ఆమెకు అక్షరం అంటే ప్రాణం. కానీ ఆరోతరగతిలోనే పెండ్లయింది. ఆ వెంటనే బాధ్యతల ప్రవాహం మొదలైంది. తాగుబోతు భర్త, చంకలో బిడ్డలు.. బతుకు భారం మోసింది. కాలం తుపానులో కాగితంలా కొట్టుకుపోయింది. కానీ,కాగితం, పుస్తకం, అక్షరం… ఏ కష్టంలోనూ ఆమె వదల్లేదు. అందుకే చివరికి టీకొట్టు పెట్టుకున్నా… దాన్ని వేల పుస్తకాల నెలవుగా మార్చింది. భీమాబాయ్ జోంధలే అంటే ‘పుస్తకాంచ హోటల్’ యజమానిగానే ఇప్పుడు అందరికీ పరిచయం. కనీసం వంద మంది రోజూ ఆమె దగ్గరి పుస్తకాలు చదువుతారు మరి!
యాంబియెన్స్ ఇప్పుడు ఆహారశాలలన్నీ ప్రత్యేక ప్రాధాన్యమిస్తున్న విషయం. ఆకలి తీరితే చాలు అనుకునే రోజులనుంచి అక్కడే రిలాక్స్ అయ్యేదాకా మారాయి పరిస్థితులు. ముంబయి-ఆగ్రా హైవే మీద నాసిక్ దగ్గరి ‘పుస్తకాంచ హోటల్’ది మాత్రం ఓ ప్రత్యేకమైన యాంబియెన్స్. ఆ హోటల్కి పుస్తకాలే అలంకరణ. తింటూ చదువుకునేవారే ప్రత్యేక ఆకర్షణ. 74 ఏండ్ల భీమాబాయ్ ప్రారంభించి నడుపుతున్న ఈ భోజనశాలకు వెళితే ఆహారంతోనే కాదు అక్షరంతోనూ అనుబంధం ఏర్పడుతుంది. ఎందుకంటే ఇక్కడ తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లోని అయిదువేల పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి.
పరిస్థితులు మనుషుల్ని చాలా మారుస్తాయి. పుస్తకాలూ అంతే. అందుకే భీమాబాయ్ రెండిటినీ సమానంగా చూసింది. మొదటివి మనిషిని కష్టపెట్టవచ్చేమో, కానీ అక్షరాలు మాత్రం వ్యక్తిని ఆకాశంవైపే నడిపిస్తాయి… అన్న సత్యాన్నీ ఆమె నమ్మింది. అందుకే ఆరో తరగతిలో పెండ్లి అయినాసరే ఆమె పుస్తకాన్ని వదల్లేదు. బాల్య వివాహాల బారినపడ్డ చాలామంది ఆడవాళ్లలాగే కష్టాలు ఆమెనూ కనికరించలేదు. పెండ్లి నాటికి 20 ఎకరాల పొలం ఉండేది. నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకూ మద్యం తాగడమే పని ఆ భర్తకి. ఇద్దరు బిడ్డలు పుట్టినా సరే, బాధ్యత అన్న పదం కూడా తెలియలేదు అతనికి. అంతేకాదు, ఆ తాగుడు కోసం నేల అమ్మడమే పనిగా పెట్టుకున్నాడు. చివరికి మిగిలిన రెండు ఎకరాల్లో కూడా ఆమే వ్యవసాయం చేసేది. బిడ్డల కడుపు నింపేది. మగవాళ్లతో సమానంగా కష్టపడి వేరేవాళ్ల పొలాలనూ కౌలుకు తీసుకుని ఇల్లు నెట్టుకొచ్చేది. అది కూడా విధికి నచ్చలేదు. వ్యవసాయ భూమి పక్కనే ఫ్యాక్టరీ వచ్చిపడింది. అందులోని రసాయనాలన్నీ పొలాల మీదుగా పారేవి. ఇంక, పంట సంగతి అడిగిందెవరు? కడుపు బాధ పట్టిందెవరికి? ఇక, చేసేదేం లేక ఉన్న రెండు ఎకరాలూ అమ్మేసి బతుకు బండిని బస్తీ వైపు మళ్లించింది.
తెలిసిన పని అంటే… వ్యవసాయం, వంట. మొదటిది అవకాశం లేదు. ఇక రెండోదే ఆదరువు అయ్యింది. అందుకే రోడ్డు పక్కన చిన్న టీ కొట్టు పెట్టుకుంది. కొడుకు పేపర్లు వేస్తూ చదువుకునేవాడు. పదో తరగతిలో చదువు ఆపేయమని తండ్రి చెబితే అతనికి తల్లే అండగా నిలిచింది. జర్నలిజంలో డిగ్రీ చేసిన అతనికి, అమ్మతో ఎంత అనుబంధమో ఆమె ఎప్పుడూ గొప్పగా చెప్పే పుస్తకాలతోనూ అంతే అనుబంధం. అందుకే చదువయ్యాక పబ్లిషింగ్ హౌస్ ప్రారంభించాడు. ఇక, టీ కొట్టు పెట్టుకున్నప్పుడు, తర్వాత దాన్ని హోటల్గా మార్చినప్పుడూ తమ ఆర్డర్ వచ్చేదాకా జనం ఫోన్లలో మునిగిపోవడం చూసేది భీమాబాయ్. అయ్యో సమయం ఎంత వృథా… నాలుగు పేజీలు చదువుకోవచ్చుగా అనుకునేది. అందుకే తన హోటల్లో తొలిగా తన దగ్గర ఉన్న ఒక పాతిక పుస్తకాలను ఉంచింది. కొందరు వాటిని తీసుకుని చదవడం ప్రారంభించారు. తను కూడా వారిని ప్రోత్సహించేది. హోటల్కు సరుకులు తెచ్చినప్పుడల్లా కొత్త పుస్తకాలూ తెచ్చేది. అలా ఆ పూటకూళ్ల ఇంటిని పుస్తకాలయంగా మలిచింది.
ప్రస్తుతం ఒక్క మరాఠీలోనే కాకుండా హిందీ, ఇంగ్లిష్ భాషల్లోని అయిదువేలకు పైగా పుస్తకాలు ఇక్కడ కొలువుదీరాయి. పిల్లల కథలు, వార పత్రికలు మొదలు ప్రాచీన సాహిత్యం, సైన్స్ ఫిక్షన్ వరకూ విభిన్న రకాలు ఉంటాయిందులో. రోజుకు వంద మందికిపైగా ఈ హోటల్కి వచ్చి నచ్చిన వాటిని చదువుతుంటారు. పుస్తకపఠనం అందరికీ అలవాటు చేయాలన్న ఉద్దేశంతో స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతోపాటు మిగతా ప్రత్యేకదినాల్లో ఉచిత పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని నడుపుతుంది భీమాబాయ్. అంతేకాదు, కవి సమ్మేళనాలు, సామూహిక పుస్తక పఠన కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, పుస్తక చర్చల్లాంటి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుంటారిక్కడ. ఇంత పెద్దవయసులోనూ రోజుకు కనీసం పది పేజీలు చదవకుండా నిద్రపోరట భీమాబాయ్. ‘ఔషధాలు శరీరాన్ని బాగుచేస్తే… పుస్తకాలు మనసును బాగుచేస్తాయి…’ అని చెప్పే ఈ అమ్మ అక్షరాన్నీ అన్నమంత ప్రేమగా వడ్డిస్తున్నది కదూ!