రుచులకు పెట్టింది పేరు మొఘల్ దర్బార్. ఆ తయారీ విధానం పరమ రహస్యం. దినుసుల మేళవింపు ఆస్థాన పాక నిపుణుడికి తప్ప, మరొకరికి తెలిసేది కాదు. తయారీ విధానం కోట దాటితే కఠిన దండనే! అయితే, ఢిల్లీకి చెందిన ఆనమ్ హసన్ నాటి వంటకాలను నేటి తరానికి అందుబాటులో ఉంచారు. ఆమె సాక్షాత్తు మొఘలుల వారసురాలు. వాట్సాప్ద్వారా ఆర్డర్ చేస్తే చాలు ఇంటికే విందులు వచ్చేస్తాయి. ‘మై మొఘల్ రూట్స్’ పేరుతో ఇంట్లోనే వెజ్, నాన్వెజ్ బిర్యానీలు, సంప్రదాయ పానీయాలు తయారు చేస్తున్నారు ఆనమ్. వీకెండ్స్లో తానేం వండుతానన్నది గ్రాఫిక్ కార్డ్ రూపంలో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో పోస్టు చేస్తారు. ముందుగా ఆర్డర్ చేసిన వారికి ముందుగా అవకాశం. తన తల్లిద్వారా మొఘల్ రుచుల గురించి తెలుసుకుంటూ పెరిగారామె. మటన్, చికెన్ బిర్యానీలే కాకుండా నేటి తరానికి తగ్గట్లుగా పిజ్జా, బర్గర్ వంటి పాశ్చాత్య వంటకాల్లోకూడా మొఘల్ మసాలా దినుసులు జొప్పించి కొత్త రుచులకు ప్రాణం పోస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన ఆమె తాత, ఇంటికి ఎవరొచ్చినా కడుపునిండా బిర్యానీ పెట్టకుండా పంపేవారు కాదట. ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ.. వచ్చిన లాభాల్లో కొంత ప్రజా సేవకు కేటాయిస్తున్నారు ఆనమ్. ఢిల్లీ వెళ్లినప్పుడు మీరూ ప్రయత్నించవచ్చు!