జానపద చిత్రాల్లో కత్తి సాము అసాధారణంగా కనిపిస్తుంది. సినిమాల్లో సైతం మగవాళ్లకే పరిమితమైన విన్యాసం కత్తుల యుద్ధం. ఫెన్సింగ్ క్రీడ సైతం కత్తులతో పోరాడేదే! ఈ మగవాళ్ల ఆటలో చెన్నైకి చెందిన ఓ ఆడకూతురు అదరగొడుతున్నది. ఏకంగా టోక్యో ఒలింపిక్స్లో భారత్ తరఫున బరిలోకి దిగుతున్నది. మనదేశం నుంచి ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి ఫెన్సర్గా రికార్డు సాధించింది.
భవానీ వాళ్లది చెన్నై. ఆటల్లో మహా చురుకు. తనకు పదకొండేండ్లు ఉన్నప్పుడే రాష్ట్రంలో ‘స్పోర్ట్స్ ఇన్ స్కూల్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది తమిళనాడు ప్రభుత్వం. సర్కారు పాఠశాలల్లోని విద్యార్థులను స్విమ్మింగ్, స్కాష్, ఫెన్సింగ్, బాక్సింగ్ వంటి క్రీడల్లో ప్రోత్సహించాలన్నది దీని లక్ష్యం. అంతే భవానీ ఆనందానికి అవధుల్లేవు. ఫెన్సింగ్, స్కాష్ క్రీడల్లో తర్ఫీదు తీసుకుంది. కొన్నాళ్లకు ఫెన్సింగ్పైనే దృష్టిసారించి అందులో పట్టు సాధించింది. జాతీయస్థాయి ఈవెంట్లలో పాల్గొనే స్థాయికి చేరుకుంది. ఇప్పుడు ఆమె ప్రయాణం ఒలింపిక్స్ దాకా చేరింది.
భవాని వాళ్లది మధ్యతరగతి కుటుంబం. ఐదుగురు సంతానంలో ఒకరామె. ఆర్థిక ఇబ్బందులు వెంటాడేవి. కానీ, తన కూతురును క్రీడాకారిణిగా చూడాలనే సంకల్పంతో ఎంతగానో కష్టపడ్డారు. భవానీ కోచింగ్ ఫీజు కోసం తల్లి రమణి తన బంగారు నగలను తాకట్టుపెట్టారట. మొదట వెదురు కర్రలతో ప్రాక్టీస్ చేసి, తర్వాత అసలైన ఫెన్సింగ్ గేర్తో శిక్షణ తీసుకుంది భవానీ. ‘భవానీకి రూ.6వేల ఫెన్సింగ్ వెపన్ కొనిచ్చాం. కానీ, అది విరిగిపోయేలా ఉండేది. అయినా మా కుటుంబ పరిస్థితిని తను అర్థం చేసుకుని జాగ్రత్తగా దాంతోనే ప్రాక్టీస్ చేసింద’ని చెప్పారు తల్లి రమణి. భవానీ తండ్రి ఆనంద సుందరం గుడి పూజారి. ఫెన్సింగ్ పోటీల కోసం 2019లో భవానీ ఇటలీకి వెళ్లిన సమయంలో ఆయన కన్నుమూశారు. ఆ బాధనంతా పంటిబిగువున దాచుకొని పోటీలో పాల్గొన్నది. ఆమె ప్రతిభను గుర్తించిన తమిళనాడు ప్రభుత్వం 2016 నుంచి నెలకు రూ.లక్ష ప్రోత్సాహకం అందించడం విశేషం. అంచెలంచెలుగా ఆటపై పట్టుసాధించి ఇప్పుడు ఒలింపిక్స్లో కత్తి ఝళిపించడానికి వెళ్తున్నది. ఈ కత్తుల కాంతం స్వర్ణ పతకం సాధించాలని మనమూ ఆశిద్దాం.
ఫెన్సింగ్ అంటే కత్తులతో విన్యాసం. కాస్త చేయి అటూఇటూ అయినా గాటు పడటం, గాయాలవడం ఖాయం. అయినా, భవానీ బెదరలేదు. ఆమె ఉత్సాహానికి తగ్గట్టే తల్లి రమణి కూతురును ప్రోత్సహించేది. ఫెన్సింగ్లో ఫాయిల్, ఎపీ, సాబర్ అంటూ మూడు రకాల బ్లేడ్లను ఉపయోగిస్తారు. ఇందులో భవానీదేవి క్విక్ మూమెంట్స్కు అవకాశం ఎక్కువగా ఉండే సాబర్లో శిక్షణ తీసుకుంది. బడిలో శిక్షణ మినహా ప్రొఫెషనల్ కోచింగ్ తీసుకుంది లేదు. కొంతకాలానికి చెన్నై నెహ్రూ స్టేడియంలో సీనియర్ ప్లేయర్ల గైడెన్స్తో ప్రాక్టీస్ చేసేది. మెరుపు వేగంతో కనికట్టు చేయడం భవానీ ప్రత్యేకత. 2004లో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్లో ఆమె మొదటిసారి గోల్డ్ మెడల్ సాధించింది.