మానవజాతి చరిత్రను క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అని విభజించినట్టే.. గుండె వ్యాధులను కూడా కరోనాకు పూర్వం, కరోనా తర్వాత.. అనే కోణంలో బేరీజు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కొవిడ్ మహమ్మారిమనిషి ఊపిరితిత్తుల దగ్గరే ఆగిపోలేదు. గుండె మీదా గునపపు పోట్లుపొడుస్తున్నది. కరోనా బారినపడిన వారిలో హృద్రోగ లక్షణాలు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఏ చిన్న లక్షణాన్నీ నిర్లక్ష్యం చేయలేం. ఏ పరోక్ష సంకేతాన్నీ విస్మరించలేం. మనల్ని కాపాడే గుండెను.. మనం కాపాడుకోవాల్సిన సమయం వచ్చింది.
కరోనా కల్లోలానికి రెండేండ్లు. ఇప్పటికీ ఆ మహమ్మారి మనల్ని వదలడం లేదు. కొవిడ్ గండం నుంచి బయటపడ్డామనీ, పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నామనీ పొంగిపోతున్నవారు సైతం హఠాత్తుగా ఏ గుండెపోటుకో గురవుతున్నారు. కరోనా మొదటి మూడు దశల్లో.. తీవ్ర రుగ్మతతో ఉక్కిరిబిక్కిరి అయినవారే కాదు, స్వల్ప లక్షణాలతో బయటపడినవారు, అసలు కరోనా వచ్చినట్లు తెలియకుండానే కోలుకున్నవారు కూడా ఆ దుష్ప్రభావాలను తప్పించుకోలేకపోతున్నారు. పరిస్థితి విషమించి ప్రాణాలు కోల్పోతున్నవారూ ఎంతోమంది. గతానికి భిన్నంగా 20-30 ఏండ్ల యువత సైతం గుండె సమస్యలతో ఆసుపత్రులలో చేరుతున్నారు. దీనికి కారణాలు అనేకం.
రక్తం గడ్డకట్టడంతో..
కరోనా వచ్చిన కొత్తలో వైరస్ ఊపిరితిత్తులపైనే ప్రభావం చూపుతుందని భావించారు. అంచనాలకు భిన్నంగా అది శరీరంలోని ప్రతి అవయవంపైనా దాడి ప్రారంభించింది. ఈ క్రమంలో రక్తనాళాలనూ దెబ్బతీయడంతో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టిపోయింది. ఏ అవయవానికి సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డకడితే ఆ అవయవం దెబ్బతింటుంది. గుండె విషయానికి వస్తే ప్రధానంగా ఐదు రకాల సమస్యలు కనిపిస్తున్నాయి. అందులో.. మొదటిది గుండెపోటు, రెండోది కార్డియోమయోపతి వల్ల గుండె విఫలం కావడం. అంటే, గుండెకు చెందిన కండరాలు బలహీనపడటం. మూడో సమస్య.. గుండె హఠాత్తుగా ఆగిపోవడం. నాలుగు.. రిథమ్ డిస్ట్రబెన్స్. ఐదు.. రోగ నిరోధక వ్యవస్థలో మార్పులు.
ధమనుల్లో సమస్య
కరోనాకు గురైన చాలామందిలో రక్తనాళాలు దెబ్బతిన్నాయి. కొందరిలో కరొనరి ధమనుల్లో రక్తం గడ్డకట్టడంతో గుండెకు రక్త సరఫరా మందగించి హృద్రోగానికి దారితీసింది. మరో సమస్య పల్మనరీ ఎంబాలిజం. అంటే ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో రక్తం గడ్డకట్టడం. దీనివల్ల గుండె కుడి భాగం తీవ్రంగా దెబ్బతింటున్నది.
గుండె వైఫల్యం
కార్డియోమయోపతి వల్ల గుండె విఫలం అవుతుంది. అంటే, వైరస్ ప్రభావంతో గుండెకు సంబంధించిన కండరాలు బలహీనపడతాయి. దీంతో గుండె పరిమాణం పెద్దదైపోయి రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం (ఎజక్షన్ ఫ్రాక్షన్) 50 శాతం నుంచి ఇంకా ఇంకా పడిపోవడం వల్ల గుండె విఫలం అవుతుంది. ఫలితంగా రక్తపోటు తగ్గిపోయి మూత్రపిండాలు, కాలేయం, మెదడు మొరాయిస్తాయి.
హఠాత్తుగా ఆగిపోతే..
సాధారణంగా గుండెచుట్టూ ‘పెరికార్డియం’ అంచెలు అంచెలుగా రక్షణ వలయమై నిలుస్తుంది. అందులో ఒక పొర నేరుగా గుండె ఉపరితలంపై ఉంటుంది. మరో పొర మొదటి పొరకు అవతలి వైపు ఉంటుంది. ఈ రెండు పొరల మధ్య ‘పెరికార్డియల్’ ఫ్లూయిడ్ ఉంటుంది. 50 మిల్లీ లీటర్ల పరిమాణంలో ఉండే ఈ ద్రావణం గుండె సంకోచ, వ్యాకోచాలకు దోహదపడుతుంది. అయితే కరోనా వైరస్ వల్ల ఈ రసాయనం ఏకంగా 500 మిల్లీ లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణానికి చేరుకుంటుంది. దీనివల్ల గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంది. సంకోచ, వ్యాకోచాలకు ఆ ద్రావణం ప్రతిబంధకంగా మారుతుంది. దీంతో, ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది.
రిథమ్ డిస్ట్రబెన్స్
వైరస్ ప్రభావం వల్ల గుండె లయలో అనూహ్యమైన హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. ఈ వ్యత్యాసం కారణంగా గుండె రక్తాన్ని పంపింగ్ చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా రక్తపోటు పడిపోయి శరీరంలోని ఇతర ప్రధాన అవయవాలు దెబ్బతింటాయి.
రోగ నిరోధక వ్యవస్థలో..
కరోనా వైరస్ రోగ నిరోధకతపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల రోగి పలురకాల వ్యాధులకు గురవుతాడు. ముఖ్యంగా గతంలో ఉన్న వ్యాధులన్నీ తిరగబెడతాయి, తీవ్రతరం అవుతాయి. బీపీ, షుగర్ ఉన్నవారికి సమస్య మరింత తీవ్రమై గుండె సమస్యలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా అప్పటికే గుండె రుగ్మతలు ఉన్న రోగులకు సమస్య జటిలమైపోతుంది. గుండెపోటు లేదా హార్ట్ ఫెయిల్యూర్కు ఆస్కారం ఏర్పడుతుంది.
రెండేండ్లయినా..
మిగిలిన దశలతో పోలిస్తే.. మూడో దశ కరోనా తరువాత గుండె సంబంధ కేసులు పెరుగుతున్నాయి. వైరస్ దుష్ప్రభావాలు ఆలస్యంగా బయటపడటమే ఇందుకు కారణం. కరోనా తొలి రెండు దశల్లో చాలామంది ఇండ్లలోనే ఉన్నారు. దీనివల్ల శారీరక వ్యాయామం దూరమైంది. ఆహార నియమాలు అదుపు తప్పాయి. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ పెరిగింది. ఊబకాయ సమస్యలు ఉత్పన్నం అయ్యాయి. మరి కొందరు ఉద్యోగాలు కోల్పోయారు. వృత్తి ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. ఆ ప్రభావం గుండె మీద కూడా పడింది. కొందరు దీర్ఘ కాలిక వ్యాధిగ్రస్తులు లాక్డౌన్, వైరస్ కారణంగా దవాఖానలకు వెళ్లేందుకు భయపడి వైద్యాన్ని నిర్లక్ష్యం చేశారు. ఇంకొందరు సొంత వైద్యం తీసుకున్నారు. ఈక్రమంలోనూ చాలామంది ఆరోగ్యం దెబ్బతిన్నది. ఆ ఫలితాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కరోనాకు పూర్వం 40 ఏండ్లు పైబడిన వారిలోనే గుండె సమస్యలు అధికంగా కనిపించేవి. కానీ, కరోనా మూడో దశ తరువాత ఇరవై, ముప్పైలలోని యువతలో సైతం హృద్రోగ సమస్యలను చూస్తున్నాం. చాలామంది ఛాతీనొప్పి, గుండెపోటు, గుండె వైఫల్యం తదితర సమస్యలతో వైద్యులను ఆశ్రయిస్తున్నారు. చాలా ఆందోళనకరమైన పరిణామం ఇది. సత్వర స్పందనతో, సమర్థమైన చికిత్సతో ఈ గండం నుంచి
బయట పడవచ్చు. నిర్లక్ష్యం, నిర్లిప్తత ఏమాత్రం మంచిది కాదు. గుండె ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉన్నట్టు.
ఇలా తప్పించుకోవచ్చు..
కరోనాకు గురైనవారు కచ్చితంగా బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలి. తరచూ బరువును పరీక్షించుకోవాలి.
మద్యపానం, ధూమపానం తదితర వ్యసనాలను వదిలించుకోవాలి.
రోజూ కనీసం అరగంట తేలికపాటి వ్యాయామం చేయాలి. వాకింగ్ ఉత్తమమైన కసరత్తు.
అలా అని, మితిమీరిన వ్యాయామం మంచిది కాదు.
ప్రాథమికంగా 2డి-ఇకో, ఈసీజీ పరీక్షలు చేయించుకోవాలి.
అవసరమైతే వైద్యుల సూచన ప్రకారం సీటీ-కరోనరి ఆంజియోగ్రామ్ చేయించుకోవడం ఉత్తమం. ఈ పరీక్షలో 8 సెకన్లలోనే బ్లాకేజ్ల సమాచారం తెలిసిపోతుంది.
ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, జీవనశైలిని మార్చుకుంటే అనారోగ్య సమస్యల నుంచి తప్పించు
కోవచ్చు.
వైద్యుల సూచనల మేరకు అవసరమైన మందులు వాడాలి. మధ్యలోనే ఆపేయడం, సొంత వైద్యానికి సాహసించడం ప్రాణాంతకమే.
-మహేశ్వర్రావు బండారి
డాక్టర్ ప్రమోద్ కుమార్
హృద్రోగ నిపుణులు
యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ