రోజుకు ఎనిమిది గంటల పని. కుర్చీలో కూలబడి, కంప్యూటర్కు కండ్లు అప్పగించి కోట్ల మంది ఉద్యోగ పర్వంలో తలమునకలై ఉన్నారు. అయితే, పనివేళలు, ఉద్యోగంలో ఒత్తిడి వారి ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతున్నది. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రకారం.. ప్రతీ సంవత్సరం దాదాపు 20లక్షల మంది ఉద్యోగులు పనిలోనే ప్రమాదాలబారిన పడుతున్నారు. కొంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. సాధారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వాటిని ఎలా అధిగమించాలి?
వెన్నునొప్పి: గంటల తరబడి పనిలో వెన్నెముక సమస్యలు సర్వసాధారణం. క్రమంగా ఇది స్పాండిలైటిస్కు దారి తీసే ప్రమాదం ఉంది.
పరిష్కారం: సరైన కుర్చీలో కూర్చుంటే వెన్నెముక సమస్య రాకుండా అడ్డుకోవచ్చు. నడుము కటిభాగంలో సపోర్ట్ ఉండాలి. కంప్యూటర్పై పనిచేసే వాళ్లు టేబుల్, కుర్చీ ఎత్తులు నిర్ణీత కొలతల్లో ఉండేలా చూసుకోవాలి. పని మధ్యలో పది నిమిషాలైనా విరామం తీసుకుని, నాలుగు అడుగులు వేస్తుండాలి.
కంటి సమస్యలు: కంప్యూటర్పై గంటలకొద్దీ పనిచేయడం వల్ల కండ్లు పొడిబారుతుంటాయి. కండ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ఇది క్రమంగా కంటి సమస్యలకు దారితీస్తుంది.
పరిష్కారం: కంప్యూటర్పై సరైన వెలుతురు పడేలా చూసుకోవాలి. మానిటర్ వెలుగు నిర్దిష్టంగా ఉండేలా సెట్ చేసుకోవాలి.
తలనొప్పి: ఉద్యోగులు ఎక్కువగా ఎదుర్కొనే సమస్య తలనొప్పి. పనిలో ఒత్తిడి, కూర్చునే విధానం, నీరు సరిగ్గా తాగకపోవడం ఇవన్నీ తలనొప్పికి కారణాలు.
పరిష్కారం: పనిలో ప్రతీ రెండు గంటలకు ఒక పది నిమిషాలు విరామం తీసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. ప్రతి ఉదయం వ్యాయామం తప్పనిసరి.
ఊబకాయం: గంటల తరబడి కూర్చుని చేసే ఉద్యోగాల వల్ల చాలామంది ఊబకాయం బారినపడుతున్నారు. రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం, ఆహారపు అలవాట్లు శరీరంలోని కేలరీల సంఖ్యను పెంచుతాయి. దీనికితోడు వ్యాయామం లేకపోవడంతో ఒత్తిడి పెరిగి ఊబకాయం సమస్యకు దారితీస్తున్నది.
పరిష్కారం: జంక్ఫుడ్ను నియంత్రించాలి. ప్రతి ఉదయం నడక తప్పనిసరి. చిన్నపాటి కసరత్తులూ చేయాలి. యోగాభ్యాసం కూడా మేలుచేస్తుంది. వీటితోపాటు వేళకు ఆహారం తీసుకోవాలి. అందులో సమతుల ఆహారం ఉండేలా చూసుకోవాలి.
మానసిక సమస్యలు: పని ఒత్తిడి వల్ల మెజారిటీ ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నది. ఉద్యోగ అభద్రత, టార్గెట్లు, బాస్ పోకడ, స్నేహపూర్వక వాతావరణం కొరవడటం తదితర కారణాల వల్ల మానసిక ఆందోళనకు గురువుతున్నారు.
పరిష్కారం: అందరితో స్నేహంగా మెలగాలి. పనిని వర్గీకరించుకొని చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. సెలవు రోజుల్లో ప్రశాంతంగా గడపాలి. అడపాదడపా ఏదైనా విహారయాత్రకు వెళ్లి సేదతీరడం వల్ల మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతాం.