జోగులాంబ గద్వాల : అర్హులైన విద్యార్థులకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ ( Best Available ) పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పిస్తుందని, ఎంపికైన విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha Sheikh ) అన్నారు. జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఐడివోసి సమావేశపు మందిరంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులను లక్కీ డిప్ విధానంలో కలెక్టర్ ఎంపిక చేశారు.
నాన్ రెసిడెన్షియల్ ఒకటవ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 57 సీట్లు ఉండగా, మొత్తం 265 మంది దరఖాస్తు చేసుకోగా గ్రూప్ 1, 2, 3లకు సంబంధించి మహిళా రిజర్వేషన్స్, జనరల్ కోటాలో నిబంధనల ప్రకారం డిప్ ద్వారా విద్యార్థులను ఎంపిక చేశారు. రెసిడెన్షియల్ ఐదవ తరగతిలో ప్రవేశాలకు మొత్తం 59 సీట్లు ఉండగా గ్రూప్ 1, 2, 3లకు సంబంధించి మొత్తం 310 మంది దరఖాస్తు చేసుకోవడంతో అర్హులైన వారిలో నుంచి డిప్ విధానంలో విద్యార్థులను ఎంపిక చేశారు.
వివిధ గ్రూపులకు సంబంధించి వెయిటింగ్ లిస్టు ప్రాతిపదికన కొంతమంది విద్యార్థులను కూడా డిప్ విధానంలో ఎంపిక చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంపికైన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నుషిత, ఏఎస్సీడబ్ల్యూవో నాగరాజు, సెక్టోరియల్ అధికారి కర్రెప్ప, బీచుపల్లి గురుకుల విద్యాలయ ప్రిన్సిపల్ రామాంజనేయులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.