నవరాత్రుల్లో మూడోనాడు అమ్మవారు చంద్రఘంటగా అనుగ్రహిస్తుంది. శిరస్సుపై అర్ధ చంద్రుడు ‘ఘంటాకారం’లో ఉండటం వల్ల ఆ పేరుతో పిలుస్తూ ఆరాధిస్తారు. అమ్మవారి దేహకాంతి బంగారు రంగులో అంతటా విస్తరించి ఉంటుంది. పది చేతులతో అభయ ముద్రను, వివిధ ఆయుధాలను ధరించి, సింహ వాహనాన్ని అధిష్ఠించి భక్తులకు దర్శనమిస్తుంది. సింహం పరాక్రమానికి ప్రతీక. ఆయుధాలు దుష్టశిక్షణకు, అభయముద్ర శిష్టరక్షణకు సంకేతాలుగా నిలుస్తాయి. ఈమెను ఆరాధించేవారు పరాక్రమశాలురుగా, నిర్భయులుగా జీవిస్తారు. కార్యసాధకులు అవుతారు.
నిరంతరం నినదించే ఘంటాధ్వానాలు దుర్మార్గులకు భయంకరాలు కాగా, భక్తులకు అవి అభయప్రదాలై ప్రశాంతతను చేకూరుస్తాయి. అతి సౌమ్యం, అతి రౌద్రం కలిగిన చంద్రఘంట కోరిన వెంటనే ఫలితాన్నిచ్చే ‘సద్యః ఫల ప్రదాయని’. సాధకులు ఈ తల్లిని మణిపూరకంలోని కుండలినీ శక్తిగా భావించి ధ్యానిస్తుంటారు. దీనివల్ల ఆ సాధకులు దివ్యశక్తులను సాధించి అలౌకిక కక్ష్యలోకి ప్రయాణించగలిగిన సామర్థ్యాన్ని సొంతం చేసుకుంటారు. ఇతరులకు అనుగ్రహించే శక్తినీ పొందుతారు.
నైవేద్యం : కొబ్బరి అన్నం, పాయసం