వరాల రూపంలో సౌభాగ్యాన్ని భక్తులకు అనుగ్రహించే దేవి వరలక్ష్మి. ‘వర’ అంటే ‘కోరుకున్నది’, ‘శ్రేష్ఠమైనది’ అనే అర్థాలు ఉన్నాయి. ఈ అర్థాలను అన్వయం చేస్తే కోరిన కోరికలు, శ్రేష్ఠమైన కోరికలు తీర్చే తల్లిగా వరలక్ష్మీదేవిని భావించవచ్చు. ఈ దేవిని సమంత్రకంగా, భక్తి భావనతో కొలిచే క్రతువే ‘వరలక్ష్మీ వ్రతం’. స్కాంద పురాణం ప్రకారం పరమేశ్వరుడు పార్వతికి వరలక్ష్మీ వ్రతం గురించి చెబుతాడు. అదే సందర్భంలో మహాభక్తురాలైన చారుమతీదేవి వృత్తాంతాన్ని కూడా వివరించాడు. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి అమ్మవారిని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది.
ఆ మహాపతివ్రత పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో ఆమెకు సాక్షాత్కరిస్తుంది. శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని ఆమెకు అభయమిస్తుంది. అమ్మ ఆదేశానుసారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన చారుమతి సమస్త సిరి సంపదల్ని వరలక్ష్మీ వ్రత ప్రసాదంగా అందుకుంటుంది. భృగుమహర్షికి కుమార్తెగా లక్ష్మీదేవి అవతరించింది శుక్రవారం నాడే. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం ఆచరించడం ఆనవాయితీ. అయితే, ఏ కారణంగా అయినా రెండో శుక్రవారం వ్రతం చేసుకునే అవకాశం లేనివారు శ్రావణ మాసంలో ఏ శుక్రవారమైనా ఈ వ్రతం చేసుకోవచ్చు.