ఒక ఆలోచన. ఆ ఆలోచనకు రూపం ఇవ్వాలనే సంకల్పం. సమష్టి కృషి. సర్కారు చొరవ. అధికారుల ప్రోత్సాహం. కుటుంబ సభ్యుల అండదండలు. అన్నీ తోడై.. మహిళల జీవితాలను మార్చేస్తున్నాయి. సరికొత్త ఆదాయ వనరును సృష్టిస్తున్నాయి.
ఆహార ఉత్పత్తుల రంగంలో సూర్యాపేట మహిళలు సంచలనాలు సృష్టిస్తున్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని ఇంటివద్దే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. చేతినిండా డబ్బు సంపాదిస్తున్నారు. రెండు నెలల క్రితం వరకు.. బ్యాంకు రుణాలు తీసుకొని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పిన మహిళల సంఖ్య మహా అయితే అరవై లోపు. ఇదంతా ఇప్పుడు చరిత్ర. అతి తక్కువ వ్యవధిలోనే జిల్లాలో యూనిట్లు గణనీయంగా పెరిగాయి. రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా వంద యూనిట్లు దాటలేదు. సూర్యాపేట కలెక్టర్గా వెంకట్రావ్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. మహిళలు, అధికారులు, బ్యాంకర్లతో నిరంతరం సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తూ.. లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. యూనిట్ల సంఖ్య పెరుగుతున్నది. రూ.2 లక్షల నుంచి 5 లక్షల రూపాయల వరకూ రుణాలు తీసుకుంటూ.. పిండి మిల్లులు, స్వీట్ షాపులు, బేకరీలు, డెయిరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మొదలైనవి ఏర్పాటు చేస్తున్నారు. విజయవంతంగా నడిపిస్తున్నారు కూడా. ఈ ఏడాది 389 మంది మహిళలకు సుమారు రూ.32 కోట్లు మంజూరు చేసి.. వివిధ యూనిట్ల ఏర్పాటుకు సహకరించాలన్నది లక్ష్యం. ఇప్పటికే 192 మందికి దారి చూపగలిగారు. త్వరలోనే లక్ష్యాన్ని అధిగమించడం ఖాయమని చెబుతున్నారు. కాబట్టే, మహిళల ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల విషయంలో సూర్యాపేట ఇతర జిల్లాలకు అందనంత ఎత్తులో ఉన్నది. అగ్రస్థానంలో నిలుస్తున్నది.
వందల నుంచి వేలలోకి..
గతంలో ‘సమభావన’ గ్రూపు నుంచి అప్పు తీసుకొని చిన్నచిన్న వ్యాపారాలతో కుటుంబానికి కొంతమేర ఆర్థిక భరోసా కల్పించిన మహిళలే ఇప్పుడు.. ప్రభుత్వ చొరవతో బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుని వ్యాపారాలు విస్తరిస్తున్నారు. మరింత ఆదాయం పొందుతున్నారు. పదిహేనేండ్ల క్రితం నూతనకల్ మండలం టీక్యా తండాకు చెందిన లావుడ్య విజయ జాతర్లలో విక్రయించే తినుబండారాలు తయారు చేసేది. ఎక్కడ ఏ జాతర జరిగినా స్వయంగా వెళ్లి హోల్సేల్ వ్యాపారులకు విక్రయించేది. అధికారులు రూ.5 లక్షల రుణం ఇప్పించడంతో ఇంటి దగ్గరే కార్ఖానా ఏర్పాటు చేసింది. బస్తాలకొద్దీ ముడి సరుకులు తెప్పించుకుని, మరో నలుగురికి ఉపాధి కల్పిస్తూ .. స్వీట్లు, మురమురాల హోల్సేల్ వ్యాపారిగా ఎదిగింది. ఆమె భర్త నాగులు కూడా వ్యవసాయాన్ని పక్కనపెట్టి భార్యతోపాటు ఇదే వ్యాపారం చేస్తున్నాడు. నెలనెలా బ్యాంకు ఈఎంఐ, కరెంటు బిల్లు, సిబ్బంది వేతనాలు తదితర ఖర్చులు పోనూ రూ. 40వేలకు పైగా సంపాదిస్తున్నారు ఆ దంపతులు. జిల్లాలో ఇలాంటి విజయ గాథలు అనేకం వినిపిస్తాయి, కనిపిస్తాయి.
లక్ష్యాన్ని అధిగమిస్తాం
జిల్లాలో చిరు వ్యాపారాలు చేసుకునే మహిళా సంఘాల సభ్యులను మరింత ప్రోత్సహిస్తున్నాం. అధికార యంత్రాంగం చొరవ, బ్యాంకుల సహకారం కారణంగా యూనిట్ల సంఖ్య పెరుగుతున్నది.
– ఎస్.వెంకట్రావ్, కలెక్టర్, సూర్యాపేట