‘హనుమంతుడు మాటతీరు తెలిసినవాడు’అని శ్రీరామచంద్రునంతటివాడు ప్రశంసించాడు. నవ వ్యాకరణ పండితుడవడమే హనుమంతుడి మాటతీరుకు కారణం. హనుమ సూర్యభగవానుడి దగ్గరకు వెళ్లి తనకు వ్యాకరణాన్ని నేర్పమన్నాడు. చిన్నప్పుడు తనను తిన దగిన ఫలమని భావించి ఎగిరి వచ్చిన హనుమను చూస్తే ముచ్చటేసింది సూర్యుడికి. ‘నేర్పుతాను. కానీ, నేను ఒకచోట స్థిరంగా ఉండటానికి కుదరదు కదా! గగన మార్గంలో నా వెంట ఎలా తిరుగ గలవు?’ అనడిగాడు భానుడు.
‘ఓ దానిదేముంది!’ అంటూ తన కాయాన్ని పెంచిన ఆంజనేయుడు ఉదయాద్రిన ఒక కాలు, అస్తాద్రిన ఒక కాలు మోపి, సూర్యగమనానికి అనువుగా నడుమును వంచుతూ, చెవి ఒగ్గి ఆదిత్యుడి దగ్గర వ్యాకరణ శాస్ర్తాన్ని కూలంకషంగా అధ్యయనం చేశాడు. భూమి నుంచి చూసినప్పుడు సూర్యుడికి ఒక ప్రత్యేక గమన మార్గం సరళరేఖలా ఉంటుందనీ, అంతరిక్షంలో అతగాడు అడ్డదిడ్డంగా పయనించడన్న విషయం భారతీయులకు త్రేతాయుగం నాటికే తెలుసని చెబుతున్నదీ కథ.
వైశంపాయుని శిష్యుడైన యాజ్ఞవల్క్యుడు గురువుగారి కోపానికి గురయ్యాడు. తన వద్ద నేర్చిన విద్యను కక్కేసి ఆశ్రమం నుంచి వెళ్లిపొమ్మన్నాడు. ఆశ్రమం వాకిట్లో యాజ్ఞవల్క్యుడు కక్కిన విద్య మాంస ఖండాలుగా బయటపడింది. గురువు ఆజ్ఞతో మిగిలిన శిష్యులు తిత్తిరి పక్షుల రూపాన్ని ధరించారు. ఆ మాంస ఖండాల్ని భుజించి వేద విద్యా పారంగతులయ్యారు. తిత్తిరి పక్షుల రూపంలో విద్యను గ్రహించారు కనుక వారు గ్రహించిన వేదసారం తైత్తిరీయ సంహితగా పేరుగాంచింది. గురువు ఆజ్ఞను ధిక్కరించిన నేరానికి యాజ్ఞవల్క్యుడికి విధించిన శిక్ష ఆశ్రమ బహిష్కరణ. అంత మాత్రమే కాదు అతడు అక్కడ నేర్చిన విద్యను తన జీవితకాలంలో ఉపయోగించకూడదు. తను నేర్చిన విద్య సమస్తాన్ని తోటి విద్యార్థులకు సంపూర్ణంగా నేర్పి మరీ వెళ్లాలి. ఇదీ ఈ కథను మనం అర్థం చేసుకోవలసిన తీరు.
విద్యా విహీనుడైన యాజ్ఞవల్క్యుడు విద్య కోసం సూర్యభగవానుడిని ఆశ్రయించాడు. ఆదిత్యుడు అతడికి యజుర్వేదాన్ని అనుగ్రహించాడు. ఆదిత్య లోకంలో చీకట్లుండవు. వెలుగు నిరంతరాయంగా ప్రసరిస్తూ ఉంటుంది కనుక యాజ్ఞవల్క్యుడు నేర్చిన విద్య శుక్ల యజుర్వేదం అయింది. రాత్రింబవళ్లు ఉండే మానవ లోకంలో అంతకు ముందు నుంచి ఉన్నది కృష్ణ యజుర్వేదమైంది. వేదానికి స్వరమే ప్రధానం, స్వరం లేని వేదం ఫలించదు. నిరంతరమూ పయనించే సూర్యుని రథ ఘోష వల్ల యాజ్ఞవల్క్యుడు స్వరాన్ని పట్టుకోలేకపోయాడు. స్వరం లేకపోయినా సరే శుక్ల యజుర్వేదం ఫలిస్తుందన్న వరాన్నిచ్చాడు భాస్కరుడు.
సూర్య మండలంలో నిరంతరమూ పేలుళ్లు జరుగుతుంటాయని, ఆ పేలుళ్ల కారణంగా వచ్చే వెలుగు, వేడిమిలే సౌరకుటుంబ అస్తిత్వానికి కారణమని ఆధునిక శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వాహనం వేగం పెరిగే కొద్దీ, దాని నుంచి వెలువడే శబ్దం అలవికాని స్థాయిలో పెరుగుతుందంటున్న విషయం మనందరికీ తెలుసు. యాజ్ఞవల్క్యుడి కథ ఈ శాస్త్రీయ అంశాన్ని త్రేతాయుగంలోనే నొక్కి వక్కాణించింది.
సూర్యుని రథానికి ఒకటే చక్రమున్నదట. ఒకే చక్రమున్న వాహనం ఆగడానికి ఉండదు. సూర్యుడు ఆ రథం నుంచి పడిపోకుండా ఉండాలంటే నిరంతరం గమిస్తూనే ఉండాలి. కాలచక్రం ముందుకు సాగిపోతూనే ఉంటుంది. వెనక్కి వెళ్లదు. కాలగణనం మనకు వర్తులాకారంలో ఉంటుంది. పాశ్చాత్యులకు అది సరళరేఖ. మన కాలగణనం అంతరిక్ష ఘటనలతో ముడిపడి ఉంటుంది. అంతరిక్షంలో జరిగే ఘటనలు ఒక నిర్ణీత సమయానుసారం మళ్లీ మళ్లీ జరుగుతుంటాయి. ఈ విషయాన్ని తెలిపేందుకే అరవై ఏండ్ల ఉగాదుల చక్రాన్ని, నూటాఇరవై ఏండ్ల ‘భ’చక్రాన్ని అన్వయించుకొని కాలగణన చేపట్టారు భారతీయులు.
వరిగొండ కాంతారావు
94418 86824