ఆమెకు వంటిల్లు చాలన్నారు! పది పాసైతే గొప్ప అనుకున్నారు!! ‘ఉద్యోగం చేసేదుందా.. ఊళ్లు ఏలేదుందా?’ అని వెనక్కి లాగారు!! కానీ, ఆమె ఆలోచన ఇప్పుడు కోట్ల రూపాయల విలువ చేస్తున్నది. ఆమె పరిశోధన కొత్త ప్రస్థానానికి నాంది పలుకుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అండగా.. మన ఆడబిడ్డలు అద్భుతాలు చేస్తున్నారు.‘వీ హబ్’ వేదికగా కొత్త వేకువకు భూమిక అవుతున్నారు. సాటి మహిళలకు విజయ తారక మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. కాలగతిలో ఉత్తమాయణంగా చెప్పే ఉత్తరాయణం ప్రవేశించిన వేళ.. కలల ప్రాజెక్టులతో లక్ష్మీకళ సంతరించుకున్న ఈ సంక్రాంతి ఉష‘స్త్రీ’ల విజయగాథలు మరెందరికో ఆదర్శం అవుతాయి. జనవరి 16 ‘స్టార్టప్ డే’ సందర్భంగా వారి ప్రస్థానాన్ని ప్రస్తావించుకుందాం.
చీకటి నుంచి వెలుగుల వైపు.. శాపం నుంచి శాసించే వరకు.. తెలంగాణ అతివల ప్రస్థానం కొనసాగుతున్నది. అందుబాటులో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ అవధుల్లేని ప్రగతి వైపు అడుగులు వేస్తున్నారు. సాధించాలనే తపన, సడలని పట్టుదల, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎంచుకున్న రంగంలో అగ్రభాగాన నిలుస్తున్నారు. అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన ‘వీ-హబ్’తో ఆంత్రప్రెన్యూర్లుగా సత్తా చాటుతున్నారు.
మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నెలకొల్పిన ఉమెన్ ఆంత్రప్రెన్యూర్స్ హబ్ (వీ హబ్) సత్ఫలితాలను ఇస్తున్నది. 2018 మార్చిలో ఏర్పాటైన ‘వీ హబ్’ను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆర్థిక, సామాజిక అడ్డంకులను అధిగమించి మహిళలు వ్యాపారవేత్తలుగా రాణించేందుకు వీ హబ్ అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తున్నది. ఇక్కడ పురుడు పోసుకుంటున్న స్టార్టప్లు గ్రామీణ ప్రాంతాలు మొదలుకుని అంతర్జాతీయ స్థాయిలోనూ మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాయి. నిత్యావసర వస్తువులు, ఫుడ్ ప్రాసెసింగ్, చేనేత దుస్తుల తయారీ, ఆరోగ్య, లైఫ్ సైన్స్ రంగాలకు చెందిన అనేక స్టార్టప్లకు వీ హబ్ కేరాఫ్గా నిలుస్తున్నది. హైదరాబాద్కే పరిమితం కాకుండా అంతర్జాతీయంగానూ మహిళా స్టార్టప్లు రాణించడంలో వీ హబ్ కీలక పాత్ర పోషిస్తున్నది.
-డాక్టర్ కణికా బన్సల్
మారుతున్న జీవనశైలి, అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అనారోగ్యం బారినపడ్డాక బాధపడకుండా.. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే గోటితోనే సమస్యను తొలగించుకోవచ్చు అంటుంది డాక్టర్ కణికా బన్సల్. అందుకోసం వ్యాధులపై ముందస్తు అస్త్రంగా క్షణక్షణం శరీర ఉష్ణోగ్రతను పర్యవేక్షించే ఎన్వీ-కోర్ పరికరాన్ని అభివృద్ధి చేసింది. దీంతో గుండె స్పందనలను బట్టి శరీర ఉష్ణోగ్రత ఆధారంగా పలు వ్యాధులను ముందుగానే గుర్తించవచ్చు. అమెరికాలో మాస్టర్స్ పూర్తిచేసిన కణిక అక్కడే అనేక వ్యాధులపై పరిశోధనలు చేసి పరిష్కారాలను చూపింది. 2018లో స్వదేశానికి తిరిగి వచ్చాక.. తన సహచరుడైన ఎలక్ట్రికల్ ఇంజినీర్ దినేశ్తో కలిసి పరిశోధనలు సాగించింది. గుండె లయను, శరీర ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షించే పరికరాన్ని కనుగొన్నది. వివిధ వ్యాధులకు సంబంధించిన సమస్యలను ఇది ముందుగానే హెచ్చరిస్తుంది. ప్రస్తుతం చివరి దశ ప్రయోగాల్లో ఉంది. మరో రెండు నెలల్లో ఎన్వీ-కోర్ పరికరాన్ని మార్కెట్లోకి తెస్తామని చెబుతున్నది కణిక. వీ-హబ్ మార్గనిర్దేశంలో పరికరాన్ని అభివృద్ధి చేసే పనిలో ఉన్నదామె.
ఎన్వీ-కోర్ డివైస్ పరిమాణం ప్రస్తుతం మార్కెట్లో ఉన్నవాటికన్నా తక్కువ. దీనిని సర్జికల్ టేప్ సాయంతో ఛాతీ మీద అమరిస్తే చాలు.. గుండె కొట్టుకునే వేగంతోపాటు, శరీర ఉష్ణోగ్రతలను నిరంతరం పర్యవేక్షించి వాటిలో కలిగే మార్పులను పసిగడుతుంది. రెండిటి సమాచారం ఫోన్లోని యాప్ద్వారా గ్రాఫిక్స్ రూపంలో తెలుసుకోవచ్చు. వ్యాధులను అంచనావేసి హెచ్చరిస్తుంది. తద్వారా వైద్యులను ముందుగానే సంప్రదించే అవకాశం కలుగుతుంది. ‘ఐసీయూలో ఉన్న రోగికి సైతం ఈ పరికరాన్ని అమర్చి అతని ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయవచ్చు’ అంటున్నది కణిక.
-లావణ్య సుంకరి
కరోనా ప్రభావంతో పోషక ఉత్పత్తులకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఈ అవకాశాన్నే తన వ్యాపార సూత్రంగా ఎంచుకున్నది లావణ్య సుంకరి. ‘లారిక్’ బ్రాండ్ పేరుతో ఆహార ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. తల్లిపాలు, కొబ్బరిలో ఉండే లారిక్ యాసిడ్ను ‘లారిక్ షాట్స్’ పౌడర్గా విపణిలోకి విడుదల చేసింది. దీనిని మూడు నెలలపాటు రోజుకు 4 గ్రాముల చొప్పున పాలతో తీసుకుంటే చర్మ సంబంధిత, జుట్టుకు చెందిన సమస్యలు దూరమవుతాయి. లారిక్ బ్రాండ్ ఉత్పత్తులకు 2021 సంవత్సరానికి గానూ ‘ఇండియా న్యూట్రిషన్’ అవార్డు వచ్చింది. అమెరికా నుంచి క్లీన్ లేబుల్ ప్యూరిటీ ధ్రువపత్రం సైతం లభించింది.
హైదరాబాద్కు చెందిన లావణ్య బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ చదివింది. కాలేజీ రోజుల్లో స్నేహితురాళ్లు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగంలో చేరేందుకు ఆసక్తి చూపడంతో వారితోపాటు లావణ్య కూడా ప్రయత్నించింది. ఉద్యోగానికీ ఎంపికైంది. శిక్షణకు సన్నద్ధమవుతున్న తరుణంలో.. ఒకే కూతురు కావడంతో కన్నవారు వద్దని వారించారు. చేసేది లేక సేల్స్, మార్కెటింగ్ రంగాల్లో కొన్నాళ్లు పనిచేసింది. ఈ ప్రయాణంలో వ్యాపార రంగంపై ఆమెకు ఆసక్తి మొదలైంది. రోజూ డైట్లో భాగంగా కొబ్బరినీళ్లు తాగడం ఆమె అలవాటు. కొబ్బరికాయలోని లారిక్ యాసిడ్తో ఉన్న ప్రయోజనాలు తెలుసుకుంది. దాన్నే వ్యాపార అస్త్రంగా మలుచుకొని 2020లో స్టార్టప్ ప్రారంభించింది. సహ వ్యవస్థాపకురాలు అర్చనతో కలిసి పరిశోధనల్లో పాలుపంచుకుంది. 2022లో లారిక్ బ్రాండ్ పేరుతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్లేని పదార్థాల ఉత్పత్తి ప్రారంభించింది. ‘20 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వాళ్లు లారిక్ షాట్స్ వినియోగించవచ్చు. ప్రస్తుతం మా స్టార్టప్కు దేశవ్యాప్తంగా 30వేల మంది కస్టమర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలీనియల్స్కు మా ఉత్పత్తులను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. 24 ఫార్ములేషన్లను అభివృద్ధి చేసి పేటెంట్కు దరఖాస్తు చేశాం’ అని చెప్పుకొచ్చింది లావణ్య. ‘లారిక్ షాట్స్’ స్టార్టప్ కోసం వీ హబ్ రూ.50 లక్షలు, టీ హబ్ రూ.25 లక్షలు ఫండ్ అందించాయి. రూ.3.50 కోట్లతో ప్రారంభించిన వ్యాపారం రూ.4 కోట్ల టర్నోవర్ సాధించి లాభాలను ఆర్జించింది.
-ప్రశంస సహానీ
‘ఒకరి దగ్గర ఉద్యోగిగా ఉండటం కాదు.. పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలి’ ప్రశంస సహానీ సంకల్పం ఇది. వీ హబ్తో ఆమె కల నెరవేరింది. విజయవంతమైన ఆంత్ర ప్రెన్యూర్గా ప్రశంసలు అందుకున్నది. హైదరాబాద్కు చెందిన ప్రశంస ముంబైలోని సెయింట్ జేవియర్స్ నుంచి మాస్ కమ్యూనికేషన్లో పీజీ చేసింది. వ్యాపారవేత్తగా రాణించాలన్నది ఆమె ఆశయం. ప్రకృతి సిద్ధమైన ఎకో ఫ్యాబ్రిక్ తయారు చేయాలని అనుకుంది. అయితే సరైన అవగాహన లేకపోవడంతో లక్ష్యం మొదట్లో నెమ్మదించింది. సరైన వేదిక దొరికితే తన ఆలోచనను మరింత పక్కాగా అమలు చేయొచ్చని భావించేది. అదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన వీ హబ్ ఎడారిలో ఒయాసిస్లా కనిపించింది. అక్కడ నిర్వహించే దాదాపు అన్ని కార్యక్రమాల్లో ఆమె పాల్గొనేది. తన ఆలోచన వారితో పంచుకుంది. వీ హబ్ ఆమెకు దన్నుగా నిలిచింది. ఫలితంగా అవతరించిందే ‘హెమిస్’ బ్రాండ్. ప్రకృతి ఒడిలో నుంచి సేకరించిన వ్యర్థాలతో ఎకో ఫ్రెండ్లీ వస్ర్తాలను తయారు చేసి ‘ఔరా!’
మొదలైన ‘హెమిస్’ స్టార్టప్ ద్వారా అలోవెరా, తామర, పాలు, సోయా, జనపనార, ఆరటి, యూకలిప్టస్, వెదురు, మక్కజొన్న, గులాబీ తదితర ప్రకృతి సిద్ధమైన వనరుల వ్యర్థాలతో వస్ర్తాలను తయారు చేయడం మొదలుపెట్టింది. ఈ వస్ర్తాలను ప్రస్తుత ఫ్యాషన్కు తగ్గట్టుగా డిజైన్ చేసి విదేశాలకూ ఎగుమతి చేస్తున్నది. మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ తదితర రాష్ర్టాల నుంచి పండ్ల వ్యర్థాలను సేకరిస్తున్నారు. స్టార్టప్ ద్వారా 30 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తున్నది.
థ్యాంక్యూ కేటీఆర్: ‘వీ హబ్.. మహిళలు తమ ఆశయాలను నెరవేర్చుకునే అందమైన వేదిక. ఇక్కడ ఆలోచన పంచుకుంటే చాలు వ్యాపారం ప్రారంభం, విస్తరణ వాటంతట అవే జరిగిపోతాయి. ఇలాంటి వ్యవస్థ దేశంలో మరెక్కడా లేదు. సాధారణ, మధ్యతరగతి, ఉన్నత వర్గాలంటూ తేడా ఉండదు. మంచి ఐడియా ఉంటే చాలు.. కాగల కార్యం వీ హబ్ నెరవేరుస్తుంది. ఇలాంటి వేదికను అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కేటీఆర్కు ధన్యవాదాలు’ అంటుంది ప్రశంస సహాని.
-లక్ష్మీహరిత భవాని
స్విగ్గీలో టిఫిన్, జొమాటోలో డిన్నర్.. ఆఫీస్ క్యాంటీన్లో లంచ్! ఇదీ రోజువారీ తంతు!! భార్యాభర్తలు ఉద్యోగాలతో బిజీగా ఉండటంతో చాలామంది ఇన్స్టంట్ ఫుడ్ మీద ఆధారపడుతున్నారు. తినడానికి రుచిగా ఉన్నా.. వీటివల్ల ఆరోగ్యానికి కీడు తప్పదు. ఈ పరిస్థితికి విరుగుడు మంత్రాన్నే తన వ్యాపార సూత్రంగా ఎంచుకున్నది లక్ష్మీహరిత భవాని. అచ్చంగా అమ్మ వంటను మరిపించే ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే లక్ష్యంతో ‘ఏన్షియెంట్ ఫుడ్స్ ఇండియా’ స్టార్టప్ను నెలకొల్పింది. చిరు వ్యాపారంగా మొదలై ఇప్పుడు లక్షల రూపాయలు ఆర్జిస్తున్నది. కృష్ణాజిల్లాకు చెందిన లక్ష్మీహరిత కుటుంబం ఉద్యోగరీత్యా హైదరాబాద్లో స్థిరపడింది. జేఎన్టీయూలో ఎంటెక్ చేసింది. 2015లో వివాహం అయిన తర్వాత ఆమె కెరీర్ ముందుకుసాగలేదు. కొన్నాళ్లు ఓ సోలార్ కంపెనీలో సీనియర్ మేనేజర్గా పని చేసింది. తొలిచూలులో ఆమెకు పండంటి బాబు పుట్టాడు. ఆ బుజ్జాయికి తన తల్లి సహజ సిద్ధమైన పదార్థాలతో ఇన్స్టంట్ ఉగ్గు తయారు చేసి పెట్టడం గమనించింది హరిత. దీన్నే వ్యాపార మార్గంగా ఎందుకు ఎంచుకోకూడదు అనుకుంది. ఆలోచన రాగానే రాజేంద్రనగర్లోని ఆర్గానిక్ ఇన్స్టిట్యూట్లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. మొదట నాలుగైదు స్నాక్స్తో వ్యాపారం మొదలుపెట్టింది. వీటిలో ఉపయోగించే ముడి పదార్థాలలో ఆర్గానిక్ పద్ధతిలో పండించే రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేది. ప్రస్తుతం 35 రకాల ఆర్గానిక్ ఇన్స్టంట్ వంటకాలను విక్రయిస్తున్నది. ముఖ్యంగా పాలలో కలుపుకొని తినే ‘మిల్లెట్ మ్యాజిక్’ ప్రొడక్ట్కు మంచి డిమాండ్ ఉన్నది.
‘ఆర్గానిక్ పదార్థాలతో తయారుచేసిన ‘ఏన్షియెంట్ ఫుడ్స్ ఇండియా’లో ఎలాంటి రసాయనాలు ఉండవు. ఇవి అన్ని వయసుల వారూ తీసుకోవచ్చు. డిమాండ్కు తగ్గట్టుగా దుకాణాలకు పంపిణీ చేయడంతోపాటు ఆన్లైన్ ఆర్డర్లూ తీసుకుంటున్నాం. వీ-హబ్ చొరవతో క్యూ మార్ట్లో కూడా మా ఉత్పత్తులను విక్రయించే అవకాశం కలిగింది. నెలకు రూ.2.50 లక్షలు సంపాదిస్తున్నాను. దీంతోపాటు పదిమందికి ఉపాధి అందిస్తున్నందుకు గర్వంగా ఉంది’ అంటున్నది లక్ష్మీహరిత భవాని.
-మాధవి
పర్యావరణానికి చేటు చేస్తున్న ప్లాస్టిక్ భారాన్ని తప్పించడమే తన వ్యాపారంగా మలుచుకున్నది సిద్దిపేట జిల్లా ఎనగుర్తికి చెందిన మాధవి. వివిధ దేశాల్లో ఉన్నతమైన ఉద్యోగాలు చేసిన ఆమె స్వదేశానికి తిరిగి వచ్చి ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా విస్తరాకులు ఉత్పత్తి చేసే వ్యాపారం ప్రారంభించింది. మాధవి హైదరాబాద్లో బీ ఫార్మసీ చదివింది. ఆమె భర్త వేణుగోపాల్ మెకానికల్ ఇంజినీర్. భర్తతోపాటు విదేశాలకు వెళ్లింది. థాయ్లాండ్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేసింది. 2007లో ఇండియా తిరిగివచ్చింది. 2016లో సిద్దిపేట జిల్లా తిమ్మారెడ్డిపల్లిలో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేసి సేంద్రియ వ్యవసాయం చేపట్టింది. ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన ప్లాస్టిక్ విస్తరాకులు, గ్లాసులూ కంటపడేవి. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా సహజసిద్ధమైన విస్తరాకులు తయారు చేయాలని ఆలోచించింది. 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరుతో వ్యాపారం ప్రారంభించింది. ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలోని గిరిజన మహిళలతో ఒప్పందం కుదుర్చుకొని మోదుగ ఆకులు సేకరించడం మొదలుపెట్టింది. వాటిని యంత్రాల సహాయంతో విస్తరాకులుగా కుట్టించింది. ప్రతిరోజూ పదివేలకుపైగా విస్తరాకులు తయారు చేస్తుండటం విశేషం. దాదాపు 20 మంది ప్రత్యక్ష ఉపాధి పొందుతున్నారు.
‘మా విస్తరాకులకు పెద్ద ఎత్తున ఆర్డర్లు వస్తున్నాయి. జర్మనీ, అమెరికా వంటి దేశాలకు సైతం మా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నాం. ఏటా రూ.60 లక్షల టర్నోవర్ సాధిస్తున్నాం. వీ-హబ్ సాయంతో వ్యాపార విస్తరణకు అవసరమైన మార్కెటింగ్ నెట్వర్క్ అభివృద్ధి చేశాం’ అంటున్నది మాధవి.
-హీనా రెహమత్
సృజనాత్మకంగా ఆలోచించే తరుణులు ఎందరో ఫ్యాషన్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన హీనా రెహమత్ కూడా ఫ్యాషన్ ప్రపంచంలో విజయవంతమైన ఆంత్రపెన్యూర్గా అందరి మన్ననలు అందుకుంటున్నది. బీఏ చదివిన రెహమత్ పెండ్లి తర్వాత భర్తతో కలిసి సౌదీ అరేబియా వెళ్లింది. 1999 నుంచి 2008 వరకు అక్కడే ఉంది. కుట్టుపనిలో మంచి పట్టు ఉన్న ఆమె పట్టుదలతో అవకాశాలను అందిపుచ్చుకుంది. దేశం కాని దేశంలో రాయల్ కుటుంబాలకు ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తూ ఎంతో ఎదిగింది. భారత్కు తిరిగి వచ్చాక ‘నీరూస్’ ఎంపోరియంలో కొన్నాళ్లు ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేసింది. తర్వాత సేల్స్ మేనేజర్గానూ సత్తా చాటింది. సొంతంగా వ్యాపారం చేయాలనే సంకల్పంతో ముందడుగు వేసింది. ఈ క్రమంలో ఓ ఎగ్జిబిషన్లో రెహమత్ నైపుణ్యాన్ని చూసిన ఖాదీ బోర్డు అధికారులు ఆమెను ప్రోత్సహించారు. బ్యాంకు నుంచి రూ.15 లక్షలు రుణం తీసుకొని హైదరాబాద్లోని గంధంగూడెంలో 30 కుట్టుమిషన్లతో పరిశ్రమ నెలకొల్పింది. 30 మందికి ఉపాధి కల్పించింది. కరోనాలోనూ అదే జోరు: కరోనా సమయంలో రోజుకు 10వేల నుంచి 15వేల మాస్కులు కుట్టి విక్రయించింది. వచ్చిన లాభాల్లో కొంత మొత్తం సేవా కార్యక్రమాలకు వెచ్చించింది. తర్వాత రెహమత్ వీ-హబ్ తలుపు తట్టడంతో ఆమె వ్యాపారంలో మరో ముందడుగు పడింది. వీ-హబ్ చొరవతో వైద్య ఆరోగ్యశాఖ నుంచి ఆశావర్కర్ల కోసం 12వేల బ్లౌజ్లు కుట్టే అవకాశం వచ్చింది. దీంతోపాటు విభిన్న రీతుల్లో లెహంగాలను డిజైన్ చేస్తూ భారీగా ఆర్డర్లను సొంతం చేసుకుంటున్నది. ‘చేనేతకు ఉన్న డిమాండ్ దృష్ట్యా హ్యాండ్లూమ్ వస్త్రంతో సరికొత్త డిజైన్లలో లెహంగాలు రూపొందిస్తున్నాం. మా టీమ్లో ప్రొఫెషనల్ మాస్టర్స్, ప్రతిభ కలిగిన డిజైనర్స్ పనిచేస్తున్నారు. నెలకు రూ.3 లక్షల వరకు వేతనాలు ఇస్తున్నాను. ఈ ప్రయాణంలో వీ-హబ్ అందించిన సహకారం మరువలేను. 150 కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి వ్యాపారం విస్తరించే ప్రయత్నంలో ఉన్నాను’ అని చెప్పుకొచ్చింది హీనా రెహమత్.
-గంజి ప్రదీప్ కుమార్