వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి పర్వతారోహకుడు కూడా. అలాగని ఏ టీనేజ్ కుర్రాడిగా ఉన్నప్పుడో ఈ సాహసాలు చేసేవారని అనుకుంటే పొరపాటే! నలభై ఏండ్ల నడివయసులో వేల అడుగుల ఎత్తున్న కొండలు ఎక్కుతూ తన గుండె ధైర్యాన్ని చాటుకుంటున్నారు. వివిధ ఖండాల్లోని ఎత్తయిన ఆరు పర్వతాలను అధిరోహించిన ఆ ఐపీఎస్ అధికారి అనుభవాలు..
తరుణ్ జోషి బాల్యం నుంచీ ఉత్తమ విద్యార్థే. పుస్తకాలే ఆయన లోకం. పరీక్షల్లో టాపర్. ఆటలకు ఆమడదూరంలో ఉండేవారు. ఐపీఎస్ ట్రైనింగ్లో అలవాటైన ఫిజికల్ ఫిట్నెస్ ఆయన శరీరాన్నే కాదు, దృక్పథాన్నీ మార్చేసింది. అలా, ఉద్యోగ బాధ్యతల్లో ఏండ్లు గడిచిపోయాయి. 2014-16 మధ్య ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేశారు తరుణ్ జోషి. అక్కడే పనిచేసిన మహిళా అధికారి జీఆర్ రాధిక పర్వతారోహణ చేసేవారు. ఆమెను చూసిన తర్వాత తరుణ్కు ఆసక్తి కలిగింది. అప్పటికి ఆయన వయసు 40 ఏండ్లు.
పర్వతారోహణపై పట్టు సాధించడానికి 2017లో డార్జిలింగ్లోని హిమాలయన్ మౌంటెనీరింగ్ ఇన్స్టిట్యూట్లో చేరారు తరుణ్ జోషి. 28 రోజుల శిక్షణ పూర్తి చేసుకున్నారు. పర్వతారోహణలో ముఖ్యమైంది బరువును మోస్తూ నడవటం. అందులో భాగంగా 23 కిలోల బరువుతో పర్వతాలు అధిరోహించడం అలవాటు చేసుకున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత తొలి ప్రయత్నంగా 2018 మేలో రష్యాలోని ఎల్బ్రస్ పర్వతాన్ని ఎక్కారు. 5,642 మీటర్ల ఎత్తయిన ఈ పర్వతంపై ఉష్ణోగ్రతలు మైనస్ 15 నుంచి మైనస్ 20 డిగ్రీల మధ్య ఉంటాయి. ఎముకలు కొరికే చలికి వెరవకుండా తొలి ప్రయత్నంలోనే ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు. మొత్తం ఐదుగురు సభ్యుల బృందంలో 40 పైబడిన వ్యక్తి తరుణ్ ఒక్కరే. 2019 జనవరిలో అర్జెంటీనాలోని 6,962 మీటర్ల ఎత్తున్న అకోంకాగవా పర్వతాన్ని అధిరోహించారు. ఇందుకు జోషికి 21 రోజులు పట్టింది. అదే ఏడాది ఇండోనేషియాలో 4,884 మీటర్ల ఎత్తయిన కర్టెన్స్ పర్వతాన్ని, 2020 జనవరిలో ఆస్ట్రేలియాలోని 2,228 మీటర్ల ఎత్తున్న కాజియాస్కో పర్వతాన్ని పాదాక్రాంతం చేసుకున్నారు. ఏడాదంతా మంచు ఉండే అంటార్కిటికాలోని 4,892 మీటర్ల విన్సన్ మాసిఫ్ పర్వతాన్నీ ఎక్కారు. దక్షిణ ధ్రువానికి దగ్గర్లో ఉండే మాసిఫ్ పర్వతంపై ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలు ఉంటుంది. నరాలు బిగుసుకుపోయే చలిని లెక్కచేయకుండా ఆ పర్వత శిఖరాన్నీ చూశారు. ఆ వెంటనే ఆస్ట్రేలియాలోని కాజియాస్కో పర్వతాన్ని అధిరోహించారు.. 26 రోజుల వ్యవధిలోనే ఈ రెండు పర్వత శిఖరాలను అందుకోవడం విశేషం. తాజాగా ఈ ఏడాది జనవరిలో ఆఫ్రికాలోని ఎత్తయిన పర్వతం (5,895 మీటర్లు) కిలిమంజారోను ఎక్కారు. శిఖరాగ్రంపై జాతీయ పతాకంతోపాటు తెలంగాణ పోలీస్ జెండానూ రెపరెప
లాడించారు.
పూర్తిగా శాకాహారి అయిన తరుణ్ పర్వతారోహణకు అనువుగా తన శరీరాన్ని తీర్చిదిద్దుకున్నారు. ‘వాతావరణంలో మార్పులు, ఆరోగ్య పరిస్థితులు పర్వతారోహకులకు సవాలు విసురుతుంటాయి. మొక్కవోని దీక్షతో వాటిని అధిగమిస్తాను’ అంటారు తరుణ్ జోషి. పర్వతారోహణ ఇచ్చిన స్ఫూర్తితో 12వేల అడుగుల ఎత్తు నుంచి స్కైడైవింగ్ చేసి ఔరా! అనిపించుకున్నారీ పోలీస్ బాస్.
ఐపీఎస్ శిక్షణలో పర్వతారోహణ కూడా కొంత ఉంటుంది. దానిపై నాకు ఆసక్తి కలిగిన తర్వాత చాలా సమాచారం సేకరించాను. నిపుణుల వద్ద శిక్షణ తీసుకున్నా. క్లిష్ట పరిస్థితులను ఎలా
అధిగమించాలో తెలుసుకున్నా. ఆరు ఎత్తయిన పర్వతాలు ఎక్కగలిగా. ఎప్పటికైనా ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించాలన్నది నా లక్ష్యం. కిలిమంజారోపై మన జాతీయ పతాకం ఎగురవేసినప్పుడు మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగింది.
తరుణ్ జోషి, పోలీసు కమిషనర్ వరంగల్
–పిన్నింటి గోపాల్