లెక్కలంటే పిల్లలకు భయం. లెక్కల టీచరంటే ఇంకా భయం. ఎక్కడ ఎక్కాలు అడుగుతారో.. అని పీరియడ్ అయ్యేంత వరకూ క్షణమొక యుగంగా గడిపేస్తారు విద్యార్థులు. కానీ, ఆ పంతులమ్మ లెక్కలు చెబితే అరటి పండు ఒలిచి పెట్టినట్టు ఉంటుంది. బట్టీయం ఉండదు. బడితె పూజ అస్సలుండదు. పిల్లలు కూడా గుక్క తిప్పుకోకుండా ఎక్కాలు చెప్పేస్తారు. అడగ్గానే ఠకీమని సూత్రాలు వల్లిస్తారు. ఇదంతా తమ టీచర్తోనే సాధ్యమైందంటారు అభిమానంతో.
గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ గొర్రెకుంట ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో గణితం ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు తౌటం నిహారిక. సగటు విద్యార్థికి కూడా అర్థమయ్యే రీతిలో గణితం చెప్పడంలో ఆమె దిట్ట. 2018లో ఇంటర్నేషన్ లీడర్షిప్ ఇన్ ఎడ్యుకేషన్ అవార్డుకు ఎంపికైన నిహారిక, అమెరికాలోని ఆరిజోనా యూనివర్సిటీలో ఇంగ్లిష్, గణిత బోధన విధానంపై శిక్షణ తీసుకున్నారు. ఈ కార్యక్ర మానికి తెలంగాణ నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు నిహారిక మాత్రమే! తను 1998లో ఎస్జీటీగా కేసముద్రం మండలం బోడ మాన్షియ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేపట్టారు. 2009లో తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలకు బదిలీ అయ్యారు. అక్కడ పనిచేస్తున్న సమయంలోనే స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్ పొంది, డిప్యుటేషన్పై జిల్లా బాలికల అభివృద్ధి అధికారిగా బాధ్యతలు చేపట్టారు. 2013లో గొర్రెకుంట పాఠశాలకు బదిలీ అయ్యారు. నాటి నుంచి ఇక్కడి విద్యార్థులకు లెక్కలంటే కొట్టినపిండి. చార్టులు, ఇతర పద్ధతుల ద్వారా నిహారిక సాగించే బోధనకు పిల్లలు ఫిదా అయిపోతారు. విద్యార్థులను గణిత నిపుణులుగా చూడాలనే లక్ష్యంతో.. బోధనలో వివిధ యాప్స్ వినియోగిస్తుంటారు ఆమె. ఆటల ద్వారానూ లెక్కల పాఠాలు చెబుతారు. ఆంగ్ల భాషనూ వినూత్నంగా బోధిస్తున్నారు.
… బానోతు నర్సింహా