పాప ఏడిస్తే.. తల్లి పాలుపడుతుంది. సృష్టికర్త ప్రసాదించిన ఆ రెండు అమృతభాండాలూ అడుగంటిన కుండలుగా మారిపోతే ఆ బిడ్డ పరిస్థితి ఏమిటి? అలాంటి సమయంలో ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ బిడ్డను అక్కున చేర్చుకుంటున్నది. ఆకలి తీరుస్తున్నది. పోషకాల పరమాన్నాన్ని ప్రసాదిస్తున్నది. ‘తల్లిపాల వారోత్సవాల’ సందర్భంగా ఆ అమృతనిధి గురించి..
వికారాబాద్ జిల్లాలో మారుమూల పల్లె. పండంటి కవలలకు జన్మనిచ్చింది సంధ్య (పేరు మార్చాం). సరైన పోషకాహారం అందకపోవడంతో.. ప్రసవం నాటికే తల్లి ఆరోగ్యం క్షీణించింది. కండ్లముందే ఓ బిడ్డ కన్నుమూసింది. మరోబిడ్డ బరువు 900 గ్రాములే. ఉన్న బిడ్డనైనా బతికించుకునేందుకు హుటాహుటిన హైదరాబాద్లోని నిలోఫర్కు తీసుకెళ్లమని సూచించారు వైద్యులు. ఆ మాట విని తల్లిగుండె తల్లడిల్లింది. పొత్తిళ్లలోని బిడ్డను భద్రంగా భర్తకు అప్పగించింది. ఆయన అంబులెన్స్లో హైదరాబాద్ చేరుకున్నాడు. వైద్యులు అత్యవసర వైద్యం అందించారు. అంతలోనే బిడ్డ గుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. ‘తల్లి దగ్గర్లో లేదు. డబ్బా పాలు పట్టమంటారా డాక్టర్?’ దీనంగా అడిగాడు తండ్రి. ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్లో పాలు తీసుకురండి’ అంటూ చీటీ రాసిచ్చింది డాక్టరమ్మ. ఆ లేఖ ఆధారంగా స్వచ్ఛమైన తల్లిపాలను ఉచితంగా ఇచ్చారు మిల్క్ బ్యాంక్ సిబ్బంది. క్షణాల్లో బిడ్డ ఏడుపు ఆగింది. తండ్రి మనసు కుదుటపడింది. దాదాపు 45 రోజులపాటు ఆ బిడ్డకు తల్లిపాల లోటే తెలియలేదు. దాదాపు 900 గ్రాములు ఉన్న బిడ్డను రెండున్నర కిలోల బరువు వచ్చేవరకూ తమ సంరక్షణలో ఉంచుకుని.. ఆ తర్వాతే తల్లి దగ్గరికి చేర్చారు వైద్యులు.
‘ధాత్రి’ గురించి..
హైదరాబాద్లోని నిలోఫర్ ఆస్పత్రి ఆవరణలో 2017లో ఏర్పాటైంది ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’. ఎందరో మాతృమూర్తులు తమ పిల్లలకు ఇచ్చాక మిగిలిన చనుబాలను ఇక్కడ దానంగా ఇస్తున్నారు. ఆ పాలను ఆధునిక యంత్రాలలో పాశ్చరైజ్ చేసి, మైనస్ 20 డిగ్రీల దగ్గర నిల్వ చేస్తారు. దీనివల్ల వైరస్ల బెడద ఉండదు. ఏడాదిపాటు నిల్వ ఉంటాయి. సుషేనా హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ నుంచి హైదరాబాద్ నగరంలో పలు ఆస్పత్రుల్లోని పిల్లలకు ప్రతిరోజూ దాదాపు 12 లీటర్ల వరకూ తల్లిపాలను అందిస్తున్నారు. పసిబిడ్డల ప్రాణాలను నిలబెట్టే మహోన్నత కార్యక్రమం కావడంతో, అమ్మలూ అంతే స్వచ్ఛందంగా స్పందిస్తున్నారు. 2017 నుంచి ఇప్పటివరకు దాదాపు 32 వేల లీటర్ల పాలను నవజాత శిశువులకు పట్టించారు. మొత్తం 23 వేల మంది మాతృమూర్తులు చనుబాలను దానంగా ఇచ్చారు. తల్లుల నుంచి పాలు సేకరించేందుకు ఫౌండేషన్ ప్రత్యేకంగా పరికరాలు ఉపయోగిస్తుంది.
కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ తల్లి (సాఫ్ట్వేర్ ఇంజినీర్).. తనకు ఎక్కువ పాలు ఉత్పత్తి అవుతున్నాయని గ్రహించి, వాటిని వృథా చెయ్యడం ఇష్టం లేక, గూగుల్లో తల్లిపాల నిల్వ గురించి తెలుసుకున్నది. దాదాపు రెండున్నర నెలలు పాలు (43లీటర్లు) పోగుచేసి, ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంకు ప్రతినిధులకు సమాచారం ఇచ్చింది. ఇలా ఎందరో మాతృమూర్తులు మిల్క్ బ్యాంక్ ప్రతినిధులకు తోడ్పాటు అందిస్తున్నారు. ‘ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్’ అనేది ‘కాంప్రహెన్సివ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్’గా కూడా పనిచేస్తుంది. చనుబాల సమస్య ఉన్న తల్లులతో ఇక్కడ ప్రత్యేక వ్యాయామాలు చేయిస్తారు. కాలి బొటనవేలి నుంచి తల వరకూ సున్నితమైన మసాజ్ చేస్తారు. ప్రత్యేకమైన డైట్ సూచిస్తారు. త్వరగా పాలు పడేలా చొరవ తీసుకుంటారు. బరువు తక్కువ బిడ్డలకు ‘కంగారూ మదర్ కేర్’ పద్ధతిలో పాలివ్వడం నేర్పిస్తారు. స్వచ్ఛతలోనూ, పోషకాల్లోనూ తల్లిపాలకు సాటిలేదు. అమ్మ అందించే ఆ అమృతధార బిడ్డ పేగుల ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. చనుబాలలో యాంటీబాడీస్ పుష్కలం. ఇవి వైరస్లు, బ్యాక్టీరియాపై పోరాటం చేస్తాయి. పాలను ఇవ్వడం వల్ల శిశువు ముక్కు, గొంతు, జీర్ణ వ్యవస్థల్లో రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇక తల్లిపాలకు నోచుకోని నవజాత శిశువుల్లో న్యుమోనియా, డయేరియాతో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు అధికం. ఏ బిడ్డా తల్లిపాల కొరతను ఎదుర్కోకూడదు, ఏ నవజాత శిశువూ పోషకాహార లోపంతో మరణించకూడదు.. ఇదే ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఆశయం.
ఆపదలో పుట్టిన ఆలోచనే..
డాక్టర్ సంతోష్కుమార్ గతంలో ఓ ఎన్జీవోలో పనిచేసేవారు. తల్లిపాలు అందని పసిబిడ్డల ఏడుపులు ఆయనను కదిలించాయి. తన ఉద్యోగానికి రాజీనామా చేసి, సుషేనా హెల్త్ ఫౌండేషన్ను స్థాపించారు. ఆ సంస్థ ఆధ్వర్యంలో హైదరాబాద్ కేంద్రంగా ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటుచేశారు. సంతోష్ చిత్తశుద్ధికి మెచ్చి అనేక స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు విరాళాలు ఇచ్చాయి. యంత్ర సామగ్రినీ అందించాయి. ప్రస్తుతం హైదరాబాద్లో నిలోఫర్ దవాఖానతో పాటు.. భోపాల్, ఇండోర్లో మిల్క్ బ్యాంకులు విజయవంతంగా నడుస్తున్నాయి. త్వరలో గాంధీ మెడికల్ కాలేజీలో కూడా ఏర్పాటు చేయనున్నారు. కాకినాడ, లక్నో నగరాలకూ సేవలు విస్తరించే ఆలోచన కూడా ఉంది.
– రవికుమార్ తోటపల్లి