చాయ్ ‘రోజుకు ఆరేడు కప్పులైనా గొంతులో దిగాల్సిందే’ అంటున్నది పల్లవి నిగమ్ సహాయ్. చాయ్ పట్ల మమకారమే ఆమెను పరిశోధకురాలిగా మార్చింది. ఆ అనుభవాలతో ‘ఎ సిప్ ఇన్ టైం’ పుస్తకం రాసింది. భారతదేశంలోని అద్భుతమైన టీ రుచులను, వాటి నేపథ్యాలను ఇందులో పరిచయం చేసింది. అస్సాం, అరుణాచల్ప్రదేశ్, డార్జిలింగ్, మున్నార్ టీ ఆకులలోని వైవిధ్యాన్ని వివరించింది. చాయ్కి ముందు మనం తీసుకునే స్నాక్స్.. చాయ్ రుచిని మరింత పెంచాలన్నది ఆమె అభిప్రాయం.
దాల్చినచెక్కతో చేసే బన్ గురించీ ఇందులో పరిచయం చేసింది. “ఏలకుల టీ పొద్దున తాగితే బావుంటుంది. మీట్ శాండ్విచెస్, కుకీలతో లెమన్ టీ బావుంటుంది. చిన్నప్పుడు జలుబు, గొంతునొప్పి వస్తే మా అమ్మ వేడివేడి టీ ఇచ్చేది. అందులో ఉప్పు, మిరియాలు కలిపేది. ఆ రుచి గుర్తొచ్చి ఎప్పుడెప్పుడు మేం జబ్బు పడతామా, టీ తాగుతామా అని ఎదురుచూసే వాళ్లం” అంటూ గతాన్ని నెమరేసుకుంటున్నది పల్లవి. మధ్యప్రదేశ్కు చెందిన ఈ రచయిత్రి, బీహార్ వ్యక్తిని వివాహమాడారు. బీహార్లో ఉండే రుచులపైన “ద భోజ్పురి కిచెన్” అనే పుస్తకం కూడా రాయడం విశేషం.