న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీ పోలీసులకు, సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు ప్రధాని 15 మంది పేర్లను ఇచ్చారని, వారిపై అక్రమ కేసులు పెట్టి దాడులు నిర్వహించాలని ఆదేశించారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లోపు ఆ 15 మందిని దెబ్బతీయాలని టార్గెట్ విధించారన్నారు. జాబితాలో అత్యధికంగా ఆమ్ఆద్మీ పార్టీకి (ఆప్) చెందినవారే ఉన్నారని పేర్కొన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఆప్కు పెరుగుతున్న ఆదరణను చూసి జీర్ణించుకోలేకే ఈ అక్రమ దాడులను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. సిసోడియా ఆన్లైన్లో మాట్లాడిన అనంతరం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా ట్విట్టర్లో అలాంటి ఆరోపణలే చేశారు. గతంలోనూ అక్రమ కేసులు పెట్టారని అన్నారు. ఈ ఆరోపణలు కల్పితాలని ఢిల్లీ బీజేపీ చీఫ్ ఆదేశ్ గుప్తా ఖండించారు.