అన్ని వయసుల వారికీ చర్మ సమస్యలు ఉంటాయి. వాటి నుంచి బయటపడేందుకు రకరకాల క్రీములు రుద్దుకుంటూనే ఉంటారు. అయినా ఫలితం ఉండదు. ఆ ప్రయత్నంలో కుంకుమాది తైలం ఎంతో ఉపయోగపడుతుంది.
కుంకుమాది తైలాన్ని వివిధ ఆయుర్వేద మూలికలతో తయారు చేస్తారు. ఇందులో ప్రధానమైంది కుంకుమ పువ్వు. మచ్చలు, మొటిమలు, గాయాలు, దురద తగ్గించే శక్తి దీనికి ఉంది. కుంకుమాది తైలం తయారీలో చందనం, వట్టివేళ్లు, పాలు కూడా ఉపయోస్తారు. వీటివల్ల చర్మం మృదువుగా మారుతుంది. కండ్ల కింద నల్లని వలయాలు, ముడతలు మాయం అవుతాయి. మృతకణాలు తొలగిపోయి చర్మం పరిశుభ్రంగా మారుతుంది.
ఎలా ఉపయోగించాలి?
ముందుగా గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత, చేతుల్లోకి కొన్ని చుక్కల కుంకుమాది తైలాన్ని తీసుకోవాలి. ఐదు నుంచి పది నిమిషాలపాటు తైలంతో ముఖానికి మర్దన చేయాలి. ఒకటి, రెండు గంటల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. కాకపోతే, జిడ్డు చర్మం వాళ్లు కుంకుమాది తైలాన్ని ఎక్కువ సేపు ముఖంపై ఉంచుకోవడం మంచిది కాదు. ముఖం మరింత జిడ్డుగా మారిపోతుంది.