‘న కార్తిక సమో మాసః’ అని ఆర్యోక్తి. ఈ మాసంలో చేసే పూజ, అర్చన,దానం, జపం, స్నానం, అభిషేకం అత్యంత విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి.
కార్తిక మాసానికి కౌముది మాసం అనే పేరు కూడా ఉంది. కౌముది అంటే వెన్నెల అని అర్థం. ఆశ్వయుజ, కార్తిక మాసాలు శరదృతువు. వెన్నెల నిండుగా కాస్తుంది. వీటికి తోడు కార్తికం నెల రోజులూ ఇళ్లలో, దేవాలయాల్లో దీపాలు వెలిగించడం, ఆకాశదీపం పెట్టడం వల్ల ఎక్కడ చూసినా వెలుగులే కనిపిస్తాయి. ఈ కోణంలో కార్తికానికి కౌముది మాసం అనే పేరు వచ్చి ఉండవచ్చు.
కార్తికంలో నెల రోజులు నక్త వ్రతం ఆచరించే సంప్రదాయం ఉంది. నక్తం అంటే పగలంతా ఉపవాసం చేసి, రాత్రి వేళ భోజనం చేయడం. పూర్తిగా నెల రోజులు వ్రతం చేయలేని వారు కనీసం సోమవారాలు, పౌర్ణమి లాంటి పర్వదినాల్లో అయినా ఆచరిస్తే మంచిది. ఆశ్వయుజ, కార్తిక మాసాల్లో మనుషుల జఠరాగ్ని మందగిస్తుంది. ఈ కారణం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ విధమైన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటానికి నక్త వ్రతం పేరుతో భోజన నియమాన్ని మన పెద్దలు ఏర్పాటుచేశారు.
ప్రతి క్రతువూ ప్రత్యేకం..
శివనామ స్మరణ: కార్తిక మాసంలో చేసే శివ నామస్మరణ అనంత ఫలితాన్ని ఇస్తుంది. అప్రయత్నంగా శివ నామస్మరణ చేసినా.. శివలోక సాయుజ్యం కలుగుతుంది. ఇందుకు ఉదాహరణగా స్కంద పురాణంలో సుమిత్రా వృత్తాంతం చెప్పుకోవచ్చు. అనేక తప్పులు చేసినా, చివరికి అప్రయత్నంగా బిల్వదళార్చన, శివనామ స్మరణ చేయడం వల్ల సుమిత్రకు శివ సాయుజ్యం కలిగింది. శివ నామస్మరణ ప్రాముఖ్యం అంతటి
విశేషమైంది.
నదీస్నానం: ఈ మాసం నదీస్నానం చేస్తే దైవానుకూలత సిద్ధిస్తుంది. సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, కాలకృత్యాలు ముగించుకుని, ఇంట్లో ముందుగా స్నానం చేసి, ఆ తర్వాత నదికి వెళ్లి, సంకల్పం చెప్పుకొని స్నానం చేయాలి. అందుబాటులో నది లేకపోతే కాలువ, సరస్సు, చెరువు లేదా బావి దగ్గర అయినా విధి ప్రకారం స్నానం చేయాలి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
దీపారాధన: కార్తిక మాసం 30 రోజులు ఆలయానికి వెళ్లి, నియమ నిష్ఠలతో శివుణ్ని స్మరించి, దీపారాధన చేయాలి. ఉభయ సంధ్యల్లోను దీపారాధన చేయవచ్చు. అలా చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి, సోమవారాల్లో నియమం ప్రకారం ఉపవాసం చేసి, సాయంత్రం శివాలయానికి వెళ్లి దీపారాధన చేయాలి. కార్తిక పూర్ణిమ రోజున పగలంతా ఉపవాసం చేసి, సంధ్యవేళ శివాలయానికి వెళ్లి 365 వత్తులతో దీపం వెలిగిస్తే శివానుగ్రహం కలుగుతుందని పెద్దల మాట.
దీపదానం: ఇంట్లో కన్నా తులసి, ఉసిరి చెట్టు సమీపంలో చేసే దీపదానం శ్రేష్ఠమైంది. దీనికన్నా ఆలయంలో చేసే దానం ఉత్తమం. నదీ తీరంలో గానీ, సముద్ర తీరంలో గానీ చేసే దానం అంతకన్నా ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది. కార్తిక బహుళ చతుర్దశి ఇందుకు శ్రేష్ఠం. కుదరని పక్షంలో పౌర్ణమి లేదా మరే రోజైనా చేయవచ్చు.
ఆకాశదీపం: కార్తికమాసంలో ప్రతి శివాలయంలోను ఆకాశదీపం ఉంచుతారు. స్వయంగా ఆకాశదీపం పెడితే అంతకన్నా ఉత్తమ అర్చన మరొకటి ఉండదని పెద్దల మాట. కుదరని పక్షంలో కనీసం ఆకాశదీపాన్ని చూసి, భక్తిభావంతో నమస్కరించినా విశేష ఫలితాలు కలుగుతాయి. ఆకాశదీప దర్శనం వల్ల మోక్షసిద్ధి కలుగుతుందని విశ్వాసం.
వ్రతాలు: క్షీరాబ్ధి ద్వాదశి వ్రతం, సత్యనారాయణ వ్రతం, కేదారేశ్వర వ్రతాలు చేసుకోవడానికి కార్తిక మాసం అత్యంత శ్రేష్ఠమైంది. ఆయా ప్రత్యేక తిథుల్లో వీటిని చేసుకోవాలి. లేదంటే వీలును బట్టి చేసుకోవచ్చు.వనభోజనం: కార్తిక మాసంలో చేసే వనభోజనం అత్యంత పవిత్రమైంది. వేడుక తీరులో కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో వనభోజనం చేయాలి. శాస్త్రనియమాల ప్రకారం ఉసిరి చెట్టు వద్ద మహావిష్ణు సాలగ్రామం ఉంచి పూజలు చేయాలి. అనంతరం బ్రాహ్మణ సమారాధన చేసి, పురాణ శ్రవణం చేయాలి. దీనివల్ల విష్ణు సాయుజ్యం లభిస్తుంది.
అన్ని వారాలూ విశేషమే..
ఆదివారం: కార్తిక మాసం ఆదివారాల్లో సూర్యోపాసన, అర్చన చేయడం ఎన్నో ఉత్తమ ఫలితాలు కలిగిస్తాయి. ఆదిత్యహృదయ స్తోత్రం పారాయణచేసి, తైలం, నేతవస్త్రాలు దానం చేయాలి. దీనివల్ల కుష్ఠు మొదలైన రోగాలు తొలగిపోతాయి. మిరియాలు, పాలు దానం చేస్తే క్షయరోగం నివారణ అవుతుంది. దీపాలు, ఆవాలు దానం చేస్తే అపస్మారం, మానసిక వ్యాధులు నశిస్తాయి.
సోమవారం: కార్తిక సోమవారాల్లో చేసే శివారాధన, అభిషేకం విశేష ఫలితాలు కలిగిస్తాయి. రోజంతా ఉపవాసం ఉండి, సాయం వేళ శివాలయాన్ని సందర్శించి, అర్చనాది కైంకర్యాలు జరిపించుకుని, ఇంటికి వచ్చి బ్రాహ్మణునికి భోజనం పెట్టాలి. దీనివల్ల మహాదారిద్య్ర వినాశనం
జరుగుతుంది.
మంగళవారం: కుమారస్వామిని పూజించాలి. సుబ్రహణ్య స్తోత్రాలు పఠించాలి. బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి. దీపం, ఘంట దానం చేయాలి. దీనివల్ల వాక్సిద్ధి కలుగుతుంది.
బుధవారం: విష్ణువును అర్చించి, పెరుగన్నం నివేదన చేయాలి. దానిని ప్రసాదంగా ఇతరులకు పంచిపెట్టాలి. దీనివల్ల సత్సంతాన యోగ్యత
కలుగుతుంది.
గురువారం: గురువులను, పండితులను అర్చించాలి. దక్షిణామూర్తి, దత్తాత్రేయ, హయగ్రీవ,సరస్వతీమాతకు అర్చనలు జరపాలి. తేనె, బంగారం, నెయ్యి దానం చేయాలి. దీనివల్ల సకల భోగాలు సిద్ధిస్తాయి.శుక్రవారం: గణపతిని పూజించాలి. గంధం, పుష్పాలు, అన్నదానం చేయాలి. దీనివల్ల ఆటంకాలు తొలగుతాయి. శక్తిగలవారు సువర్ణం, రజతం దానం చేస్తే సత్సంతానం కలుగుతుంది.శనివారం: దిక్పాలకులను అర్చించాలి. నాగదేవతలు, ధన్వంతరి, అశ్వినీదేవతలను కూడా పూజించాలి. ఈ రోజున ఉప్పు, ఇనుము, నూనె, మినుములు, శొంఠి, అల్లం, మిరియాలు దానం చేయాలి. దీనివల్ల రోగాలు తొలగుతాయి.అపమృత్యు భయం ఉండదు.
పుణ్యప్రదమైన కార్తికంలోనే యోగనిద్రలో ఉన్న శేషశాయి మేల్కొంటాడు. వైకుంఠద్వారం తెరుచుకునే ఉత్తరాయణ పుణ్యకాలం సమీపిస్తుంది. అంటే మానవుడికి మోక్షమార్గం తెరుచుకుంటుందని అర్థం. అందువల్ల ఈ మాసంలో ఏ వ్రతం, అర్చన.. మరే ఇతర దైవ సంబంధ కార్యక్రమం చేసినా భగవదనుగ్రహం కలుగుతుంది అనడంలో సందేహం లేదు.
-డా॥ కప్పగంతు రామకృష్ణ