అప్పుడప్పుడూ లేదా తరచూ వచ్చే తలనొప్పి, దగ్గు, గొంతునొప్పి వంటి కొన్ని అనారోగ్య సమస్యలను చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ‘మామూలు లక్షణాలే కదా!’ అని ఏ మందుబిళ్లలో వేసుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతారు. మరికొందరు ఫోన్ ద్వారా తెలిసిన డాక్టర్ను సంప్రదించి, వారి సలహా మేరకు మందులు వాడి వదిలేస్తారు. ఈ విధమైన నిర్లక్ష్యానికి ప్రధానంగా రెండు కారణాలు. ఒకటి నిరక్షరాస్యత, గ్రామీణ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, అవగాహనలేమి. రెండోది తీరిక లేని జీవనం. మొదటి రకం వారు అవగాహన లేక క్యాన్సర్ వ్యాధులకు పదోన్నతులు కల్పించినట్లు.. ప్రారంభ దశలో ఉన్న వ్యాధులను ముదిరే వరకూ పెంచి పోషిస్తారు. రెండో రకానికి చెందినవారు అవగాహన, ఆర్థిక స్థోమత ఉండి కూడా దవాఖానకు వెళ్లే సమయం లేకపోవడం, ఓవర్ కాన్ఫిడెన్స్తో తలెత్తిన అనారోగ్య సమస్యలను తేలికగా తీసుకుంటూ.. క్యాన్సర్ను ఆదరిస్తూ ఉంటారు.
తలనొప్పి : జీవిత కాలంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొనే సాధారణ సమస్య తలనొప్పి. ఎక్కువగా ఆలోచించడం, పని ఒత్తిడి, ఎండలో తిరగడం, జలుబు చేయడం, మైగ్రెయిన్ వంటి కారణాల వల్ల తలనొప్పి రావడం సహజమే. అయితే ఇలాంటి తలనొప్పిని నిర్లక్ష్యం చేస్తూ పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడితే.. కిడ్నీలు, లివర్, రక్తపోటుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఉదయం లేవగానే తల బరువుగా ఉండటం, తరచూ నొప్పి రావడం, వాంతులు, వికారం వంటి లక్షణాలు ఉంటే.. అది బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కావచ్చు. అందుకని తలనొప్పికి కచ్చితమైన కారణాలు తెలుసుకొని, అవసరమైన చికిత్స తీసుకోవడం మంచిది. ఒకవేళ అది బ్రెయిన్ ట్యూమర్ వంటి సమస్య అని తేలితే ప్రారంభ దశలోనే చికిత్స అందించి రోగి జీవితకాలాన్ని పెంచవచ్చు.
గొంతునొప్పి : చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు, కొత్త ప్రదేశాల్లోని నీరు తాగినప్పుడు గొంతు నొప్పి, గొంతు బొంగురు పోవడం వంటివి ఎదురవుతుంటాయి. రెండు మూడు రోజులపాటు మందులు వాడినా తగ్గకపోతే, వెంటనే వైద్యపరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే థైరాయిడ్ క్యాన్సర్, గొంతు సంబంధిత క్యాన్సర్లు, ఊపిరితిత్తుల క్యాన్సర్కు సంబంధించి.. ప్రారంభ దశలో ఇవే లక్షణాలు కనిపిస్తాయి.
దగ్గుతో కూడిన ఆయాసం : సిగరెట్లు, బీడీలు కాల్చేవారు ఎక్కువగా దగ్గు బారిన పడుతుంటారు. కొందరు దగ్గుతోపాటు ఆయాస పడుతుంటారు. దగ్గినప్పుడు స్పుటంలో రక్తం పడటం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్తోపాటు టి.బి. లక్షణాలకు సంకేతాలుగా భావించాలి. ఎందుకంటే పొగ తాగేవారికి ఈ వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ.
కడుపు ఉబ్బరం-మంట : సమయపాలన లేని తిండి, జంక్ ఫుడ్, నిద్రలేమి, శారీరక, మానసిక ఒత్తిడి తదితర కారణాలతో కడుపులో మంట, వికారం, కడుపు ఉబ్బరంగా ఉంటుంది. జీవన శైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుని, మందులు వాడినా సమస్య తీరకుంటే.. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. జీర్ణాశయానికి సంబంధించిన క్యాన్సర్లు, లివర్, ప్యాంక్రియాజ్, గాల్ బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు కూడా ప్రారంభ దశలో ఇలానే ఉంటాయి.
మూత్ర వ్యవస్థలో తేడాలు : మూత్రంలో రక్తం, మూత్రం ఆగి ఆగి రావడం, మూత్ర విసర్జన సమయంలో మంట.. ఈ లక్షణాలుంటే వేడి చేసిందని అనుకుంటారు. నీటిని తక్కువగా తాగడం, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు వంటివి కూడా ఇవే లక్షణాలు కలిగి ఉంటాయి. అయితే మందులు వాడినా సమస్య తగ్గకపోతే, నిర్ధారణ పరీక్షలు చేయించాలి. ఎందుకంటే యూరినరీ బ్లాడర్కు సంబంధించిన క్యాన్సర్ లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. 50ఏళ్లు పైబడిన పురుషులలో ప్రొస్టేట్ గ్రంథి సమస్యలకు సంబంధించిన లక్షణాలు కూడా ఇలానే ఉంటాయి. మహిళల్లోనైతే.. నెలసరి మధ్య రక్తస్రావం, పొట్ట భారంగా ఉండటం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఓవేరియన్, యుటిరైన్ క్యాన్సర్ లక్షణాలు కావచ్చు.
మల విసర్జనలో తేడాలు : సాధారణంగా ఆహారపు అలవాట్లు మారినప్పుడు అజీర్తి, విరేచనాలు, మలంలో రక్తం పడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అంతేకాకుండా పైల్స్, ఫిషర్స్, పిస్టులా సమస్యలున్నవారిలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయి. సరైన మందులు వాడినా సమస్య తగ్గకుంటే, పరీక్షలు చేయించుకోవాలి. ఎందుకంటే పురుషులలో ఎక్కువగా కొలన్ క్యాన్సర్ లక్షణాలు ఇలానే ఉంటాయి.
డాక్టర్ మోహనవంశీ
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్, ఒమేగా హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్: 98490 22121