అహ్మదాబాద్ : గుజరాత్కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీతో పాటు మరో తొమ్మిది మంది గురువారం మెజిస్టీరియల్ కోర్టు మూడు నెలల శిక్ష విధించింది. ఐదేళ్ల కిందటి నాటి కేసులో అనుమతి లేకుండా ‘ఆజాదీ మార్చ్’ నిర్వహించారన్న కేసులో మెహసనా కోర్టు దోషులుగా నిర్ధారించింది. అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ జేఏ పర్మార్.. మేవానీ, ఎన్సీపీ కార్యకర్త రేష్మా పటేల్ సహా రాష్ట్రీయ దళిత్ అధికార్ మంచ్లోని సభ్యులను దోషులుగా నిర్ధారించింది.
మొత్తం పది మంది దోషులకు ఒక్కొక్కరికి కోర్టు రూ.వెయ్యి జరిమానా సైతం విధించింది. జూలై, 2017లో అనుమతి లేకుండా మెహసనా నుంచి బనస్కాంత జిల్లాలోని ధనేరా వరకు ‘ఆజాదీ మార్చ్’ చేపట్టినందుకు మెహసనా ‘ఏ’ డివిజన్ పోలీసులు మేవానీతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు. పాటిదార్ కమ్యూనిటీకి రిజర్వేషన్ కోసం మద్దతు ఇచ్చిన రేష్మా పటేల్ మార్చ్లో పాల్గొన్న సమయంలో ఆమెకు ఏ పార్టీలోనూ సభ్యత్వం లేదు. ఎఫ్ఐఆర్లో పేర్కొన్న మొత్తం 12 మంది నిందితుల్లో ఒకరు మరణించగా, ఒకరు పరారీలో ఉన్నారు.