో పాటు, రంజాన్ కోసం దాచుకున్న మొత్తాన్ని కూడా పిల్లల కోసం ఖర్చు చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న 50 మంది గిరిజన విద్యార్థులను దత్తత తీసుకున్నారు. హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్స్ సమకూర్చి ఎన్నో ప్రాణాలను కాపాడారు. ఆ సేవలకు గుర్తుగా పోలీస్ కమిషనర్ హేమంత్ నాగ్రాలే ఆమెను ఘనంగా సత్కరించి, ‘ముంబై మదర్ థెరిసా’ అనే బిరుదును ప్రదానం చేశారు.