కుటుంబ పోషణలో భర్తకు భరోసా కావాలనుకున్నది ఆ మహిళ. ఉద్యోగం చేసేంత ఉన్నత చదువులు చదవకపోయినా తానే వ్యాపారం మొదలు పెట్టింది. ప్లాస్టిక్ ప్లేట్లతో ప్రమాదాన్ని గుర్తించి వాటి స్థానంలో మోదుగు ఆకుల విస్తర్ల తయారీకి శ్రీకారం చుట్టింది మిడివెల్లి సుమలత. పర్యావరణాన్ని కాపాడటంతో పాటు
పదిమందికి ఉపాధి కల్పిస్తూ మహిళా సాధికారతవైపు అడుగులు వేస్తున్న ఆమెను ‘జిందగీ’ పలుకరించింది. ఆ విశేషాలు తన మాటల్లోనే..
మాది మంథని. పదో తరగతి చదివిన నేను పెండ్లి తర్వాత గృహిణిగా స్థిరపడ్డాను. ఇంటిదగ్గరే ఉంటూ పిల్లలను చూసుకునేదాన్ని. మా ఆయన రవి ఒక్కడి కష్టం మీద కుటుంబం నడిచేది. ఆయనకు సహకారం అందించాలని ప్లాస్టిక్ ప్లేట్ల తయారీ ప్రారంభించాను. వ్యాపారం సాఫీగా సాగినా ప్లాస్టిక్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నామన్న బాధ వెంటాడేది. దీనికి ప్రత్యామ్నాయంగా 2022లో మోదుగు ఆకులతో విస్తర్ల తయారీని మొదలుపెట్టాను.
మొదట్లో ఆకులతో తయారు చేసినవి కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించడంతో నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంది. కస్టమర్ల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని విస్తర్ల తయారీకి అవసరమయ్యే ఆకును వైజాగ్, ఒడిశా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. టిఫిన్ ప్లేట్లతోపాటు డొప్పలు, బఫేట్, సిట్టింగ్ ప్లేట్లను ఉత్పత్తి చేస్తున్నాం. ప్రస్తుతం వీటికి మంచి డిమాండ్ ఉండటం మూలంగా మంథని, హైదరాబాద్, సిరిసిల్ల, కోరుట్ల, వరంగల్, నిజామాబాద్ ప్రాంతాలతో పాటు పక్క రాష్ర్టాలైన కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లకు సైతం ఎగుమతి చేస్తూ ఆదాయం పొందుతున్నాం.
తొలుత రూ.లక్ష వ్యయంతో ఒక్క మిషన్ కొనుగోలు చేసి ఈ వ్యాపారాన్ని మొదలు పెట్టాను. ఆ తర్వాత గిరాకీ పెరగడంతో రూ.2 లక్షలతో ఇంకో మిషన్తోపాటు ప్యాకింగ్ యంత్రాన్నీ కొన్నాను. విస్తర్ల తయారీలో ఆదాయంతో పాటు 24 మందికి ఉపాధి కల్పిస్తున్నాను.
ఇందులో వివిధ ఆకృతుల్లో ప్లేట్ల తయారీ కోసం నలుగురు పని చేస్తుండగా, మోదుగు ఆకులు కుట్టేందుకు మంథని, నాగారం, ఆరెంద గ్రామాలకు చెందిన 20 మంది పనిచేస్తున్నారు. పెండ్లిళ్ల సీజన్లో అన్ని ఖర్చులు పోను నెలకు రూ.30 వేల ఆదాయం వస్తున్నది. మిగతా రోజుల్లో ఆదాయం కాస్త తక్కువగా ఉంటుంది. రోజు రోజుకూ పెరిగిపోతున్న ప్లాస్టిక్ వినియోగాన్ని కట్టడి చేసేందుకే ఈ మార్గం ఎంచుకున్నా. వ్యాపారాన్ని మరింత విస్తరిస్తూ, మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించాలన్నదే నా లక్ష్యం.
-బాసాని సాగర్, మంథని