25 ఏండ్ల క్రితం.. భుజానికి సంచి తగిలించుకొని అమెరికాలో హాలీవుడ్ సినిమాలకు పెట్టింది పేరైన లాస్ ఏంజెల్స్ నుంచి భారతదేశ సందర్శనకు వచ్చిందామె. అందుకోసం, స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో మానసిక శాస్త్రంలో పీహెచ్డీకి విరామం ఇచ్చింది. విమానం దిగగానే, గంగా తీరంలోని రుషికేశ్కు చేరుకుంది. తన పేరును సాధ్వీ భగవతీ సరస్వతిగా మార్చుకొంది. ఆ అనుభవాలకు ఓ పుస్తక రూపం కూడా ఇచ్చింది.
‘1996 నాటి మాట. నా భర్త క్రిస్మస్ సెలవులను భారత్లో గడుపుదామని అన్నారు. శాకాహార వంటకాలపై ఇష్టంతో నేను వెంటనే సరే అన్నాను. అయితే అప్పటికి నాకు దేవుడి గురించి తెలుసుకోవాలన్న కోరికే లేదు. ఆధ్యాత్మిక భావనలూ అంతంతమాత్రమే. గంగలో పాదం మోపిన క్షణంలోనే నాకు జ్ఞానోదయమైంది. దేవుడి అనుగ్రహం పొందిన స్పృహ కలిగింది’ అంటూ సాధ్వి తన భారతదేశ పర్యటనకు కారణాన్ని వివరిస్తుంది. ఈ యూదు యువతి ఒకప్పుడు లైంగిక దాడికి బలైంది. ఆ చేదు అనుభవంతో కుంగుబాటుకు గురైంది. అమెరికా నుంచి భారతదేశానికి జరిగిన తన ఆధ్యాత్మిక యాత్ర గురించి ‘హాలీవుడ్ టు ద హిమాలయాస్: ఎ జర్నీ ఆఫ్ హీలింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్’ అనే పుస్తకం రాసింది. సాధ్వి ప్రస్తుతం రుషికేశ్లోని పరమార్థ నికేతన్లో నివాసం ఉంటున్నది. మళ్లీ అమెరికా వెళ్లాలన్న ఆలోచనే చేయలేదు. పరమార్థ నికేతన్లో ఆమె ఆధ్యాత్మిక సత్సంగాలు, ధ్యాన శిక్షణ, కౌన్సెలింగ్, మెంటరింగ్, దాతృత్వం తదితర కార్యకలాపాలలో తలమునకలై ఉంటారు. స్ఫూర్తినిచ్చే ప్రసంగాలు చేస్తారు. పరమార్థ నికేతన్ వ్యవస్థాపకులు స్వామి చిదానంద సరస్వతీజీ ఆమెకు సన్యాస దీక్ష ఇచ్చారు. ప్రస్తుతం ఆమె ఆశ్రమం ఆధ్వర్యంలో సాగుతున్న 11 భాగాల ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం’ ప్రాజెక్టుకు మేనేజింగ్ ఎడిటర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ‘జీవితంలో ఎన్నో కోల్పోతాం. మరెన్నో గెలుస్తాం. వాటన్నిటిని పక్కనపెట్టి.. నా లానే అందరూ స్వేచ్ఛ, ప్రశాంతత, ఆనందం, జ్ఞానోదయం పొందవచ్చు’ అంటారు సాధ్వి.